Telugu Politics: రాజకీయమంటే పోటీలు, గెలుపోటములు ఉంటాయి.. ఆ గెలుపోటములు ప్రభావితం చేసేది ఆ నాయకుల పోరాటాలు, యాత్రలు.. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ పాదయాత్ర సెంటిమెంట్ ఎక్కువగా ఉంది. అధికార పక్షంలో ఉన్న వాళ్లకు అటువంటి యాత్రలు కుదరవు కానీ.. ప్రతిపక్షంలో ఉన్నవాళ్లకు తప్పదు కదా… అందుకే 2004 లో దివంగత వైఎస్ నాడు శ్రీకారం చుట్టిన పొలిటికల్ పాదయాత్రలు నేటికీ కొనసాగుతున్నాయి. 2009లో చంద్రబాబు వస్తున్నా మీ కోసం అంటూ బస్సు యాత్ర చేసినా ప్రయోజనం లేకపోయింది. అందుకే 2014 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేశారు. అదే సమయంలో వైసీపీ తరపున షర్మిల కూడా పాదయాత్ర చేసినప్పటికీ చంద్రబాబుకే మంచి ఫోకస్ ఏర్పడింది. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు జగన్ చేసిన పాదయాత్రతో పాత రికార్డులన్నీ చెరిగిపోయాయి. ఇక ఇప్పుడు 2024 ఎన్నికల సీజన్ వచ్చేస్తుంది. పాదయాత్రల సమయం మొదలయింది. అందుకే ముహుర్తాలు కూడా ఫిక్సవుతున్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరు..? ఎప్పుడు పాదయాత్ర చేసే వీలుంది..? ఆల్రెడీ జరిగిన చర్చల సమాచారం ఏంటి..!? అనేది ఓ సారి తెలుసుకుందాం..!
Telugu Politics: షర్మిల అక్టోబర్ నుండి.. రేవంత్ డిసెంబర్ ..!?
తెలంగాణలో నిన్ననే పార్టీని ప్రారంభించిన వైఎస్ షర్మిల భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నుండి తెలంగాణ వ్యాప్తంగా భారీగా పాదయాత్ర చేపట్టనున్నట్టు ఆమె నిన్న ప్రకటించారు. తెలంగానలో దాదాపు 80 శాతం నియోజకవర్గాలు కవర్ అయ్యేలా పాదయాత్రకు డిజైన్ చేస్తున్నారు. దీని కంటే ముందుగానే జిల్లాల కమిటీలు, నియోజకవర్గాల బాధ్యులని నియమించి, సిద్ధం చేయాలని ఆమె భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా భారీ పాదయాత్రకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఆయన కూడా దాదాపు 100 నియోజకవర్గాల్లో తాను నడిచేలా.. ప్రజలు అందర్నీ కలుసుకునేలా ప్లానింగ్ లో ఉన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుండి తన పాదయాత్ర మొదలు పెడితే బాగుంటుందని ఆలోచనలో రేవంత్ ఉన్నారట. డిసెంబర్ నుండి వచ్చే ఏడాది జూన్ వరకు చేస్తే… 2022 జూన్ నుండి 2023 వరకు ఇతర యాత్రల సహా… తెలంగాణలో క్షేత్ర సమస్యలపై అధ్యయనం చేసినట్టు ఉంటుందని ఆయన వర్గం పేర్కొంటుంది. తెలంగాణాలో ఇటు షర్మిల, అటు రేవంత్ రెడ్డి ఇద్దరూ భారీ యాత్రలకు సన్నాహాలు చేస్తుండటమే తెలంగాణా రాజకీయాన్ని ఉన్నట్టుండి మలుపు తిప్పేసినట్టు చెప్పుకోవచ్చు.
ఏపీలో పవన్ – లోకేష్ ..!?
ఇక ఆంధ్ర ప్రదేశ్ లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాదయాత్ర చేస్తారని సమాచారం. ప్రస్తుతానికి జనసేనలో జరుగుతున్నా అంతర్గత చర్చల ప్రకారం వచ్చే ఏడాది ఆగష్టు నుండి 2023 ఏప్రిల్ వరకు ఏపీలో సుదీర్ఘ పాదయాత్ర చేయాలని పవన్ యోచిస్తున్నారని సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ కి ఉన్న సినీ క్రేజ్ దృష్ట్యా అభిమానులని అదుపు చేయడం కష్టమవుతుంది కాబట్టి.. ఏమైనా శృతిమించి సంఘటనలు ఎదురయ్యే అవకాశాలున్నాయి కాబట్టి పవన్ దీనిపై పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది.
* ఇక టీడీపీలో నారా లోకేష్ భారీ పాదయాత్రకు సన్నాహాల్లో ఉన్నారు. చంద్రబాబు చేయాలనీ భావించినప్పటికీ 70 ఏళ్ళు పైబడిన వయసులో చేయడం అంత భావ్యం కాదని, ఆరోగ్యం సహకరించకపోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఇప్పుడిప్పుడే నాయకుడిగా ఎదుగుతున్న నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని దాదాపు 120 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా పాదయాత్ర చేయాలని.. ఆ ఆర్వాత చంద్రబాబు బస్సు యాత్ర చేస్తే బాగుంటుందని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై తుది దశ తీసుకురావాల్సి ఉంది.