అధికారం తోడుంది.. సానుభూతి పండుతుంది.., సెంటిమెంట్ రగులుతుంది.. అయినా ఓటమి వెక్కిరించింది..!
మాట్లాడే యంత్రాలున్నాయ్.. కట్టలు దించే చేతులున్నాయ్.. కట్టి పడేసే చేతలున్నాయ్.. అయినా ఓటమి తలుపు తట్టింది..!!
ఇది అధికార పార్టీ ఓటమి కాదు. టీఆరెస్ ఓటమి. ఇది బీజేపీ గెలుపు కాదు. రఘునందన్ గెలుపు.
దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం అనూహ్యంగా మారింది. మొదటి రౌండ్ నుండి బీజేపీని ఊరించిన విజయం చివరికి వరించింది. మధ్యలో టీఆరెస్ కి దూరంగా వచ్చినప్పటికీ.. ఆ పార్టీ అహం తెలిసిన విజయం ఈసారి దెబ్బేసింది. ఈ ఓటమి వెనుక టీఆరెస్ సొంత తప్పిదాలు ఎన్నో ఉన్నాయి. నేర్చుకోవాల్సన పాఠాలు ఎన్నో ఉన్నాయి..!!
తెలంగాణ దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు ; దుబ్బాకలో 1470 ఓట్లతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. మొత్తం మీద బీజేపీ – 62,772 .ఓట్లు.., టీఆర్ఎస్ – 61,302 ఓట్లు పోలయ్యాయి.
ప్రత్యర్థిని పైకి లేపారు..!!
నిన్న “న్యూస్ ఆర్బిట్” చెప్పుకున్నట్టు… దుబ్బాకలో బీజేపీని పెంచి, పెద్ద చేసి, విజయాన్ని అందించింది మాత్రం టీఆరెస్ పార్టీనే. మూడు పార్టీలు పోటీ పడుతున్నప్పుడు… ఒక పార్టీ బలంగా ఉన్నప్పుడు… తమ ఓటు బ్యాంకు చెదిరిపోకుండా.. తమ వ్యతిరేక ఓటు బ్యాంకు చెదిరిపోయేలా చూడాలి. అంటే ఇక్కడ టీఆరెస్ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్, బీజేపీ పంచుకునేలా చేస్తే టీఆరెస్ సులువుగా గట్టేక్కేది. కానీ దుబ్బాకలో టీఆరెస్ ఈ విషయంలో ఖంగు తిన్నది. మొదటి నుండి బీజేపీని తమ ప్రత్యర్థిగా చూపిస్తూ.., బీజేపీని టార్గెట్ చేస్తూ.., బీజేపీని ఇరుకున పెట్టాలని అధికారాన్ని ప్రయోగించింది. వీళ్ళు పతితలై.., వాళ్ళు మాత్రమే పంపిణీ పనిచేస్తున్నట్టు… బీజేపీ అభ్యర్థిపై పోలీసులతో నిఘా పెట్టింది. ఈ వ్యవహారాలన్నీ దుబ్బాకలో బాగా చర్చనీయాంశమయ్యాయి. పోలింగ్ కి వారం రోజుల ముందు నుండి దుబ్బాకలో బీజేపీ గురించి చర్చలు మొదలయ్యాయి. సానుభూతి పెరుగుతూ వచ్చింది. కానీ ఏదో మూల అధికార పార్టీ కదా, అభివృద్ధి కావాలి అని టీఆరెస్ ని గెలిపిస్తారేమో అని భావించినప్పటికీ.. టీఆరెస్ తప్పిదాలు బీజేపీని గెలిపించాయి.
ఇదీ చదవండి ;
టీఆరెస్ కి బుర్ర పనిచేయడం లేదా..? దుబ్బాకలో ఏమిటిలా..!?
రఘు కష్టం ఊరికే పోలేదు..!!
ఇక్కడ మరో కీలక పాయింటు చెప్పుకోవాలి. విజయం ఊరికే రాదు. ఓటమి తర్వాత వచ్చే విజయం రుచి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం రఘు పరిస్థితి అలాగే ఉంది. రఘుకి 2014 లో కేవలం 15131 ఓట్లు మాత్రమే వచ్చాయి.. 2018 లోనూ 22595 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ రెండు ఓటములతో కుంగిపోలేదు. బీజేపీకి కంకణబద్దుడై.., స్థానికంగా క్యాడర్ ని నిర్వహిస్తూ జాగ్రత్తగా తన రాజకీయం తాను చేసుకున్నారు. దుబ్బాకలో ఉప ఎన్నికలు జరగనున్నాయి అని తెలిసిన వెంటనే.. ఈసారి కచ్చితంగా గెలవాలి అనే కసితో అందరి కంటే ముందే ప్రచారం మొదలు పెట్టారు. ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపారు. అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. నేర్పుతో వ్యవహరించారు. పార్టీ అండతో భిన్నంగా.., దిగువ స్థాయిలో ఆచితూచి ప్రచారం చేశారు. ముఖ్యంగా పోలింగ్ కి ముందు మూడు రోజుల్లో టీఆరెస్ వ్యూహాలను ముందుగానే పసిగట్టి.. ఛేదించి.. తన కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లడం కలిసొచ్చింది.
ఇదీ చదవండి ;
దుబ్బాక.. రెండు కుట్రలకు వేదిక..!! (న్యూస్ ఆర్బిట్ ప్రత్యేకం)
టీఆరెస్ కర్తవ్యమ్ ఏంటి..!?
టీఆరెస్ కి ఇది ఊహించని ఓటమి. సాధారణంగా అధికార పార్టీలు ఉప ఎన్నికల్లో ఓడిపోవు. అందులోకి తెలంగాణ రాష్ట్రంలో టీఆరెస్ ఓడింది అంటే దుబ్బాక ఫలితం ముందు వరకు దాదాపు అసాధ్యమే. కానీ ఇప్పుడు తప్పదు. తమకు అసలు ప్రత్యర్థులే లేరు అనుకునే దశలో టీఆరెస్ కి ఇది జీర్ణించుకోలేని ఓటమి. టీఆరెస్ దొరకి ఈ ఓటమికి కారణాలుగా చెప్పుకోడానికి చాలా దొరకవచ్చు. హరీష్ కి అప్పగించి, తాను లైట్ తీసుకోవడం.., అభ్యర్థి బలహీనం అని చెప్పుకోవడం.., రఘుకి సానుభూతి కలిసి వచ్చింది అని సాకు చూపడం.., కార్యకర్తలు ధీమాగా ఉన్నారని అనుకోవడం.. ఇవన్నీ పైకి చెప్పుకునే కారణాలే. అంతర్గతంగా మాత్రం ఇది పెద్ద హెచ్చరిక. నియంతృత్వ పాలనకు, పోకడలకు మొదటి హెచ్చరిక. అభ్యర్థిని ఎంపిక చేయడం నుండి, బీజేపీని ఎక్కువ టార్గెట్ చేయడం.., సిల్లీ కామెంట్లు చేయడం.., పోలీసులను అతిగా వాడెయ్యడం..ఇలా అన్నీ బెడిసికొట్టాయి.