ఏపీ సీఎం జగన్ 13 నెలల పాలనలో ఊహించని నిర్ణయాలు తీసుకున్నారు. రాజకీయంగా టీడీపీని దెబ్బ తీసే వ్యూహం అమలు చేస్తూనే..తాను తన సొంత మనుషులుగా దగ్గరికి తీసుకున్న వారికి సైతం తన మార్క్ ట్రీట్ మెంట్ ఇస్తున్నారు.
టీడీపీ ఎమ్మెల్యేలను అధికారికంగా వైసీపీలోకి తీసుకోవటం లేదు. అదే సమయంలో వారు టీడీపీలోనే ఉండటం లేదు. ఇక..గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడ్డారనే కారణంతో అచ్చెన్నాయుడు లాంటి వారిని ఇప్పటికే ఫిక్స్ చేసేసారు. ఇక, అవినీతి పేరుతో టార్గెట్ చేస్తున్న లిస్టు చాలా ఉందనే ప్రచారం ఉంది. అయితే, పాలనా పరంగానూ ప్రక్షాళనకు జగన్ సిద్దమయ్యారు. తాజాగా..అజయ్ కల్లం..పీవీ రమేష్ వంటి వారినే పక్కన పెట్టిన ముఖ్యమంత్రి ఏరి కోరి ఎన్నో అంచనాలతో పదవులు కట్టబెట్టిన వారి పని తీరు ఆధారంగా ఇప్పుడు చర్యలకు సిద్దం అవుతున్నట్లుగా అధికార వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
అధికారులు..జగన్ మార్క్ ట్రీట్ మెంట్..
ఎన్నికల వేళ..అంతకు ముందు..ఆ తరువాత జగన్ కు తోడుగా నిలిచిన నాటి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం..తరువాత అజయ్ కల్లం..ఢిల్లీ నుండి ఏరి కోరి తెచ్చుకున్న పీవీ రమేష్ ను ముఖ్యమంత్రి ఇప్పటికే పక్కన పెట్టేసారు. ఇక..జగన్ కేసుల విషయంలో జైలుకు సైతం వెళ్లిన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని ఏపీ సర్వీసుల్లోకి తెచ్చేందుకు జగన్ చేయని ప్రయత్నం లేదు. నేరుగా ప్రధాని వద్దకు విజయ సాయి రెడ్డిని పంపించి మరీ ప్రయత్నాలు చేసారు. కానీ, అది సాధ్యపడలేదు. ఇక, స్టీఫెన్ రవీంద్ర ను సైతం ఏపీకి తెచ్చే ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. తన కోసం నిలిచిన వారికి అండగా నిలుస్తారని నాడు వైయస్సార్ నుండి నేడు జగన్ వరకు పేరు ఉంది. కానీ, ఇప్పుడు ఎల్వీ…కల్లం వంటి వారి విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం ద్వారా సీఎం జగన్ తీరు పైన కొత్త చర్చ మొదలైంది. ఆర్దిక వ్యవహారాల్లో జోక్యం కారణంగానే కల్లం ను తప్పించారనే ప్రచారం ఉన్నా.. ఉత్తరాది లాబీయింగ్ అండతో తన పేషీలోని ఒక కీలక అధికారి సూచనల మేరకే జగన్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారనే చర్చ ఏపీ అధికార వర్గాల్లో జరుగుతోంది.
నెక్ట్స్ టార్గెట్ వీళ్లేనంటూ…
ముఖ్యమంత్రి తన కార్యాలయం నుండే ప్రక్షాళన ప్రారంభించినట్లుగా కనిపిస్తోంది. 13 నెలల పాలన తరువాత తన తండ్రి జన్మదినం నాడు సీఎం తన కార్యాలయంలో కీలక అధికారుల విషయంలో అధికారాల మార్పులు..చేర్పులు చేసారు. ఇక, ఇప్పుడు సలహాదారుల పని తీరు పైన జగన్ ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తోంది. తనకు అనేక సమయాల్లో తోడుగా నిలిచిన వారికి ముఖ్యమంత్రి కీలక పదవులు కట్టబెట్టారు. అయితే, అందులో ఎంతమంది ఇప్పుడు నిజంగా సీఎం కు మేలు చేస్తున్నారు..ప్రభుత్వ ఇమేజ్ పెంచటానికి పని చేస్తున్నారు..డామేజ్ అవుతున్న వేళ ఎవరు ముందుకు వస్తున్నారనే విషయం పైన సీఎం పూర్తి సమాచారం సేకరిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో మీడియా..లీగల్ విభాగాలపైనా ముఖ్యమంత్రి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పటికే కొందరు ప్రభుత్వ న్యాయవాదులను తప్పించి..కొత్త వారికి అవకాశం ఇచ్చారు. తెలంగాణకు చెందిన వారికి సైతం కీలక పోస్టుల్లో నియమించారు. విమర్శలనకు పక్కన పెట్టి మరీ వారికి ప్రాధాన్యత ఇస్తే..ఏపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని జాతీయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ విమర్శలు వెల్లు వెత్తుతున్నా.. వారు హోదాలకే పరిమితం కావటం మినహా.. ముఖ్యమంత్రికి మేలు చేసే విధంగా ముందుకు రావటం లేదనే అభిప్రాయం ఉంది. దీంతో.. అతి త్వరలోనే పలువురు సలహాదారుల విషయంలో ముఖ్యమంత్రి జగన్ ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంటారని విశ్వసనీయ సమాచారం. దీంతో..ముఖ్యమంత్రి ఎవరి మీద వేటు వేస్తారనే ఉత్కంఠ ఇప్పుడు సొంత పార్టీ నేతల్లో కనిపిస్తోంది.