రెండు తెలుగు రాష్ట్రాలు లోని ముఖ్య పట్టణాలను కేంద్రాలుగా చేసుకొని గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. దేశంలో ఎక్కడా గంజాయి దొరికినా… వాటి మూలాలు మాత్రం చివరికి తిరిగి తిరిగి హైదరాబాద్ లేదా విశాఖపట్టణం లో ఉంటున్నాయి. యువకులు, మధ్య వయస్కులు, వయసు మళ్ళిన వారు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ ఆకును సేవిస్తున్నారు…
ఏకంగా పండిస్తున్నారు….
విశాఖపట్నం, హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లో గంజాయి కి అడ్డాగా మారాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే కొందరు యధేచ్చగా గంజాయి సాగు చేస్తున్నారు. అక్కడినుండి నగరాలకు విదేశాలకు కూడా తరలిస్తున్నారు. స్మగ్లర్లు వాటిని సేకరించి వాటిని సవ్యంగా వారు అనుకున్న ప్రాంతాలకు వెళ్లేలా చూస్తారు. అక్కడక్కడ చెక్ పోస్టులు పెట్టినా కూడా ఇదంతా ఆగడం లేదు. ఎన్నో ప్లాన్లు వేసి పోలీసుల కళ్లు గప్పి గంజాయిని తరలిస్తారు. అక్కడక్కడ పట్టుపడతారు కానీ అధిక మొత్తం దారి మళ్ళించి యథేచ్ఛగా తీసుకుపోతున్నారు.
ఇక్కడి నుండే ఎక్కడికైనా….
విశాఖపట్నం జిల్లా లోని అరకు, పాడేరు, చింతపల్లి ప్రాంతాలలో గంజాయి భారీగా సాగు చేస్తున్నట్లు సమాచారం. టూరిస్టులు అక్కడికి వచ్చి వెళ్ళేటప్పుడు భారీగా గంజాయి సేకరించుకుని వెళుతున్నారు. ఇలా సేకరించిన దానిని స్మగ్లర్లు మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఒరిస్సా, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు సమాచారం తాజాగా అగనంపూడి లో గ్యాస్ సిలిండర్ కింది భాగం కోసి గంజాయి ప్యాకెట్లు స్మగ్లర్లు దొరికిన విషయం తెలిసిందే..
జంట నగరాల్లో పాగా…
ఇప్పుడు కొత్త విషయం ఏమిటంటే… ఇదే గంజాయిని స్మగ్లర్లు ద్రవపదార్థం లోనూ తీసుకెళ్తున్నారు. హైదరాబాద్ కూడా తక్కువేమీ కాదు. విశాఖపట్నం నుండి తీసుకువచ్చిన గంజాయిని హైదరాబాద్లోనే నిలువ చేస్తున్నట్లు సమాచారం. ఇక జంట నగరాల్లో ఉండే అనేక ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో స్మగ్లర్లు వీటిని ఉంచగా విద్యార్థులకు విక్రయిస్తున్నారు అని సమాచారం. తాజాగా హైదరాబాద్ లోని ఉప్పల్ లో రెండు వందల కిలోల గంజాయి పట్టుబడింది. ధర తక్కువ.. మత్తు ఎక్కువ అని యువత దీని పట్ల ఆకర్షితులు అవుతున్నారు అని రిపోర్టులు చెబుతున్నాయి.