ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయమై ఎంత రచ్చ జరుగుతుందో అందరికీ తెలిసిందే. సుప్రీం కోర్టు మూడు రాజధానులు అమలు పై ‘స్టేటస్ కో’ విధించిన తర్వాత జగన్ ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. అటు వైపు చూస్తే అమరావతి రైతులు వరుసగా రెండు వందల యాభై రోజులు తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి కొడాలి నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.
భూములు త్యాగం చేసిన వారికి భిచ్చం వేస్తారా?
“అమరావతిలో పేదలకు ఉండడానికి వీల్లేదని న్యాయస్థానాలు తీర్పు ఇస్తే…. అమరావతి జేఏసీ వాదిస్తే…. టిడిపి కూడా అదే వాదనను వినిపిస్తే.. అమరావతిలో అసెంబ్లీ ఉండటానికి వీలు లేదు.” ఇవి కొడాలి నాని చేసిన సంచలన వ్యాఖ్యలు. అతను ఏదో యథాలాపంగా ఆ మాటలు అన్నట్లు అయితే కనిపించడం లేదు. పక్కా ప్లానింగ్ తోనే ఈ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతోంది. అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం తమ సొంత భూముల్ని వదులుకున్న రైతులను అసెంబ్లీ ఏమైనా బిక్షం గా వేశారా..? అని ఇప్పుడు వెంటనే అమరావతి మద్దతుదారులు నాని పై ధ్వజమెత్తారు
మీరే మభ్యపెట్టి.. మీరే బ్లాక్ మెయిల్ లు
నిజానికి అమరావతిలో పేదలు ఉండొద్దు అని ఎవరైనా అనగలరా? న్యాయస్థానం సంగతి వదిలేయండి. దేశంలో ఏ చట్టమైనా అందుకు అంగీకరిస్తుందా? అమరావతి రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములను జగన్ ప్రభుత్వం ‘పేదలకు ఇళ్ల స్థలాల పథకం’ కింద వినియోగిస్తుండడం పైనే అభ్యంతరం. ఆ స్థలాలు ఇంకోచోట ఇచ్చుకోవచ్చు. అసలు అమరావతి రైతులు తమ భూములను రాజధాని నిర్మాణానికి ఇచ్చింది. ప్రభుత్వం తమ ప్రాంతంలో రాజధాని నిర్మిస్తుందని నమ్మకంతో. అయితే వారిని మీరు కనుక ఇలా పోరాటాలు చేస్తే మీకు కనీసం అసెంబ్లీ కూడా అమరావతిలో ఉండకుండా పోతుంది అని బ్లాక్మెయిల్ వంటి కామెంట్స్ చేయడం ఎంత వరకు సమంజసం?
ఎవరూ పట్టించుకోరా…?
ఇక ఈ విషయం పక్కన పెడితే…. రైతులు ప్రభుత్వానికి రాజధాని కోసం తమ భూములను ఇచ్చారు. ఈ నమ్మకాన్ని వమ్ము చేసి రైతులని నట్టేట్లో ముంచేసి మాకు అన్యాయం జరిగింది…. మహాప్రభో అని 250 రోజులుగా రైతులు నినదిస్తూ.. కోర్టును ఆశ్రయిస్తే ఉంటే “ఇక్కడ పేదలు ఉండటానికి వీలు లేద”ని మంత్రి కొడాలి నాని వింత వాదనలు తెరపైకి తీసుకురావడం వెనుక పెద్ద స్కెచ్ ఉందని రాజకీయ విశ్లేషకుల వాదన. ఒకటి పోరాటం అయినా మానుకోండి… లేదా అసెంబ్లీ కూడా లేని అమరావతి లో పడి ఉండండి అన్నట్లు ఉన్నాయి కొడాలి నాని మాటలు. వీటిని ఎవరూ వక్రీకరించాల్సిన అవసరం లేదు. నాని ఉద్దేశమేమిటో అతని కామెంట్స్ ద్వారానే పూర్తిగా తేటతెల్లమైంది. మరి నాని కి జగన్ నుండి మందలింపు వస్తుందా లేదా అమరావతి రైతులే తగిన బుద్ధి చెబుతారా అన్నది వేచి చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?