వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీ పరిస్థితి కూడా పూర్తిగా మారింది. ఆ పార్టీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి అనేక ఆరోపణలు, వివాదాలు ప్రతిపక్షాల నుంచి అర్ధ రహిత విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. వాటన్నింటినీ నెట్టుకువస్తూ, తట్టుకుంటూ తగిన సమాధానాలు ఇస్తూ డీల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఉద్యోగులపై తప్పులుంటే వారిపైనా వేటు వేస్తున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలు, ఎవరైనా మీడియా అర్థరహిత ఆరోపణలు చేస్తే వాళ్లకు నోటీసులు ఇస్తున్నారు. ఈ విషయంలో టిటిడి ఎక్కడ వెనుకడుగు వేయడం లేదు. ఎంతటి స్థాయి నాయకుడైనా, ఏ స్థాయి మీడియా అయినా నోటీసులు ఇచ్చి న్యాయపరంగా ఎదుర్కొనేందుకు టిటిడి ముందుకే వెళుతోంది. తాజాగా జరిగిన ఒ వివాదంలో టీటీడీపై విమర్శలు చేసిన నాయకులకు వరుస పెట్టి నోటీసులు వెళుతున్నాయి. ఆ నాయకులు ఎవరు? ఆ వివాదం ఏమిటి? అనేది ఒక సారి చూస్తే…
బీజేపీ నేతలు విష్ణువర్ధన్ రెడ్డి, సాదినేని యామిని తదితరులకు కూడా
తాజాగా మూడు రోజుల కిందట బిజెపి రాష్ట్ర కీలక నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డికి టీటీడీ నుంచి నోటీసులు వెళ్లాయి. అది జరిగిన రెండు రోజుల తర్వాత టీడీపీ నుంచి బీజేపీలోకి సాధినేని యామిని శర్మ కూడా టిటిడి నుంచి నోటీసులు వెళ్లాయి. దాంతో పాటు బీజేపీలోని మరో ఆరుగురు నాయకులకు, కొంత మంది మీడియా ప్రతినిధులకు, సోషల్ మీడియాలో కొన్ని వ్యాఖ్యలు చేసిన టిడిపి, బిజెపి కార్యకర్తలకు మొత్తం మీద దాదాపు 40 మంది వరకు టీటీడీ ద్వారా నోటీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇవన్నీ ఎందుకంటే.. అయోధ్య రామమందిరం శంకుస్థాపన రోజు ఆ కార్యక్రమాన్ని టీటీడీ ఛానల్ ఎస్ వి బీ సి ప్రత్యక్ష ప్రసారం చేయలేదు. ప్రపంచ వ్యాప్తంగా 250 ఛానల్ చేసినప్పటికీ ఈ ఛానల్ లో మాత్రం మరో కార్యక్రమాన్ని చూపించారు. దీంతో బిజెపి తీవ్రంగా నొచ్చుకుని, టిటిడి పైన, బోర్డుపైన కొన్ని విమర్శలు చేసి వివాదంలోకి లాగే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో దాని ధీటుగా ఎదుర్కొనేందుకు టీటీడీ కూడా అడుగులు ముందుకే వేస్తోంది.
వైవీ సుబ్బారెడ్డి స్పష్టత ఇచ్చినప్పటికీ
ఆ రోజు ఏం జరిగింది. అయోధ్య కార్యక్రమాన్ని ఎందుకు ప్రత్యక్ష ప్రసారం చేయలేకపోయాము అనే విషయమై టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఆ రోజు సాయంత్రమే స్పష్టత ఇచ్చారు. కారణాలు పేర్కొంటూ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. స్వామి వారి కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి కేవలం ఎస్వీబీసీ ఛానల్ తప్ప మరొక ఛానల్ లేదు. అదే అయోధ్య కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక ఛానల్స్ ఉన్నాయి. కానీ స్వామి వారి విశేషాలు చూపించాలంటే ఎస్వీబీసీకే సాధ్యం. మరో ఛానల్ కు సాధ్యం కాదు. అందుకే ఇటువంటి కీలకమైన కార్యక్రమం జరుగుతున్నప్పుడు స్వామి వారి భక్తులకు చూపించాలని కోరికతో ఎస్వీబీసీ ఈ కార్యక్రమాన్ని లైవ్ చూపించారని ప్రకటనలో పేర్కొన్నారు. కానీ దీన్ని కూడా తప్పుపడుతూ, వివాదం చేస్తూ కొంత మంది బిజెపి నాయకులు అతి విమర్శలు చేశారు. దానికి సమాధానంగా టీటీడీ వాళ్ళందరికీ నోటీసులు ఇస్తోంది. మరి ఈ వ్యవహారం ఎంత వరకు వెళుతుంది. కోర్టు వరకు వెళుతుందా, లీగల్ నోటీసులతో సద్దుమణుగుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది.