Union Budget 2022: దేశంలో 70 శాతానికి పైగా ఉన్న మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి జీవులు ఉసూరుమనేలా కేంద్ర బడ్జెట్ లో లెక్కల మ్యాజిక్కులు చూపించారు. ఎక్కువగా డిజిటల్ పై ఆధారపడుతూ.. కొన్ని పై పై లెక్కలు చూపిస్తూ.. ప్రైవేటీకరణకు పెద్ద పెద్ద పీటలు వేస్తూ.. మొత్తానికి కేంద్ర బడ్జెట్ అయితే కొత్తగా ఏమి లేదనిపించింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక కేటాయింపులు ఏమి లేవు. బడ్జెట్ లెక్కలు, కేంద్ర మంత్రి నిర్మల ప్రసంగం.. ఒకసారి మొత్తం పరిశీలిస్తే..
“వచ్చే 25 ఏళ్ల అమృతకాలానికి ఈ బడ్జెట్ పునాది అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట ముందు ఆమె మాట్లాడుతూ.. ఉత్పత్తి ఆధార ప్రోత్సాహకాలు 14 రంగాల్లో మంచి అభివృద్ధి కనిపించిందని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పాదకతకు తగిన ప్రోత్సాహకాలు అందిమని.., వచ్చే ఏళ్లలో కొత్తగా డిజిటల్ కరెన్సీకి పెద్దపీట వేయనున్నట్టు చెప్పారు. డీబీటీ ద్వారా పేదలకు నేరుగా ఆర్థికసాయం లభిస్తుందని, నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని ఆమె తెలిపారు. ప్రధాని గతిశక్తి యోజన, సమీకృత అభివృద్ధి, అభివృద్ధి ఆధారిత ఉపాధి- ఉద్యోగ కల్పన, పరిశ్రమలకు ఆర్థిక ఊతం. పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్.. దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన దిశానిర్దేశం’’ అని నిర్మల తెలిపారు.
Union Budget 2022: బడ్జెట్ లెక్కలు.. ముఖ్యాంశాలు..!!
మొత్తం బడ్జెట్ 39.85 లక్షల కోట్లు.. రూ. 22.84 లక్షల కోట్లు ఆదాయంగా చూపించారు. రూ. 17 లక్షల కోట్లు రెవెన్యూ లోటుగా నిర్మలమ్మ లెక్కలు చూపించారు. ముఖ్యంగా పారిశ్రామికం, డిజిటల్, ఎలెక్ట్రిక్ వంటి రంగాలకు ఎక్కువ ప్రత్సాహం ఇస్తూ ప్రసంగించారు.
ఇక అన్నీ ఎలక్ట్రిక్ వాహనాలే – నగరాలు, పట్టణాల అభివృద్ధికి నూతన పట్టణ ప్రణాళిక వేస్తున్నట్టు చెప్పారు. నగరాల్లో ప్రయాణ సౌకర్యాల అభివృద్ధికి పట్టణాలు, నగరాల్లో నిర్మాణ రంగంలో సంస్కరణలు చేపడతామన్నారు. పట్టణ ప్రణాళిక అభివృద్ధికి ప్రత్యేక కోర్సులు, సిలబస్ పట్టణాల్లో పర్యావరణ పరిరక్షణకు డీజిల్, పెట్రోల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు విద్యుత్ వాహనాల పెంపులో బ్యాటరీల అభివృద్ధికి మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు ఆమె పేర్కొన్నారు.
* డిజిటల్ చెల్లింపులకు మరింత ప్రోత్సాహం.. దేశవ్యాప్తంగా జిల్లాల వారీ వెనుకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక అభివృద్ధి పథకం ప్రవేశ పెట్టనున్నారు. డిజిటల్ చెల్లింపులు, డిజిటల్ బ్యాంకింగ్కు ఈ ఏడాది కూడా మరింత ప్రోత్సాహం అందించేందుకు.., 1.5 లక్షల పోస్టాఫీసుల ద్వారా ఆన్లైన్ బ్యాంకింగ్, నెట్బ్యాంకింగ్, ఏటీఎం సేవలు తీసుకురానున్నట్టు పేర్కొన్నారు. మినిమం, మ్యాక్సిమం గవర్నమెంట్ లక్ష్యంలో భాగంగా అనేక కాలం తీరిన చట్టాలను రద్దుచేశామని నిర్మల పేర్కొన్నారు. 2022-23లో ఈ-పాస్పోర్టుల జారీకి కొత్త సాంకేతికత. 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు నెలకొల్పుతామన్నారు.
* 5.7 కోట్ల కుటుంబాలకు తాగునీరు.. మహిళా, శిశు సంక్షేమం కోసం మిషన్ శక్తి, వాత్సల్య, సక్షం అంగన్వాడీల రూపకల్పన చేస్తామని చెప్పారు. దీంతో పాటూ దేశం మొత్తం మీద తాగునీటి కష్టాలు తీర్చడానికి గత రెండేళ్లలో నల్సే జల్ కింద 5.7కోట్ల కుటుంబాలకు అందుబాటులోకి తాగునీరు తెచ్చామన్నారు. రానున్న అయిదేళ్లలో మరింత మందికి తాగునీటిని అందిస్తామన్నారు. పీఎం ఆవాస యోజన కింద 80 లక్షల గృహాల నిర్మాణం. దీనికై రూ. 48 వేల కోట్లు నిధులు కేటాయించారు.
* కరోనాతో దేశవ్యాప్తంగా అనేకమందికి మానసిక రుగ్మతలు ఉత్పన్నమయ్యాయి చెప్పిన నిర్మలమ్మ.., మానసిక సమస్యల చికిత్స కోసం ఆన్లైన్ టెలీమెడిసిన్ విధానానికి రూపకల్పన చేస్తున్నామన్నారు. బెంగళూరు ట్రిపుల్ ఐటీ సాంకేతిక సాయం అందిస్తుందన్నారు.
* ప్రధాని ఈ-విద్య కార్యక్రమం కింద టెలివిజన్ ఛానళ్లు 12 నుంచి 200కు పెంపు. పాధ్యాయులకు డిజిటల్ నైపుణ్యాల శిక్షణ
డిజిటల్ విద్య అందించే ఉపాధ్యాయులకు అందుబాటులోకి ప్రపంచస్థాయి ఉపకరణాలు ప్రవేశపెడతామన్నారు. విద్యార్థులందరికి అందుబాటులోకి ఈ-కంటెంట్ తెస్తామన్నారు. వీటితో పాటూ…
క్రెడిట్ గ్యారంటీ స్కీంకు రూ. 2 లక్షల కోట్ల ఆర్థిక నిధులు..
ఎంఎస్ఎంఈలకు మార్కెటింగ్ సహకారం కోసం నూతన పోర్టల్
ఎంఎస్ఎంఈల ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక ప్లాట్ఫాం
చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ప్రత్యేక క్రెడిట్ గ్యారంటీ పథకం
క్రెడిట్ గ్యారంటీ పథకానికి రూ.2 లక్షల కోట్ల ఆర్థిక నిధులు
పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కోసం అదనపు నిధులు, ప్రత్యేక వ్యవస్థలు
ఉద్యోగులు, కార్మికుల్లో నైపుణ్యాభివృద్ధి కోసం ఆన్లైన్లో నేర్చుకునేందుకు అవకాశాలు
ప్రతి రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక ఐటీఐల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు
పర్వతమాల ప్రాజెక్టు కింద పర్యావరణ హితమైన అభివృద్ధి. కొండ ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి తగినంత అవకాశాలు. పర్వతమాల ప్రాజెక్టులో 8 రోప్వేల అభివృద్ధి చేయనున్నారు. దేశంలో నాలుగుచోట్ల మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. మల్టీమోడల్ కనెక్టివిటీలో భాగంగా రైల్వేలతో ఇతర రవాణా సదుపాయాల అనుసంధానం చేయనున్నారు.
* వచ్చే మూడేళ్లలో వంద కార్గో టెర్మినళ్ల ఏర్పాటు. చిరుధాన్యాల అభివృద్ధికి అదనపు ప్రోత్సాహం. 2023ను తృణధాన్యాల సంవత్సరంగా ప్రకటన. వంటనూనెల కోసం దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తి. పీపీపీ మోడల్లో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహం. రసాయన రహిత వ్యవసాయ అభివృద్ధికి మరింత ప్రోత్సాహం. సేంద్రీయ ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహం. వ్యవసాయ ఉత్పత్తుల విలువ పెంపు కోసం స్టార్టప్లకు ఆర్థిక సాయం. రైతులకు అద్దె ప్రాతిపదికన వ్యవసాయ పనిముట్లు ఇచ్చేందుకు ప్రత్యేక పథకం
* రాష్ట్రాల కోసం రూ.లక్ష కోట్ల నిధి.. రాష్ట్రాలకు ఆర్థిక సాయంగా రూ.లక్ష కోట్ల నిధి ఏర్పాటు. ఈ ప్రత్యేక నిధి ద్వారా రాష్ట్రాలకు రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇవ్వనున్న నిర్మలమ్మ తెలిపారు.
* పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక గ్రీన్ బాండ్లు. గిఫ్ట్ సిటీలో ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయాలకు అవకాశం. స్థానిక నిబంధనల నుంచి విదేశీ విద్యాసంస్థలకు మినహాయింపు. అవసరాల ప్రాతిపదికన ప్రత్యేక సదుపాయాలకు నిబంధన కల్పన
* పెట్టుబడుల కోసం రూ. 10.68 లక్షల కోట్ల కేటాయింపు.. భారత్ ఆర్థిక వ్యవస్థ కరోనా ఉత్పాతాన్ని తట్టుకుని బలంగా నిలబడింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు వెన్నుదన్నుగా అవసరమైన ప్రభుత్వ పెట్టుబడులు. మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు కేంద్రసాయం దేశవ్యాప్తంగా మూలధన పెట్టుబడుల కోసం రూ.10.68 లక్షల కోట్ల కేటాయింపు
* సోలార్ ప్లేట్ల తయారీకి రూ. 19,500 కోట్లు.. దేశీయంగా సౌర విద్యుత్ ప్లేట్ల తయారీకి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల కోసం రూ.19,500 కోట్లు కేటాయింపు. బొగ్గు ద్వారా గ్యాస్ ఉత్పత్తి కోసం 4 పైలట్ ప్రాజెక్టులు. అడవులు ప్రైవేటు.. ప్రైవేటు రంగంలో అడవుల ఉత్పత్తి కోసం నూతన పథకం. గిరిజనుల కోసం అటవీ పెంపకానికి ప్రత్యేక పథకం..!
* విద్యా, పారిశ్రామిక అనుసంధానంతో.. విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ సంస్థల మధ్య బలమైన అనుసంధానం. విద్యా, పారిశ్రామిక అనుసంధానం ద్వారా నూతన ఆవిష్కరణలకు శ్రీకారం. రక్షణ రంగంలో ప్రైవేటు సంస్థలకు అవకాశం. డీఆర్డీఓ, ఇతర రక్షణ పరిశోధన సంస్థల భాగస్వామ్యంతో ప్రైవేటు సంస్థలకు అవకాశం. రక్షణ ఉత్పత్తుల దిగుమతులు తగ్గించి స్వయంసమృద్ధి సాధించేలా కృషి..!
ఎగుమతులపై.. ఎగుమతుల వృద్ధికి పారిశ్రామిక సంస్థలకు నూతన ప్రోత్సాహకాలు. మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి, వినియోగంపై దృష్టి. దేశవ్యాప్తంగా ఈ ఏడాది అందుబాటులోకి 5జీ సాంకేతికత. 2022-23లో ప్రైవేటు సంస్థల ద్వారా 5జీ సాంకేతికత ప్రవేశపెడుతున్నాం. 2022-23లో భారత్ నెట్ ప్రాజెక్టు ద్వారా పీపీపీ పద్ధతిలో మారుమూల ప్రాంతాలకు కూడా ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్
* దేశవ్యాప్తంగా ఏకీకృత రిజిస్ట్రేషన్ పథకం(ఎన్జీడీఆర్ఎస్). దేశంలో ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్కు నూతన వ్యవస్థ. దేశవ్యాప్తంగా డీడ్లు, రిజిస్ట్రేషన్లకు ఆధునిక వ్యవస్థ. కాంట్రాక్టర్లకు ఈ-బిల్లులు పెట్టుకునే అవకాశం. బిల్లుల వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చూసుకునే సౌకర్యం. దేశీయ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్, కామిక్స్ రంగాలకు ప్రోత్సాహం ఇవ్వనున్నట్టు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలమ్మ పేర్కొన్నారు..!