దేశ ప్రజలంతా ఎప్పుడెప్పుడు కరోనా వ్యాక్సిన్ వస్తుందా అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇక కేంద్రం కూడా అదిగో వాక్సిన్… ఇదిగో వాక్సిన్ అన్నట్లు వ్యవహరిస్తోంది. ఇలాంటి కీలక సమయంలో టీకా వేయించుకునేందుకు మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది…
ఈ తేదీ తర్వాత ఎప్పుడైనా…
ఇక ఈ మార్గదర్శకాల ప్రకారం వ్యాక్సిన్ వేయించుకోవాలి అనుకునే వారు తమ పేర్లను రిజిస్టర్ చేయించుకోవాల్సిందే. రిజిస్టర్ చేయించుకున్న వారు ఖచ్చితంగా టీకాలు వేయించుకోవాలని నిబంధన ఏమీ లేదు. ఇక ఈ నెల 25వ తేదీ లోపల అందరికీ టీకాలు వేయించడానికి ఆయా ఏర్పాట్లు చేసుకోమని అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 25 తర్వాత ఏ రోజు అయినా సరే రెండు ఫార్మా కంపెనీలు కేంద్రానికి అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
చాలా సులభం…
ప్రస్తుతం మన దేశంలో భారత్ బయోటెక్ కంపెనీ, సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేస్తున్న టీకాలు మార్కెట్ లోకి విడుదల కాబోతున్నాయి అని సమాచారం వచ్చింది. ఇక నిల్వ ఉంచేందుకు, పంపిణీ చేయడానికి, వాటిని సరిగ్గా వేయడానికి అవసరమైన ఏర్పాట్లు ప్రతి రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవాలి నమోదు చేసుకున్న వారికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తారు. పేరు నమోదు చేసుకునే సమయంలో ఇచ్చిన మొబైల్ నెంబర్ కు అవసరమైన ఎస్ఎంఎస్ లు అందుతాయి. ఎప్పుడు వేస్తారు, ఏ చోట వేస్తారు అనేటువంటి వివరాలు ఆ నెంబర్ కు మెసేజ్ పంపుతారు. ఇక టీకా చేయించుకునేటప్పుడు ఏదో ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డు తీసుకు వెళ్లడం తప్పనిసరి.
ప్రాధాన్యత మాత్రం వీరికే…
ఇక ప్రాధాన్యత విషయానికి వస్తే… ముందుగా వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య శాఖ వారికి ఇస్తారు. వీరితోపాటు 50 ఏళ్లు దాటిన వారికి, చిన్న పిల్లలకు అనారోగ్యాలు ఉన్నవారికి కూడా ప్రాధాన్యత ఇస్తారు. 28 రోజుల వ్యవధిలో ప్రతి ఒక్కరూ రెండు డోసులు వేయించుకోవాలి. రెండవ డోసు వేయించుకున్న తరువాత రెండు వారాలకి రోగనిరోధక శక్తి పెరుగుతుందని కేంద్రం స్పష్టంగా చెప్పింది. మరెందుకు ఆలస్యం… త్వరగా పేర్లు నమోదు చేసుకోండి.