Telugu States Water issue; తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం జల వివాదం నలుగుతుంది. కృష్ణా జలాల కోసం రెండు రాష్ట్రాల పాలకులు, మంత్రులు ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటున్నారు. తెలంగాణ మంత్రులైతే చాలా అడుగులు ముందుకేసి వైఎస్సార్ ని, జగన్ ని దొంగ, దోపిడీ దారులు అంటూ సంబంధం లేని మాటలు కూడా మాట్లాడారు. ఏపీ కంటే తెలంగాణ మంత్రులు ఈ వివాదంలో ఎక్కువ దూకుడుమీదున్నారు. అయితే అన్నిటికీ మించి కృష్ణ జలాలు ఇరు రాష్ట్రాలకు సమమే.. చేరి సగం ఇవ్వాలనే వింత వాదన ద్వారా తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక అడ్డగోలు వాదన తెరపైకి తెచ్చారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా 2015లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లెక్కలను ఆమోదించి.. మొత్తం అంగీకరించిన కేసీఆర్ ఇప్పుడు కొత్త డిమాండ్ తెరపైకి తేవడమే పెద్ద సంచలనంగా మారింది. అమలు కాదు, జరగదు అని తెలిసి కూడా ఇటువంటి డిమాండ్ తేవడం వెనుక కేసీఆర్ రాజకీయ లక్ష్యాలు ఉన్నాయని ఆయన రాజకీయ ప్రత్యర్ధులు విమర్శిస్తున్నారు. నిజానికి కేసీఆర్ డిమాండ్ విడ్డూరమే. భౌగోళికంగా.. జనాభా పరంగా.. సాగు భూము పరంగా దేనిలోనూ ఏపీతో సమంగా లేని తెలంగాణాకి కృష్ణా జలాలు సగం కావాలని కోరడం విడ్డురమైన వాదనగానే అక్కడి నేతలు కూడా చూస్తున్నారు. ఇంతకు ఈ వివాదానికి కారణమైన రాయలసీమ ఎత్తిపోతల అంటే ఏంటి..? దీని వలన నష్టాలు ఏమిటి.., తెలంగాణ అభ్యంతరాలు ఎందుకు అనే అంశాలను ఓ సారి చూద్దాం..!
Telugu States Water issue; రాయలసీమ ఎత్తిపోతల ఎందుకంటే..?
కర్నూలు జిల్లాలోని పోతిరెడ్డిపాడు అనే గ్రామంలో ఈ ప్రాజెక్టు 1995 కి ముందే ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభమయింది. కడప, కర్నూలు జిల్లాలకు అప్పట్లో 11 వేల క్యూసెక్కులు నీటివి తోడేందుకు ఈ పథకం ప్రారంభమయింది. ఆ తర్వాత 2004 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక దీన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచారు. అప్పుడే తెలంగాణాలో నిరసనలు వ్యక్తమయ్యాయి. కానీ వైఎస్ దీన్ని పూర్తి చేసి.. 44 వేల క్యూసెక్కులను రాయలసీమకి తరలించే ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు జగన్ పూర్తిగా దీన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచారు. దీని వలన రోజుకి మూడు టీఎంసీల నీరు వెళ్తుంది. అంటే సుమారుగా 140 టీఎంసీలు తరలించే పథకం ఇది. దీని వలన రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటూ నెల్లూరు జిల్లాలోని కొన్ని మండలాలకు నీరు అందుతుంది.
తెలంగాణాకి నష్టం ఎందుకు..!? వారి వాదనేమిటి..!?
శ్రీశైలం రిజర్వాయర్ దగ్గరే కుడికాలువ ఆనుకుని ఆ ఎత్తిపోతల నిర్మాణం చేపట్టనున్నారు. ఇప్పటికే తెలంగాణ వైపు శ్రీశైలం అనుకుని కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్ఎల్బీసీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు మూడూ కలిపినా 12 వేల క్యూసెక్కులకు మించి లేదు. కానీ రాయలసీమ ఎత్తిపోతల ఒక్కటే 80 వేల క్యూసెక్కులు. పైగా… ఈ రాయలసీమ ఎత్తిపోతల లిఫ్ట్ శ్రీశైలంలో నీటిమట్టం 805 అడుగులు చేరితే చాలు.. నీటిని మళ్ళిస్తుంది. కానీ తెలంగాణలోని మూడు ప్రాజెక్టులో కూడా 827 అడుగుల నీటి మట్టం ఉంటేనే నీటిని మళ్లించగలవు. సో.. తెలంగాణకు రెండు విధాలుగా నష్టం జరుగుతుంది అనేది ఆ రాష్ట్ర వాదన. ఒకటీ నీటిమట్టం తక్కువ ఉన్నప్పుడు కూడా రాయలసీమ ఎత్తిపోతల ద్వారా శ్రీశైలం నీరు వెళ్ళిపోతుంది. 80 వేల క్యూసెక్కులు పోతుంది. తక్కువ నీటి మట్టం ఉన్నప్పుడు ఎక్కువ నీటిని తోడేస్తుంది. అంటే ఎంతో ఎక్కువ వర్షాలు పడితేనే ఈ రాయలసీమ ఎత్తిపోతల దాటుకుని.. శ్రీశైలం నీరు 827 కి చేరాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రాజెక్టులకు నీరు అందుతుంది. అయితే ఏపీకి 512 టీఎంసీ ల కేటాయింపు ఉన్న నేపథ్యంలో మా వాటిని మేము వాడుకోడానికే ఈ పథకాలు నిర్మిస్తున్నామని ఏపీ వాదిస్తుంది. ఏపీ వాదనలతో ఏ మాత్రం ఏకీభవించని తెలంగాణ వారి పరిధికి మించి విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ.. కొన్ని రోజులుగా నీటి వాడకం ప్రారంభించారు. ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది..!