Tirupathi RUIA: తిరుపతి రుయా ఆసుపత్రిలో ఘోరం జరిగి నాలుగు రోజులు గడిచింది.. మరణాలు లెక్క తేల్చేశారు.. 11 మంది మాత్రమే ఆ రోజు ఆక్సిజన్ ప్రమాదంలో చనిపోయారని.. వారికి రూ. పది లక్షలు పరిహారం కూడా ఇవ్వనున్నట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.. కానీ ఈ 11 మంది పేర్లు మాత్రం ఇప్పటికీ వెల్లడించలేదు. ఇక్కడే ఓ పెద్ద మతలబు దాగి ఉంది. ప్రతిపక్షాలు, ఆ మీడియాలు చేస్తున్న ఆరోపణలకు బలం వస్తుంది. “ఇదిగో రుయా ప్రమాదంలో ఈ 11 మంది చనిపోయారు. ఇంకెవ్వరూ ఈ ప్రమదాహములో మరణించలేదు. ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తవం” అని ఏ ఒక్క అధికారీ.. ఏ ఒక్క అధికార పార్టీ నాయకుడు, మంత్రులు కూడా చెప్పలేకపోయారు. సో.., ఈ ఘటనపై ఇవే అనుమానాలు పెంచుతున్నాయి..!
Tirupathi RUIA: జగన్ స్థాయిలో దృష్టి పెట్టి పరిష్కరిస్తేనే..!
ఇది చిన్న సమస్య కాదు. రాజకీయంగా చుట్టుకుంటుంది. మొదట ఉత్తుత్తి ఆరోపణలకు పరిమితమైన టీడీపీ నిన్న ఏకంగా ఇదిగో ఈ 35 మంది మరణించారు అంటూ పేర్లు కూడా ప్రకటించారు. ఇంకా రెండు అడుగులు ముందుకు వేసి దీనిపై న్యాయపరంగా కూడా పోరాడతామని, మరణాల లెక్కలు దాస్తున్నారు అంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇది మొత్తానికి చేటు చేసేలా ఉంది. అధికారులు, మంత్రులు దీనికి పరిష్కారం చూపలేకపోతే.., సమాధానం చెప్పలేకపోతే.. ఆ 11 మంది పేర్లు వివరించలేకపోతే.. సీఎం స్థాయిలోనే దీనికి పరిష్కారం వెతకాలి. ఆ దుర్ఘటనపై ఇంకా ఎన్ని రోజులు నాంచితే ప్రభుత్వానికి అంతగా నష్టం కలిగిస్తుంది. మరణాలు అనేవి ఇప్పుడు సున్నితమైన రాజకీయ అంశాలుగా మారిపోయాయి. ఆధారాలు, పేర్లు మొత్తం పట్టుకుని కోర్టుకి వెళ్తే సమాధానం కూడా చెప్పుకోలేని పరిస్థితి వస్తుంది..!
మొత్తం మరణాలు దాస్తున్నారు అంటూ ఆరోపణలు..!!
దేశం మొత్తం ఈ మహమ్మారి వలన జరిగిన మరణాలు దాస్తున్నారు అని ఒక ఆరోపణ ఉంది. దేశం మొత్తం మీద రోజుకి 12 వేల మందికి పైగా మరణిస్తున్న… ఏవేవో కారణాలు చూపించి ఆ లెక్కలను వేరే ఖాతాల్లోకి వేసేస్తున్నారు. ప్రజల్లో భయాలు, ఆందోళనలు తగ్గించడానికి కేంద్రం ఇలా చేస్తే చేస్తుండవచ్చు. అన్ని రాష్ట్రాలు కూడా ఇలాగే చేస్తే చేస్తుండవచ్చు. అదీ ఒకందుకు మంచిదే. మానసిక ధైర్యం వస్తుంది. కానీ ఏపీలో ఈ రుయా ప్రమాదం తర్వాత లెక్కల పరంగా ఇరుక్కున్నట్టు అయింది. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగిన తర్వాత జిల్లా కలెక్టర్ అధికారికంగా చెప్పేసారు. “11 మంది మరణించారు అని ప్రకటించారు. ఆ తర్వాత రోజు ఆ ఆసుపత్రి పర్యవేక్షక అధికారి మాత్రం “రోజు మొత్తం మీద 45 మంది మరణించారని ఒక జాబితా కూడా ఇచ్చారు” అదే రోజున చింతూరు జిల్లాలో కోవిద్ మరణాలు 18 మాత్రమే చూపించారు. ఇది మొత్తం గందరగోళానికి దారి తీసింది. ఆ 11 మంది వేరే అయితే… ఈ 45 మంది ఏ లెక్కన మరణించినట్టు..!? ఆ 11 మంది పేర్లు ప్రభుత్వం ప్రకటించినా.. నిన్న టీడీపీ ప్రకటించిన 35 మంది జాబితా పరిస్థితి ఏంటి..!? ఇలా లేనిపోని కొత్త అనుమానాలు చుట్టుకుంటున్నాయి. ఒక చిన్న అంశాన్ని సున్నితంగా మార్చి, మెడకు చుట్టుకున్నంతగా చేస్తున్నారు..!!