ఇది నేడు ఐఏఎస్ గా మారిన ఒకనాటి అభాగ్యుడు కథ. ఇలాంటి వారిని చూస్తే “వీరికి ప్రోత్సాహం ఎక్కడి నుండి వస్తుంది..? అనిపిస్తుంది.” అవసరమైన దృక్పథం, ప్రతిభ సాధించేందుకు వాళ్లు పడ్డ ప్రయాస తలుచుకుంటేనే కళ్ళు చెమ్మగిల్లి గుండె బరువెక్కుతుంది. అలాంటి ఒక క్యారెక్టర్ గురించి మనం ఇప్పుడు ముచ్చటించబోతున్నాం. అతనే రాజేంద్ర బరుడా, ఐఏఎస్.
ఇదీ వారి పరిస్థితి
మహారాష్ట్రలోని స్యాక్రి అనే తాలూకాలో సమొడే అనే ఓ మారుమూల గిరిజన గ్రామం ఉండేది. అందులో పుట్టాడు రాజేంద్ర బరుడా. రాజేంద్ర పుట్టేనాటికి తన తండ్రి కన్నుమూసాడు. అప్పటి పరిస్థితుల్లో అసలు తన తండ్రి ఫోటో కూడా రాజేంద్ర చూడలేదు. మగవాళ్ళ ఎవరూ అండగా లేరు. భూమి లేదు. ఇంత ఆస్తి లేదు. మొగుడు లేదు.. ఇళ్ళు లేదు. అలాంటి పరిస్థితుల్లో చెరుకు చెట్ల ఆకులతో నిర్మించుకున్న ఒక గుడిసె రాజేంద్ర కుటుంబానికి ఆధారం. ఇద్దరు కొడుకులను తల్లి, తండ్రి తానై రాజేంద్ర తల్లి ఆ సమయంలో అప్పటికే గిరిజన గ్రామాల్లో జీవనాధారంగా ఉన్న ఇప్పపూల వంటి అటవి పువ్వులతో లిక్కర్ (గుడుంబా) తయారు చేసే పని ప్రారంభించింది.
సినిమాని తలపించే లైఫ్ ఎపిసోడ్స్…!
రాజేంద్ర చిన్నతనంలో అతను ఏడిస్తే…. వచ్చే కస్టమర్లకు ఇబ్బంది కలుగుతుందని…. రెండు బొట్లు లిక్కర్ తనకు వేసి నిద్రపుచ్చేది. ఇది రాజేంద్ర ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పిన మాట. గిరిజన గూడెం నుంచి కనీసం ఎవరు కూడా చదువు పైన దృష్టి సారించని రోజుల్లో రాజేంద్ర అతడి సోదరుడితో కలిసి దగ్గర్లోని జిల్లా పరిషత్ పాఠశాలలకు వెళ్లి చదువుకోవడం ఆరంభించాడు. ఓసారి పరీక్షల సమయంలో తమ లిక్కర్ షాప్ కి వచ్చిన ఒక కస్టమర్ తనను స్టఫ్ కోసం కొన్ని పల్లీలు తెచ్చి ఇమ్మని అడిగితే…. చదువుకోవాలని తాను వెళ్లలేను అని చెప్పాడు రాజేంద్ర. దానికి ఆ కస్టమర్ ఎగతాళిగా నవ్వుతూ నువ్వు డాక్టర్ అవుతావా…. లేదా ఇంజనీర్ అవుతావా అని అడుగగా… తన తల్లి “అవును..! వాడు తనకు నచ్చింది అవుతాడు” అని అందరి ముందు ఇచ్చిన ప్రోత్సాహంతో వచ్చిన హుషారుతో తనలో మరింత కసి పెరిగింది అంటాడు రాజేంద్ర.
ఇంతింతై వటుడింతయై…
అదే విజయ సంకల్ప బలంతో ముందుకు నడిచిన ప్లస్ 2 లో రాజేంద్ర కు 97 శాతం మార్కులు వచ్చాయి. ఇంకా అంతే…. వెంటనే తర్వాత అడుగు ముంబైలో వేశాడు. ముంబైలోని జి ఎస్ మెడికల్ కళాశాలలో ఎంబిబిఎస్ ఫ్రీ అడ్మిషన్ తో పాటు స్కాలర్షిప్ కూడా. ఇక నెలకు జేబు ఖర్చులకు అవసరమయ్యే మొత్తం అమ్మ పంపేది. అలా రాజేంద్ర ఎంబీబీఎస్ పూర్తి చేసుకుంటున్న తరుణంలో యుపిఎస్సి పరీక్ష రాయాలి.. సివిల్ సర్వీసెస్ సాధించాలి…. కలెక్టర్ కావాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. కానీ రాజేంద్ర తల్లికి మాత్రం కలెక్టర్ కంటే డాక్టరే పెద్ద చెరు కనీసం తమ మండల తహసీల్దార్ అంటే కూడా తెలియని మారుమూల గిరిజన గూడెంలో ఉంది ఆమె. ఏదైతేనేం చివరికి రాజేంద్ర ఒక చేత్తో ఎంబీబీఎస్ పట్టా తో.. మరో చేత్తో యూపిపిఎస్సి రిజల్ట్ పేపర్స్ తో మారుమూల గ్రామానికి గర్వకారణమై తిరిగివచ్చాడు. అంతే ఎన్నడూలేని విధంగా అతని పేరు ఆ ప్రాంతమంతా మార్మోగిందిపోవడం… జిల్లా కలెక్టర్ తో పాటు ఎంతో మంది రాజకీయ నాయకులు, వివిఐపిలు అతనింటికి వస్తుండడంతో గూడెం గ్రామస్తులంతా ఆశ్చర్యచకితులైపోయారు.
రెండు పూటలా తినడానికి కష్టమైన పరిస్థితుల్లో నుండి తిని పారేసిన మామిడి పిక్కలు ఆహారమై…. కట్టెల వస్తువులే ఆటవస్తువులై…. చెరువుల్లో ఈదడం, గుట్టల పై ఎక్కడం…. బాల్యం నుండి తను ఇక్కడిదాకా ఎలా వచ్చాడు అని ఒకసారి చూసుకున్నప్పుడు అవినీతి, అన్యాయమన్న పదాలు మెదడులోని రావు మనసుకి పడవని రాజేంద్ర చెప్పుకొచ్చారు. ఎంతైనా అనువనువూ సినిమా కథను తలపించే రాజేంద్ర కథ ఈనాటి తరానికి ఒక స్ఫూర్తి. తన విజయం వెనుక ఉన్న ఆమె తల్లికి సెల్యూట్…!