“కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పరిపాలన” అనే నినాదం ఈనాటి ప్రపంచీకరణకి అనువైన బంగారు లేడి లాగా తోస్తున్నది. “మా ప్రభుత్వం దోహదకారిగా పని చేస్తుంది. మా ప్రభుత్వం దృష్టి అంతా కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పరిపాలన మీదనే.” అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెబుతుంటారు. “వ్యాపారం చేయడం ప్రభుత్వం పని కాదు”, అని ప్రకటిస్తుంటారు.
ఇటువంటి మాటలు వినటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ ఈ మాటల లోలోతుల్లో ఒక భయంకరమైన మరో ప్రపంచం దాగుంది. ఈ మరో ప్రపంచంలోనే అధో జగత్తుకు చెందిన వ్యాపార లావాదేవిలు జరుగుతుంటాయి. దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ సంస్థ ప్రైవేటికరణకి వ్యతిరేకంగా 2017 మే నెలలో మైసూరులో నిరసన ఉద్యమం జరిగింది. రక్షణ మంత్రిత్వ శాఖ అధీనంలో పనిచేసే భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ సంస్థకి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, మైసూరు లలో, కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ లో ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఈ వ్యాపార సంస్థ ఎప్పుడూ లాభాలలోనే నడుస్తున్నది. ఈ సంస్థకి చెందిన అన్ని కేంద్రాల దగ్గర కలిపి మొత్తం 4,500 ఎకరాల భూమి కూడా ఉంది. ఈ భూమి మార్కెట్ విలువ కొన్ని లక్షల కోట్లు ఉంటుంది. ప్రపంచ విపణిలో పోటీపడుతూ వర్క్ ఆర్డర్లు సంపాదిస్తుంది అనే మంచి పేరు కూడా ఈ సంస్థకి ఉంది.
ఈ ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేటు రంగానికి కట్టబెట్టే దురాలోచనలో భాగంగానే ఈ సంస్థలో తనకి ఉన్న 54 శాతం వాటాలలో 26 శాతం అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ సంస్థ ఉద్యోగులు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు దీని గురించి సామన్య ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయం మీద నేను దృష్టి పెట్టాను. “ ఈ సంస్థ నష్టాల్లో ఉండి ఉంటుంది. అందుకే ఈ సంస్థని మూసివేస్తున్నారు. వాళ్ళ ఉద్యోగాలు పోతాయనే ఈ ఉద్యోగులు ఇంత గోల పెడుతున్నారు.” ఇది ఈ విషయం మీద సామన్య ప్రజల అభిప్రాయం. ప్రజల సంపదని ప్రజల ఆజమాయిషీలో ఉంచటానికి వారు పోరాటం చేస్తున్నారు అని భావించిన ఒక్క మనిషిని కూడా నేను చూడలేదు. ప్రజల సంపద ప్రజలదే అని ప్రజలు అనుకోవటం లేదు. ఇదే భారతదేశ విషాదం.
సరళీకరణ విధానాలు మొదలయ్యిన నాటి నుండి ప్రజల సంపదని ప్రైవేటు రంగానికి ధారాదత్తం చేసే కార్యక్రమం నిరాటంకంగా సాగుతున్నది. మోదీ పరిపాలనలో అది పదింతలుగా పెరిగింది. మోదీ నిస్సిగ్గుగా ప్రజా ధనాన్ని ప్రైవేటు పాదాక్రాంతం చేస్తున్నారు. దీన్ని ఆయన ధైర్య సాహసాలతో కూడుకున్న పనిగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన మాటలు, హావభావాలు అన్నీ కూడా వేలంపాటదారుని మాటలు, హావభావాల మాదిరే ఉంటాయి. మూర్ఖునికే అమితమైన ధైర్య సాహసాలు ఉంటాయి అనే సామెతని ఇక్కడ మనం గుర్తుకి తెచ్చుకోవాలి. ఆయనకి ఈ విషయం తెలిసుంటే నోట్ల రద్దు, నిరుద్యోగం వంటి ఆయుధాల ద్వారా కొన్ని వేల మంది చావుకి కారణం అయి ఉండేవాడు కాదు. పెద్ద నోరేసుకుని ఎప్పుడూ అరుస్తూ ఉండే మనిషి నుండి మనం ఇంతకన్నా ఎక్కువ ఆశించలేం.
ప్రజా సంపదని ప్రైవేటుపరం చేసేందుకు వాజపేయి హయాంలో ‘పెట్టుబడుల ఉపసంహరణ విభాగం’ ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని సులభతరం చేసేందుకు పెట్టుబడుల ఉపసంహరణకి సంబంధించిన మంత్రిత్వ సంఘాన్ని ఏర్పాటు చేశారు. తరువాతి కాలంలో మోదీ అధికారంలోకి వచ్చాక ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశారు. ఈ నీతి ఆయోగ్ చేసే ముఖ్యమైన పని ఏమిటంటే ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మడం లేదా అందులో ప్రభుత్వ వాటాలను తగ్గించటం. 76 ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటు రంగం పాదాక్రాంతం చెయ్యటానికి నీతి ఆయోగ్ కంకణం కట్టుకుంది. ఈ ప్రైవేటికరణ కార్యక్రమాన్ని తొందరగా పూర్తి చెయ్యటానికి రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్కి చెందిన మేనేజర్లను నియమించుకుంది. బిఎస్ఎన్ఎల్ సంస్థని పూర్తిగా దివాలా తీయించి ఇప్పుడేమో దానిని ఒక ప్రైవేటు సంస్థకి కట్టబెట్టే ప్రయత్నాలలో ఉంది. రైల్వేకి కూడా ఇదే గతి కాచుకుని ఉంది. అంతే కాక అడవులతో పాటుగా, నదులని కూడా ప్రైవేటుపరం చేసేస్తారేమో అనే భయాందోళనలు ఉన్నాయి.
తన పూర్వికులు కాయకష్టంతో సంపాదించిన ఆస్థిని అమ్మేసి ఇంటిని నడిపే కొడుకుని మనం ఏమంటాము? దిగజారిపోయిన దుబారా మనిషి అంటాము. అలాగే మన పూర్వికులు ఇన్నాళ్ళుగా కాపాడుకుంటూ వస్తున్న ప్రజల ఆస్తులని అమ్మేసి దేశాన్ని నడుపుతున్న మనిషిని ఏమనాలి?
కానీ ప్రధాన మంత్రి తనని తాను దిగజారినవాడిగానో, దుబారా మనిషిగానో భావించుకోవటం లేదు. దేశ సంపదని అమ్మకపు సరుకుగా మార్చటం ఎన్నాళ్ళో వేచి చూసిన ఒక అందమైన కలగా భావిస్తున్నాడు. కనిష్ట ప్రభుత్వం, గరిష్ట పరిపాలన అంటే ఆయన దృష్టిలో ఇదే. ప్రజాస్వామ్యబద్ద ప్రభుత్వం నిజంగానే కనిష్టంగా ఉంది. కానీ కార్పోరేట్ శక్తుల కోసం చేసే పరిపాలన మాత్రం గరిష్టంగా ఉంది. 70 శాతం దేశ సంపద కేవలం 1 శాతం ప్రజల చేతుల్లో నిక్షిప్తమై ఉంది. దీని పర్యవసానంగా ఎన్నికల సంఘం, న్యాయస్థానాలు, మీడియా మొదలైనవి అన్నీ- చెప్పుకోవాలంటే దాదాపుగా అన్ని రంగాలు- తమ నిజ స్వభావాన్ని, తమ స్వయం ప్రతిపత్తిని కోల్పోతున్నాయి. పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ న్యాయబద్ధంగా ఉంటుందా? ప్రజాస్వామ్యం మాట ఏమిటి మరి?
ఒక పక్క పరిస్థితులు ఇలా ఉంటే, కనిష్ట ప్రజాస్వామ్య ప్రభుత్వం ప్రధానమంత్రి తనని తాను చౌకీదార్ అని గర్వంగా చెప్పుకుంటున్నారు. ‘చౌకీదారే దొంగ’ అని రాహుల్ గాంధీ అంటున్నారు. ఈ చౌకీదార్ దొంగ కాకపోవచ్చు. నిజంగానే చౌకీదార్ అయ్యి ఉండొచ్చు. కానీ ఎవరికి చౌకీదార్? ఒక ప్రజాస్వామ్య దేశానికి ప్రధాన మంత్రి అయిన అతను కేవలం కార్పోరేట్ శక్తుల చౌకీదార్ అయితే పరిస్థితి ఏమిటి? ఏ మాత్రం దార్శనికత లేని ఒక దుబారా మనిషి తన భూమిని ఒక ధనికుడికి అమ్మేసి అ ధనికుడి ఇంటికే చౌకీదార్గా మారితే పరిస్థితి ఏమిటి? తన ఉద్యోగం కాపాడుకోవటం కోసం ఆ ధనికుడు చేసే ప్రతి అనైతిక పనిలో ఈ చౌకీదార్ భాగస్వామిగా ఉండాలి. ఈ చౌకీదార్కి పైన చెప్పుకున్న చౌకీదార్కి ఏమన్నా తేడా ఉందా? ఒక ప్రజాస్వామ్య దేశానికి ప్రధాన మంత్రి అయిన వ్యక్తి కార్పోరేట్ల సంపదకి కాపలదారుడిగా ఉండటం చాలా కలవరపెట్టే విషయం.
దేశ సంపదని ఈ విధంగా అమ్ముకుంటూ వస్తున్న వ్యక్తి గురించి పకడ్బందీగా “దేశం కోసం మోదీ” అని కర్ణాటకలో ప్రచారం చేస్తున్నారు. చాలా మంది అమాయకులు కూడా “దేశం కోసం మోదీ” అని చాలా బలంగా నమ్ముతున్నారు. దేశ సంపదని ఈ విధంగా అమ్ముతున్న వ్యక్తిని సామాన్య ప్రజలు దేశ హితుడిగా భావించటం చాలా బాధాకరమైన విషయం. భారతదేశంలో కేవలం నమ్మకం ఆధారంగా జీవం లేని రాయి కూడా దేవతగా మారుతుంది. మోదీ తమ రక్షకుడిగా ఉంటాడని చాలా మందికి నమ్మకం ఉంది. కానీ రక్తమాంసాలతో నిండి ఉన్న ఈ మనిషి ఒక రాయి లాగా తయారయ్యాడు. ఇది జరిగుండాల్సింది కాదు. జరగాల్సింది కాదు.
-దేవనూర మహాదేవ
వ్యాసకర్త ప్రముఖ కన్నడ రచయిత. పద్మశ్రీ, సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత.
దేశంలో పెరుగుతున్న అసహనానికి నిరసనగా
ఈ రెండు అవార్డులనూ వాపసు చేశారు.
‘ద వైర్ ‘వెబ్సైట్ సౌజన్యంతో