విద్యావ్యవస్థకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ విధానాలలో తప్పులు, లోపాలు ఉన్నాయి అని చెప్పక తప్పదు. కానీ బోధనా ప్రణాళిక, అమలు బాధ్యతలను కాంగ్రెస్ ప్రభుత్వాలు చాలా మటుకు అనుభవజ్ఞులైన, తెలివైన, తమ తమ రంగాల్లో నిష్ణాతులైన వారికే అప్పచెప్పాయి.
కొన్నిసార్లు కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ పార్టీ విమర్శకులైన వారిని ముఖ్యమైన పదవులలో నియమించిన తార్కాణాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి ప్రముఖ మార్క్సిస్టు మేధావి ఇర్ఫాన్ హబీబ్ ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ చైర్ పర్సన్ గా నియమించారు. అలాగే ప్రొఫెసర్ కృష్ణ కుమార్ను నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(ఎన్.సి.ఈ.ఆర్.టి)కి అధ్యక్షులుగా నియమించారు.
కొద్ది రోజుల క్రితం ఎన్.సి.ఈ.ఆర్.టి తొమ్మిదవ తరగతి చరిత్ర పాఠ్యపుస్తకాల నుండి కుల పోరాటాలకీ, వలసవాదానికీ సంబంధించిన అధ్యాయాలని తొలగించాలని నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ సాపేక్షిక ఉదారవాదానికి ఒక ప్రశంసాపూర్వకమైన ఉదాహరణ ఈ పాఠ్యపుస్తకాలు. ఈ పాఠ్యపుస్తకాలు చరిత్ర రచనకూ, బోధనకూ సంబంధించి బడి పిల్లలకు ఒక కొత్త ధృక్పదాన్ని అందించాయి. ఈ పాఠ్యపుస్తకాలని అధ్యాపకులతో, విద్యార్ధులతో, నిపుణులతో జరిగిన దీర్ఘకాల చర్చల తరువాత రూపొందించారు. ఈ పాఠ్యపుస్తకాల ద్వారా చేసిన ప్రయత్నం ఏమిటంటే వివిధ సామాజిక నేపధ్యాల నుండి వచ్చే పిల్లల రోజువారి అనుభవాలకి చరిత్రని ఒక దిక్సూచిగా బోధించడం. అలాగే చరిత్రని ఇష్టపడుతూ చదివే విధంగా వాటిని రూపొందించటం, ఆ విధంగానే వారు ఇష్టపడే సంస్కృతి, వినోద కాలక్షేపం, ఆటలు అనేవి చారిత్రకంగా ఏ విధంగా ఉనికిలోకి వచ్చాయి అని తెలియచెప్పే ప్రయత్నం కూడా అందులో మిళితమై ఉంది. అలాగే కొంత మంది పిల్లలు తమ దైనందిన జీవితాలలో అనుభవించే అణిచివేత, దోపిడీ – వాటికి కారణం అయిన సామాజిక, వస్తుగత, సాంస్కృతిక అధికారం గురించి పిల్లలకి పరిచయం చేసే ఉద్దేశం కూడా దీని వెనుక ఉంది.
ఇక్కడే అసలు విషయం ఉంది. పాఠ్యపుస్తకాల నుండి కొన్ని అధ్యాయాలను జాగ్రత్తగా ఎంచుకుని తొలగించటానికి కారణం ఇదే. మూడు అధ్యాయాలను తొలగించారు. అవి వస్త్రధారణకి సంబంధించి ఒకటి, ఆటలకి సంబంధించి ఒకటి, కార్మికులు కర్షకులకి సంబంధించి మరొకటి. ఈ ఎంపిక అర్థంలేని గందరగోళంగా అనిపించవచ్చు. కానీ దీనికొక తర్కం ఉంది. ఈ తొలగింపు అనేది కేవలం ఆ అధ్యాయాలు రాసిన రచయితలకి, ఆధునిక భారతదేశం మీద పరిశోధన చేస్తున్న చరిత్రకారులకి మాత్రమే సంబంధించిందని అనుకోవటానికి లేదు. మన అందరికి సంబంధించిన ఒక్క భారీ ప్రక్రియతో ఈ తొలగింపు ముడిపడి ఉంది.
ఈ అధ్యాయాలలో చాలా విషయాల గురించి రాశారు. అందులో మనిషిని పూర్తిగా అణిచివేసే కులం, వర్గం గురించి – ఆఖరికి ఎవరు ఎటువంటి ఆటలు ఆడాలి, ఎవరు ఎందుకు, ఎటువంటి వస్త్రాలు ధరించాలి అని నిర్ణయించే వీటి అధికారం గురించి రాశారు. ఆర్థికంగా కుప్పకూలిపోయిన కార్మికులు, కర్షకులు తమ నిరసనలని రాజకీయ రణరంగంలో ఏ విధంగా తెలియచేయగాలిగారు అనే దాని గురించి రాశారు. గతం మనలను ఎంత అంటుకుని ఉంటుందీ విద్యార్ధులకు దీని ద్వారా అర్ధం అవుతుంది.
ఇండియా, సమకాలీన ప్రపంచం – 1; తొమ్మిదవ తరగతి చరిత్ర పుస్తకం
ఈ తొలగింపు అనేది చాలా ప్రమాదకరమైనది. ఇటువంటి అధ్యాయాలు లేకపోతే తమ చుట్టూ తమని అల్లుకుపోయి ఉన్న ఈ కులం, వర్గం వంటి క్లిష్టమైన వాస్తవాల గురించి పిల్లలకి తెలిసే అవకాశం లేదు. వార్తాపత్రికలు కులోన్మాద దాడుల గురించిన వార్తలని ఎక్కడో ఎవరికీ కనిపించిన ఒక మూల ప్రచురిస్తున్నాయి, టి.వి.ఛానళ్ళు అయితే అసలు వాటి గురించిన వార్తలని ప్రసారమే చెయ్యటంలేదు; ఒక వేళ వాటి గురించి ప్రస్తావించినా- అది కూడా చాలా క్లుప్తంగా- దానికి సంబంధించిన ఫాలో అప్ ఉండదు. ఫలితంగా అటువంటి వార్తలు తొందరలోనే గాల్లో కలిసిపోతున్నాయి. వర్గానికి సంబంధించిన వార్తలతో జరుగుతున్న తంతు కూడా ఇదే.
ప్రజల అవగాహన నుంచీ జ్ఞాపకాల నుంచీ తుడిచివెయ్యాలని పాలకవర్గాలు ప్రయత్నిస్తున్న సంగతులను ఈ అధ్యాయాలు వివరించాయని ఈ తొలగింపుల ద్వారా రుజువయింది. అణిచివేత ఛాయలు ఎంత దూరం సాగేదీ బయటపడింది. వస్త్రధారణ గురించిన అధ్యాయాన్ని తొలగించటానికి ముఖ్య కారణం- ప్రతి పురుషుడు , మహిళ, పిల్లలు రోజూ చేసే అ పని సహజత్వాన్ని ఎలా తొలగించిందీ, “నిమ్న కులస్థులు” ఫలానా రకమైన వస్త్రాలు ధరించాలి అని ఒకప్పుడు ఎలాంటి ఆంక్షలు విధించిందీ ఈ అధ్యాయం చరిత్రని ఉద్ఘాటిస్తూ వివరిస్తుంది. ఈ అధ్యాయం పిల్లలకి తమ వస్త్రాధారణ తాము భావించిన విధంగా సహజమైనది కాదనీ, తమ కులం, తమ తల్లిదండ్రుల పేదరికం, వారి పరపతి వంటి విషయాలపై ఆధారపడి అనూచానంగా వస్తున్నదనీ వివరిస్తాయి. వస్త్రధారణ అనేది సామాజిక, సైద్ధాంతిక, వస్తుగత శక్తుల మీద ఆధారపడి ఉంటుందే తప్ప తమ సొంత నిర్ణయానికి సంబంధించినది కాదు అని ఈ అధ్యాయాలు పిల్లలకు తెలియచేస్తాయి.
పిల్లలకి బాగా ఆసక్తి ఉండే ఆటల విషయాన్ని తీసుకుని దాని చరిత్రని విడమరిచి చెప్పే ప్రయత్నం మొదటిసారిగా ఈ పాఠ్యపుస్తకాల ద్వారానే జరిగింది. క్రీడలలో రాణించగలిగే ప్రతిభ ఉన్న యువ క్రీడాకారులకు సామాజిక చట్రంలో వారి స్థితి కారణంగా రాణించే అవకాశాలకు ఎలా దూరంగా ఉంచిందీ ఈ అధ్యాయం ద్వారా పిల్లలకు అర్ధమవుతుంది.
కార్మికులు, కర్షకులు, వారి పని పరిస్థితులు, వారి జీవితాలు, వారి పోరాటాలకి సంబంధించిన అధ్యాయాన్ని తొలగించటం ఊహకి అందనిది. మెజారిటీ భారతీయులు ఒకప్పుడు ఏ విధంగా బతికారు, తమని సంకెళ్లలో కట్టిపడేసిన పెత్తందారి, పెట్టుబడిదారి వ్యవస్థలను ఏ విధంగా నిరసించారు అన్న విషయాలను యువకులకి మనం ఏ విధంగా చెప్పగలం ఇప్పుడు? అందులోనూ ఈ రోజుల్లో అటువంటి శక్తులే మరింత క్రూరంగా వారిని అణిచివేస్తున్న సందర్భంలో ఇటువంటి పాఠాలు తొలగించటం ఎంత వరకు సబబు?
ఇదంతా వలస పాలన నాటి గతం, వలస పాలనను దీనికి బాధ్యులుగా చెయ్యవచ్చు. అయినప్పటికీ ఈ విషయాలను మరుగుపరచాలని ప్రయత్నించడం మనకు గందరగోళంగా కనిపించవచ్చు. జాతీయవాద చరిత్ర రచనలో జరిగిన ప్రయత్నం ఏమిటంటే ఈనాడు ఉన్న సామాజిక రుగ్మతలు అన్నిటికి కారణం పరాయి పాలనే అని, అవి ప్రాధమికంగా మంచివైన మన సాంప్రదాయాలని కలుషితం చేశాయని చెప్పుకురావడం. ఈ జాతీయవాద దృక్పధం కొన్ని ముఖ్యమైన అంశాలను బయటకి తీసుకువచ్చింది, ఆలాగే మరికొన్నింటిని తెర చాటునే ఉంచివేసింది. అణగారిన వర్గాలు అనుభవించిన హింసాత్మక అణిచివేతని బయటకి తీసుకువచ్చింది. కాకపోతే దానికంతటికీ కారణం పరాయి పాలనే అని తేల్చింది. దీని ప్రకారం పరాయి పాలనకి ముందు, తరువాత అనేవి ఉండవు.
కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ పాఠ్యపుస్తకాలు నేర్పించేది ఏమిటంటే వలసపాలనకు ముందున్న మన సాంప్రదాయాలు అన్నీ అంత ఉత్తమంగా, సమానత్వాన్ని కాంక్షించే విధంగా లేవు అని. ముఖ్యంగా కుల, లింగ సంబంధాల విషయంలో. అంతే కాక ఈ సాంప్రదాయాలు వలస పాలనతో పాటు అంతం కాని సంగతినీ, దోపిడీ లేని దేశం మనకు మిగిలలేదన్న వాస్తవాన్ని ఈ పాఠ్యపుస్తకాలు తెలియజెపుతాయి. కనీసం ఆత్మగౌరవం, సమానత్వం వైపు అడుగులు వేసే దేశం కూడా మిగలని వాస్తవాన్ని కళ్ల ముందుంచుతాయి.
బహుశా ఈ ఈ అధ్యాయాలలో పేర్కొన్న సమస్యలు – అది కూడా మనం వీటిని జననం, మరణం అంత సహజమైనవి అనుకోకుండా సమస్యలుగా గుర్తించదలుచుకుంటేనే- తెరచాటున మిగిలిపోయి ఉంటే పాలకులని అంతగా ఇబ్బంది పెట్టి ఉండేవి కాదేమో. కానీ పరిస్థితి అలా లేదు కదా. కష్టనష్టాలు ఓర్చుకుని కార్మికులు చేస్తున్న సమ్మెలు, వేల సంఖ్యలో పురవీధుల్లో రైతులు తీస్తున్న ర్యాలీలు, తమ భూములు, అడవులు, జీవనోపాధుల ధ్వంసానికి వ్యతిరేకంగా ఆదివాసీలు కొనసాగిస్తున్న ఆందోళనలు, మన జీవితంతో పెనవేసుకుపోయిన కుల రక్కసికి బలి పోయిన వేముల రోహిత్లు… ఇలా ఎన్నో జరుగుతున్నాయి. అంతేకాక దళితుల రోజువారి అవమానాల అంతానికి జిగ్నేష్ మేవాని, భీమ్ ఆర్మీ చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వారు నిర్మిస్తున్న ప్రజా పోరాటాలు ఉండనే ఉన్నాయి.
పెట్టుబడిదారి వ్యవస్థ గురించిన అధ్యాయం చాలా స్పష్టంగా చెప్పింది ఏమిటంటే జీవన్మరణ పోరాటాలలో ఎక్కడా మతపరమైన చీలికలు లేవని. ఆ అధ్యాయం చెప్పింది ఏమిటంటే భారతదేశ కార్మికులు, కర్షకులు తమ సాటి ముస్లిం మత కార్మికులు, కర్షకులని శత్రువులుగా చూడలేదు. రాజ్యం, ఆ రాజ్యాన్ని నడిపిస్తున్న పాలకుల మీదే తమ పోరాటం అని వారు స్పష్టంగా గుర్తించారు.
ఎన్.సి.ఈ.ఆర్.టి పాఠ్యపుస్తకాల తిరగరాతని మనం మిగతా చోట్ల జరుగుతున్న విషయాలతో ముడిపెట్టి చూడాలి. ‘దళిత’ పదాన్ని వాడకూడదు, వలస పాలన పదం అయిన షెడ్యూల్డ్ కాస్ట్ అనే పదం మాత్రమే వాడాలి అని మనకు చెబుతున్నారు. అతి సామాన్య జీవనం కోసం కూడా పోరాడాల్సివస్తున్న అణగారిన వర్గాల తరుపున వకాల్త పుచ్చుకున్న వారిని మావోయిస్టు కుట్రదారులనీ, దేశ ద్రోహులనీ నిందిస్తున్నారు. భారత సమాజంలో వర్గాల వారీగా, కులాల వారీగా బీటలు ఉన్నాయి. లింగ అసమానతలు, మెజారిటీ మతం, మైనారిటీల మతం మధ్య అసమానతలు ఈ సమాజంలో ఉన్న వాస్తవాలు. మరి అన్యాయం, దోపిడీ లేని ఒక అద్భుత, అఖండ దేశంగా భారత్ను చిత్రించేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు ఈ వాస్తవాలు విరుద్ధమైనవి కదా. అందుకనే ఈ వాస్తవాలను గుర్తు చేసే ఏ ప్రయత్నాన్నైనా జాతి వ్యతిరేకంగా ముద్రిస్తున్నారు.
మితవాదులు చిత్రించదలచుకున్న గతంతో వర్తమానం గట్టిగా విబేధిస్తున్నవేళ చరిత్రలోని అసలైన అంశాలను, పండితుల పరిశోధన ఫలితాలనూ తొలగించడమే వారి ముందున్న దారి. అలా తొలగించిన వాటిని తమకి నప్పిన వాటితో పూడుస్తారు. ఈ రోజు ఉదయం ఒక స్వయం-ప్రకటిత చరిత్రకారుడు రాసిన ఒక ఫేస్బుక్ పోస్ట్ చదివాను. అదేమిటంటే అల్లావుద్దీన్ ఖిల్జీ నలందలో తొంభై లక్షల పుస్తకాలని ధ్వంసం చేసాడట. ఆ చరిత్రని మన పాఠ్యపుస్తకాలు ఎందుకు నేర్పించడం లేదు అన్నది వారి ప్రశ్న.
పాఠ్యపుస్తకాల నుంచి ఒక పద్ధతి ప్రకారం వాస్తవ చరిత్రను తొలగిస్తున్నారు కదా..ఇక వాటిలోకి ఇటువంటి వక్రీకరణలు కుప్పలు తెప్పలుగా వచ్చి చేరతాయని మనం చాలా నమ్మకంగా ఆశించవచ్చు.
-తనికా సర్కార్
రచయిత చరిత్రకారిణి, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు
‘ద వైర్’ వెబ్సైట్ సౌజన్యంతో