కరోనా వైరస్ అంటే ఎవరికీ లెక్క లేకుండా పోయింది. చాలా మంది దాని వల్ల కలిగే అనర్థాలను మరియు జరిగే నష్టాలను అంచనా వేయలేక ఇబ్బందుల పాలు అవుతున్నారు. ఈ వైరస్ ధాటికి అనేక రంగాలు కుదేలు అయినా కూడా అది సినిమా రంగంపై చూపిన ప్రభావం మరే ఇతర రంగంపై చూపలేదు అన్నది అందరి మాట. సంవత్సరానికి కొన్ని వందల కోట్ల టర్నోవర్ ఉన్న ఈ సినిమా రంగంలో గత మూడు నెలలుగా లాభాలు అన్న పదం వినిపించడమే మానేసింది. కేవలం నష్టాలు, కష్టాలు, అప్పులు, వడ్డీలు, బకాయిలు అనేవి మాత్రమే వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను సడలించిన తర్వాత ‘సినిమాలు చేసుకోండి‘ అని పర్మిషన్ లు ఇస్తున్నా చేయలేని పరిస్థితి. ఇక సినిమా థియేటర్లు దగ్గరలో తెరచుకునే అవకాశం లేనందున చాలామంది ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ వైపు మొగ్గు చూపారు. ఇదే సమయంలో చిన్న సినిమా అయినా ముందుగా ఎంతో హైప్ సంపాదించుకున్న మెగాహీరో వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా పరిచయమవుతున్న ‘ఉప్పెన‘ సినిమా హక్కులకోసం రీసెంట్ గా మూడు ఓటిటి కంపెనీలు ఎంక్వయిరీ చేశాయి.
ఇప్పటికే ఆగస్టులో సినిమాలు మళ్లీ థియేటర్లలో ఆడుతాయో లేదో అన్న నమ్మకం అని అందరికీ అనుమానమే. దసరా సమయానికి మొదలైతే గొప్ప అని కొందరు అంటున్నారు. చాలామంది నిర్మాతలు డిసెంబర్, సంక్రాంతి రిలీజ్ పైన దృష్టి పెడుతున్నారు. తమకు వడ్డీ పెరిగిపోతుంది అనుకునేవారు ఓటిటి వారి ఆఫర్లను రెందు చేతులతో అంది పుచ్చుకుంటున్నారు. అయినా సరే ఎంత వడ్డీ పెరిగినా థియేటర్లోనే సినిమా రిలీజ్ అవుతుందని మైత్రి మూవీస్ చెప్పేసిందట.
ఈ చిత్రం పైన ఇప్పటికే పాతిక కోట్ల లెక్కతేలింది. మొత్తం సినిమాకు ఓటిటి ద్వారా అంత మొత్తం వచ్చే అవకాశం లేనందున నిర్మాతలు థియేటర్లలో సినిమాని విడుదల చేయాల్సిందేనని పట్టుబట్టి కూర్చున్నారట. థియేట్రికల్ గా ఈ చిత్రం సంచలనం అవుతుందని నిర్మాతల నమ్మకం. అందుకే ఆ స్థాయిలో ఖర్చు పెట్టేసారు. కరోనా వారి ప్రణాళిక పాడు చేసినా కానీ మంచి సీజన్లో రిలీజ్ చేస్తే సినిమాకు ఢోకా ఉండదని నిర్మాతలు బలంగా నమ్ముతున్నారు. ఈ క్రమంలో ఒక అయిదారు కోట్ల అదనపు భారం పడిన పర్వాలేదని భావిస్తున్నారు.
అయితే ఇక్కడ వీరు లెక్క చూసుకోవడం బాగానే ఉంది కానీ నీ సినిమాకి అయిన మొత్తానికి కొద్దిగా లాభం వచ్చేలా కూడా ఓటీటి ల నుండి మరలా ఆఫర్లు వస్తుంటే కూడా నిర్మాతలు అందుకు మొగ్గుచూపింకపోవడం గమనార్హం. ఇక సినిమాల్లో రిస్క్ చేసి భారీగా లాభపడిన వారు ఉన్నారు…. అలాగే కనుమరుగై పోయినవారూ ఉన్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే ఎంత థియేటర్లలో రిలీజ్ చేసినా కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చాకనే చేయాలి. ఆ సమయానికే చాలా లేట్ అవుతుంది. వెంటనే థియేటర్లు తెరిచి వీరు బొమ్మలు వేసినా ప్రజలు వస్తారా లేదా అన్నది అనుమానమే. ఇక రెండు రోజులు సినిమాను విడుదల చేసి ఆ తర్వాత ప్రజల ఆదరణను చూసి ఆపేసే అవకాశం లేనేలేదు. ఈ లోపలే సినిమా కొద్దిగా తేడాగా ఉన్నా లేదా మన టైం బాగోలేక దానికి బెగటివ్ రివ్యూలు వచ్చినా కూడా ఖర్చు పెట్టిన డబ్బు అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది.
అదేదో ఇక్కడ ఎంతోకొంత లాభానికి ఈ సినిమా అమ్మేసేయడం మేలని సినీ విశ్లేషకుల అంచనా. అది కాకుండా హీరో, హీరోయిన్, డైరెక్టర్ అందరూ కొత్తవారాయె. మహా అంటే సుకుమార్ ఈ చిత్రానికి కథను చేకూర్చారు అన్న విషయం ఒకటే ఇందులో చెప్పుకోదగినది. డిఎస్పి సమకూర్చిన పాటలు హిట్ అయినా కూడా ఈ సినిమా ఒక 30 కోట్లు కలెక్షన్ సాధించడం అంటే ఈ పరిస్థితుల్లో చాలా పెద్ద విషయమే. మరి ఇవన్నీ ప్రొడ్యూసర్ గారు ఆలోచించుకునే ఉండాలి కదా….