Tirupati by election : తిరుపతి పార్లమెంటు ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో వారు చూపించిన జోరు ఇక్కడ కూడా కొనసాగించాలని భావిస్తుంటే…. ప్రతిపక్షాలు అందరూ కలిసి ఒకే ఒక్క పాయింట్ పై జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు.
అంతా ఒకటే పాట….!
పంచాయతీ ఎన్నికలు దగ్గర నుండి మొన్నటి మునిసిపల్ ఫలితాల వరకు ఏ ప్రతిపక్ష నాయకుడిని కదిలించినా ఒకటే మాట అంటున్నారు. జనాలను మభ్యపెట్టి, భయపెట్టి, లోబరుచుకుని వైసిపి ఓట్ల సంపాదించింది అని. మరీ ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని వారికి వచ్చే సంక్షేమ పథకాలను ఆపేస్తామని బెదిరించి ఓట్లు… తద్వారా సీట్లు సంపాదించారన్నది ప్రధాన ఆరోపణ. చంద్రబాబు మొదలుకొని వీర్రాజు… ఆఖరికి పవన్ కళ్యాణ్ కూడా ఒకటే అజెండాతో వైసీపీ పై బురద జల్లుతున్నారు. ఇక్కడ వీరు అతి సాధారణ లాజిక్ ఎలా మిస్సయ్యారు?
మీ వారేరి?
క్లుప్తంగా మాట్లాడుకుంటే… హైకోర్టు వాలంటీర్లు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు వాడకూడదని స్పష్టంగా తెలియజేసింది. అదీ కాకుండా వైసీపీ ప్రభంజనం మామూలు రేంజ్ లో సాగలేదు. దాదాపు రాష్ట్రం మొత్తం ఒక రెండు కార్పొరేషన్లు మినహాయిస్తే వైసీపీ మొత్తం సీత్లు కైవసం చేసుకుంది. కొన్నిచోట్ల టిడిపి మంచి పోటీ ఇచ్చింది. అయితే వాలంటీర్లు నిజంగానే ప్రజల బెదిరిస్తూ ఉంటే సోషల్ మీడియాలో గాని ఏ ఇతర మీడియాలో గాని అందుకు సంబంధించిన ఒక క్లిప్పింగ్ కూడా రాలేదు. పైగా వాలంటీర్లు అలా చేస్తే టీడిపి మద్దతుదారులైన ఓటర్లలో ఒక్కరైనా జనంలో నోరు విప్పలేరా? తన నాయకులకి అండగా ఉండలేరా? అయినప్పటికీ వారు ప్రజలను తమవైపు అక్రమంగా తిప్పుకున్నారు అని ఆధారాలు లేకుండా వాదించడం ఎంతవరకు సబబు అని ఏళ్ళ తరబడి రాజకీయాలు చేస్తున్న వారికే తెలియాలి.
Tirupati by election : మనం చేయాల్సింది ఎంతో ఉంది
ఇదే క్రమంలో… ఏపీలో వ్యవస్థలను వాడుకుంటూ వైసీపీ ప్రభుత్వం గెలుస్తుందని సోము వీర్రాజు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నట్లు ప్రకటన కూడా చేశారు. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేస్తామని చెప్పిన సోము ఇందుకు తగిన ఆధారాలు పొందుపరచలేకపోతే పార్లమెంటు లోని ఓటర్ల ముందు నవ్వులపాలు కావడం ఖాయం. పైగా ఎలక్షన్ కమిషన్ నుండి సరైన సమాధానం వచ్చే పరిస్థితి కనిపించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆధారాలు లేకుండా వైసిపి ఒక రేంజ్ లో గెలుస్తుంటే… ఏదో ఒక మాట అనాలని నిందించడం తగదని పలువురు హితబోధ కూడా చేస్తున్నారు. మరి ఇవన్నీ విని తమ సిద్ధాంతాలను, ఉద్దేశాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు సరైన మార్గం ఎంచుకోవాల్సిన అవసరం ప్రతిపక్షాలను ఎంతైనా ఉంది. మరి ఈ దిశగా వారు అడుగులు వేసి ప్రజాస్వామ్యాన్ని, రాజకీయ నీతిని కాపాడుతారో లేదో చూడాలి.