TTD Board: వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చాలా సున్నితమైన అంశాలు కూడా వివాదాలుగా మార్చేస్తోంది. సీఎం జగన్మోహనరెడ్డి నిర్ణయాలు కావచ్చు, ఆ పార్టీ నేతల వైఖరి కావచ్చు, కారణాలు ఏమైనా సున్నితమైన చిన్న చిన్న అంశాలు కూడా వివాదాస్పదం అయిపోతున్నాయి. దానిలో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కూడా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రెండున్నర సంవత్సరాల్లో చాలా వివాదాల్లో చిక్కుకోంది. కాకపోతే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆయన సీనియారిటీ, అనుభవంతో చాలా వివాదాలను ఆయన చాకచక్యంగా పరిష్కరించలగలిగారు. అయితే ఇప్పుడు రెండవ సారి జెంబో బోర్డు నియామకం విమర్శలకు తావు ఇస్తోంది. విమర్శలకు తోడు ఆరోపణలకు తావు ఇస్తోంది. గతంలో ఎప్పుడూ కూడా టీటీడీ బోర్డు నియామకాల్లో ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు రాలేదు. కానీ ఎందుకో గానీ మొదటి సారి ఆరోపణలు వస్తున్నాయి. దీనిలో ఏపి బీజేపీ కూడా కుమ్మక్కు అయినట్లు అంటే వైసీపీతో బిజేపి కుమ్మక్కు అయి బీజేపీ నాయకులను బోర్డు సభ్యులుగా చేర్చి ఉంటుందా అన్న అనుమానాలు ఆరోపణలు వచ్చాయి.
TTD Board: పెంచుకుంటూ పోతున్నారు..!?
టీటీడీ బోర్డు అంటే 2019కు ముందు 18 మంది సభ్యులుగా ఉండే వారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను 37కి చేర్చారు. ఇప్పుడు తాజాగా నియమించిన బోర్డులో 81 మంది సభ్యులు ఉండటం విమర్శలకు తావు ఇస్తోంది. ఇందులో 30 మంది సాధారణ సభ్యులైతే 50మంది ప్రత్యేక ఆహ్వానితులు. ఈ ప్రత్యేక ఆహ్వానితులకు పాలకమండలి సమావేశాల్లో పాల్గొనరు, వారికి సమావేశాల్లో ఎలాంటి ప్రాధాన్యత ఉండదు. కానీ సభ్యులకు ఉన్న ప్రోటోకాల్ దర్శనం తదితర సౌకర్యాలు అన్నీ ఉంటాయి. వాళ్ల వాళ్లకు బ్రేక్ దర్శనాలు చేయిస్తారు. సిఫార్సు లేఖలు ఇస్తారు. ఇంత మందితో జంబో బోర్డు వేయాల్సిన అవసరం ఏముంది. ఎవరిని ప్రసన్నం చేసుకోవడం కోసం ఇంత మందిని బోర్డులోకి తీసుకున్నారు అన్న ప్రశ్న వస్తోంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఆధ్యాత్మిక కేంద్రంలో ఇంత మంది ప్రత్యేక ఆహ్వానితులు ఏమి చేస్తారు. వాస్తవానికి దేవస్థానం పరిపాలనకు సంబంధించి భక్తుల మనోభావాలకు దెబ్బతినకుండా దేవస్థానంకు వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించడం, ఆలయానికి వచ్చే ఆదాయం దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఒక పాలకమండలి బోర్డు ఉండాలి. అది పది మదో లేక 15, 20 లేదా 30 మంది ఉండటం న్యాయం. 50 మంది, 80 మంది సభ్యులు ఎందుకు అనే ప్రశ్న భక్తుల నుండి కూడా వినిపిస్తోంది. ప్రభుత్వ ఈ విచిత్ర వైఖరి ఎవరికీ అర్థం కావడం లేదు.
కిషన్ రెడ్డి ఫిర్యాదులు..!?
మరో విషయం ఏమిటంటే ఈ బోర్డు డైరెక్టర్ల నియామకాల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫిర్యాదులు వేళ్లాయి. ఇది ఆయన అంతటితో ఊరుకోక కేంద్ర హోంశాఖకు, బీజేపీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. తమ పేర్లు వాడుకొని కొంత మంది టీటీడీ బోర్డులో సభ్యులుగా నియమితులైయ్యారు. దీనికో కశ్చితంగా అవకతవకలు జరిగే ఉంటాయి. కొంత మంది పాత్రపై అనుమానాలు ఉన్నాయి. దీనిపై విచారణ జరిపించాలి అని భావించారు. దీనిపై సీఎం జగన్మోహనరెడ్డికి కూడా ఆయన లేఖ రాశారు. తమ పార్టీ పెద్దలకు ఈ విషయాలను కిషన్ రెడ్డి చెప్పారు. నిజానికి టీటీడీ విషయంలో కేంద్ర బీజేపీ వేగంగా స్పందిస్తుంది. దీనిపై కేంద్రం కూడా దృష్టి పెట్టినట్లు సమాచారం. మరో వైపు ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని మరింత ముదరకుండా సద్దుమణిగించే ప్రయత్నం చేస్తోంది. ఈ వివాదాన్ని ఎంత త్వరగా పరిష్కరించుకుంటే అంత మంచిది అన్న భావనలో ప్రభుత్వం ఉంది. ఇంకో పక్క టీడీపీ కూడా టీటీడీ బోర్డు విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతోంది. సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ కూడా రాశారు. ఇప్పుడు టీటీడీ బోర్డు అంశం రాష్ట్రంలో తీవ్ర హాట్ టాపిక్ అయ్యింది. ఈ అంశం జాతీయ స్థాయి ఇష్యూ కాకముందే చల్లార్చాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది.