నెల్లూరు రాజకీయాల్లో లేటుగా వచ్చినా.. లేటెస్ట్ రాజకీయాల్లో దూకుడుగా ఉంటూ. ఏకంగా జిల్లా మొత్తాన్ని శాసిస్తున్నారట మంత్రి అనిల్. వాస్తవానికి జిల్లా రాజకీయాలు చూస్తే.. ఎంతో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న నాయకులు ఇక్కడ ఉన్నారు. ఏళ్లతరబడి రాజకీయాలు చేసిన నేతలు కూడా మనకు కనిపిస్తారు. సీనియర్ నేతలు, మాజీ మంత్రులు కూడా ఉన్నారు. వారు కూడా వైఎస్సార్ సీపీలోనే ఉన్నారు. అయితే, వీరందరినీ తలదన్నేలా.. రాజకీయాలు చేస్తున్నారు అనిల్. తనదైన దూకుడుతో ముందుకు సాగుతున్నారు. వాస్తవానికి బీసీ సామాజిక వర్గానికి చెందిన అనిల్ కుమార్.. బలమైన రెడ్డి సామాజిక వర్గం కింద నలిగిపోతారని అనుకున్నారు.
కానీ, మంత్రి అనిల్కుమార్ మాత్రం తన దూకుడుతో రాను రాను మరింత పెరిగి.. ఇప్పుడు జిల్లా రాజకీయాలను తన కనుసైగల తో శాసించే వరకు వెళ్లారు. ఒక్కసారి అనిల్ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. 2009లో కాంగ్రెస్ తరఫున నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేసి.. ఓడిపోయారు. వాస్తవానికి రెడ్డి వర్గం డామినేషన్ ఉన్న చోట.. బీసీ నేతకు టికెట్ ఇవ్వడమే పెద్ద అద్భుతం. వైఎస్ ఆశీర్వా దంతో టికెట్ దక్కించుకున్న అనిల్కుమార్.. తనపై నమ్మకంతో టికెట్ ఇచ్చిన వైఎస్ ఠీవీని నిలబెట్టేందుకు ప్రయత్నించారు. అయితే, 2009లో నెలకొన్న త్రిముఖ పోటీలో హోరా హోరీగా సాగిన ఎన్నికల్లో ఆయన గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు. కేవలం 90 ఓట్ల తేడాతో విజయానికి దూరమయ్యారు. అనంతరం రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాల మార్పుల నేపథ్యంలో వైఎస్సార్సీపీలో చేరారు.
ఇక, అప్పటి నుంచి పార్టీని గెలిపించుకోవడం కోసం ఎంతో కృషి చేశారు. రెడ్డి వారి కోటలో బీసీ పునాదులను పదిలం చేశారు. పార్టీ లో రెడ్డి సామాజిక వర్గానికి అత్యంత దగ్గరయ్యారు. అదేసమయంలో ఫై్ర్ బ్రాండ్ నేతగా ఎదిగి మాస్కు చేరువయ్యారు. ఇది ఆయనకు బాగా కలిసి వచ్చింది. 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడంలోనూ ఆయన ముందుండే వారు. పార్టీ కార్యక్రమాలను ఒంటి చేత్తో ముందుకు తీసుకు వెల్లారు. గత ఏడాది ఎన్నికల్లో టీడీపీ తరఫున మాజీ మంత్రి పి.నారాయణ ఇక్కడ పక్కా వ్యూహంతో అనిల్ను ఓడించేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ.. ప్రజలకుచేరువైన అనిల్ గెలుపు గుర్రం ఎక్కారు.
ఇంత వరకు బాగానే ఉంది. అయితే. జగన్ తన కేబినెట్లో చోటు ఇవ్వడంతో అనిల్ విజృంభించడం ప్రారంభించారు. నెల్లూరు జిల్లా నుంచి కేబినెట్లో చోటు దక్కిన వారిలో మేకపాటి గౌతం రెడ్డి, అనిల్ మాత్రమే ఉన్నారు. దీంతో మేకపాటి దూకుడు పెంచుతారని, అనిల్ సైలెంట్గా ఉంటారని అనుకున్నారు. కానీ, ఇది రివర్స్ అయింది. ఇటు ప్రభుత్వంలోనూ అటు జిల్లాలోనూ కూడా అనిల్ తనదైన దూకుడుతో ముందుకు సాగుతున్నారు. జిల్లాపై కూడా పట్టు పెంచుకున్నారు. ఎక్కడ ఏం జరుగుతున్నా క్షణాల్లో తనకు తెలిసిపోయేలా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారట. దీంతో ఇప్పుడు రెడ్డి వర్గం హవా అనిల్ ముందు కొట్టుకు పోతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇటీవల మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. తమకు ఏ పనులు కావడం లేదని అనడం వెనుక.. రెడ్డి నేతలకు ప్రాధాన్యం లేదని విమర్శ గుప్పించారు. మొత్తానికి అనిల్ దూకుడు బాగానే ఉన్నప్పటికీ. పార్టీలో విభేదాలు రానంత వరకు బెటరే! అంటున్నారు పరిశీలకులు.