Vallabhaneni Vamsi: “ఒక్క మాట ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.. ఒక్క మాట ఏపీ రాజకీయాలను దారుణంగా దిగజార్చింది.. ఆ ఒక్క మాట ఏపీలో రాజకీయ విలువలకు పాతరేసింది.. ఆ ఒక్క మాట ఒక పెద్ద కులంలో అంతరాగ్ని రాజేసింది..! కానీ ఆ ఒక్కమాట వెనుకా ముందు ఉన్న పరిస్థితులు వేరు. రాజకీయాల్లో వాడకూడని మాటని వల్లభనేని వంశీ వాడారు. లోకేష్ ని పప్పు, శుద్ధ, ముద్ద, వెధవ, సన్నాసి.. కాకపోతే ఇంకేమైనా వ్యక్తిగతంగా తిట్టుకోవచ్చు.. కానీ పుట్టుకనే ప్రశ్నించేలా విమర్శించిన వల్లభనేని వంశీ తన నాలుకకు ఏ మాత్రం విలువ లేదని.., తన రాజకీయానికి ఏ మాత్రం పద్ధతి లేదని చాటుకున్నారు.. దిగజారారు. కానీ దీని వెనుక అతని ఉద్దేశం వేరు.. ఇప్పుడు టీడీపీలో జరుగుతున్నా తతంగం వేరు..! ఈ మాటతో టీడీపీ ఇప్పటికీ షాక్ లో ఉంది. టీడీపీలోని ఆ సామాజిక వర్గ పెద్ద పెద్ద నాయకులు షాక్ నుండి తేరుకోలేకపోతున్నారు. ఆ కులంలో ఇప్పుడు వంశీని ఏమనాలో..? ఏం చేయాలో తెలియక లోలోపల సతమతమవుతున్నారు.. నిజానికి వంశీ టీడీపీకి ఏమీ అంత విరోధి కాదు..
Vallabhaneni Vamsi: వంశీ చేరికే అదో రకంగా..!!
వల్లభనేని వంశీ ప్రస్తుతం వైసీపీకి మద్దతు పలికితే పలకవచ్చు. టీడీపీకి దూరమైతే అవ్వవచ్చు.. కానీ ఆయన ఉద్దేశాలు, లక్ష్యాలు వేరు. వైసీపీపై ప్రేమతో.., జగన్ పై అభిమానంతో ఆయన పార్టీలోకి రాలేదు. తనకు వ్యక్తిగత ఇబ్బందులు చాలా ఉన్నాయి. ఆర్ధికంగా పీకల్లోతుల్లో మునిగారు. తాను గతంలో సెటిల్మెంట్లు చేసి సంపాదించుకున్న భూములు ప్రస్తుతం హైదరాబాద్ లో వివాదాల్లో ఉన్నాయి. వాటిని తన ఆధీనంలోనే ఉంచుకోవాలి అంటే జగన్ ఆశీస్సులు, అండదండలు తప్పనిసరి.. అందుకే వైసీపీలో చేరారు. 2019 ఎన్నికలకు ముందు “వైసీపీ నన్ను రమ్మంటుంది.. నా భూములను చూపి, బెదిరిస్తున్నారు.. ప్రాణం పోయినా టీడీపీ వీడను” అంటూ వంశీ చెప్పుకున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏడాది తిరగకుండానే వైసీపీకి మద్దతిచ్చారు. తనకు జగన్ అంటే నిజమైన అభిమానం ఉంటె.. తనకు చంద్రబాబు/ టీడీపీ అంటే నిజమైన కోపం ఉంటె 2019 ఎన్నికలకు ముందే ఈ పార్టీలో చేరాలి. కానీ అధికారాన్ని చూసి చేరారు తప్ప.. అభిమానంతో కాదు అనేది స్పష్టం.. సీఎం జగన్ కి కూడా ఇది బాగా తెలుసు. కాకపోతే చంద్రబాబుని బలహీనం చేయడం అనే లక్ష్యంతో ఇష్టంలేకపోయినా తీసుకున్నారు..!
Vallabhaneni Vamsi: వంశీ నాలుక రకరకాలు..!!
ఇక వల్లభనేని వంశీ గతంలో అనేక సార్లు జగన్ ని దారుణంగా విమర్శించారు. “11 కేసుల్లో దొంగగా ఉన్న జగన్ దగ్గరకు అన్నం తినేవాడు ఎవడూ వెళ్ళడు.. దొంగల పార్టీ.., అందరూ దొంగలు.., జగన్ మోసగాడు.. దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలి.. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వైసీపీ వాళ్ళు మాట్లాడాలి” అంటూ మాట్లాడేవారు. ఆ వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉన్నాయి.. అంచేత.. వంశీ నాడు టీడీపీలో ఉన్నప్పుడు జగన్ ని విమర్శించిన కంటే ఘాటుగా ఇప్పుడు చంద్రబాబుని, లోకేష్ ని విమర్శిస్తేనే అతనికి కాస్తో, కూస్తో ఉనికి ఉంటుంది.. జగన్ దగ్గర కొంచెం మార్కులు పడతాయి.. కనీసం చిన్న చిన్న పనులు జరుగుతాయి.. అందుకే తన నాలుకకు మరింత మసాలా ఘాటు అద్దారు. “తాను అక్క, అక్క అని పిలుచుకునే నారా భువనేశ్వరిపై అనకూడని.. రాజకీయాల్లో వాడకూడని మాటలన్నారు.. ఇప్పటి వరకు ఎవ్వరూ ఏ నాయకుడ్ని వేరే వాళ్లకు పుట్టిన అర్ధం వచ్చేలా విమర్శలు చేయలేదు. తెలుగు రాజకీయాలు అంతదారుణాలకు దిగజారలేదు. కానీ వంశీ సొంత పనులు, వైసీపీలో ఉనికి.., జగన్ దగ్గర మార్కులు కోసం తప్పలేదు. ఘాటు పెంచారు. ” 2019 ఎన్నికల తర్వాత కూడా వంశీ నారా భువనేశ్వరి చుట్టూ తిరుగుతూ అక్క, అక్క అనుకుంటూ తాను ఎన్నికల్లో పెట్టిన ఖర్చులు ఇప్పించాలని వేడుకున్నారు. కానీ.. పూర్తిగా తనకు ఆ ఆర్ధిక భరోసా దక్కలేదు. అందుకే టీడీపీపై అది కూడా ఒక కోపమని వంశీ దగ్గరివాళ్ళు చెప్తున్నారు.. సో.. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు జగన్ ని, వైసీపీని విమర్శించిన కంటే దారుణంగా, ఘాటుగా టీడీపీని విమర్శించాలన్న వంశీ లక్ష్యం దీంతో నెరవేరింది. వైసీపీ సోషల్ మీడియాలో హీరో అయ్యారు. ఆయన మాటలను వైసీపీ సోషల్ మీడియాలో బాగానే వాడుకుంటున్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజం. రాజకీయాల్లో అంత దారుణ విమర్శలు, వ్యాఖ్యలు సరికాదు.., పద్ధతి కాదు..!
టీడీపీలో కులం కోసం కాంప్రమైజ్..!?
ఇక వంశీ ఇంత దారుణంగా వ్యాఖ్యలు చేసాక టీడీపీలో చాలా మంది నొచ్చుకున్నారు. లోకేష్ అయితే కళ్ళమ్మట నీళ్లు కూడా పెట్టుకున్నారని అంటున్నారు.. టీడీపీలో చాలా మంది ఎమ్మెల్యేలు, నేతలు షాక్ అయ్యారు. వంశీపై కోపంతో రగిలిపోయారు. కానీ కౌంటర్ ఇవ్వాలంటే కులం అడ్డం వచ్చింది. టీడీపీలో వంశీ లాంటి వాళ్లకు కౌంటర్లు ఇచ్చే నాయకులు బోలెడు మంది ఉన్నారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళు వంశీని అంతే ఘాటుగా విమర్శించగలరు. ఆ దారుణమైన పదాలు కాకపోయినా.., దూకుడుగా, ఘాటుగా కౌంటర్ ఇవ్వగలరు.. కానీ టీడీపీలో ఎవ్వరూ పెద్దగా నోరు మెదపడం లేదు. కుర్ర సోషల్ మీడియా వాళ్ళు తప్పితే ఎమ్మెల్యే స్థాయి, మాజీలు ఎవ్వరూ వంశీని టార్గెట్ చేయడం లేదు. దీనికి కారణం కులమే… కులాభిమానమే..! తమ అధినేత కొడుకు, తమ కాబోయే బాస్.. తమ బుల్లి బాస్ ని అంత మాట అన్నప్పటికీ టీడీపీ నేతల్లో పెద్దగా పౌరుషం/ పరుష పదాలు రాలేదు.. దీనికి కారణం టీడీపీలో వంశీకి సన్నిహితులు ఎక్కువ. ఆ సామాజికవర్గం.. దాదాపు 15 ఏళ్ళు వంశీతో అందరికీ పరిచయాలు ఉండడంతో ఏమి అనలేకపోతున్నారు. “వంశీ మనోడే” అనే ధ్యాసలో ఉన్నారు. ఆ రోజు చంద్రబాబు దీక్ష వద్ద కూడా వంశీ వ్యాఖ్యలపై చర్చ జరిగినా.. ఎమ్మెల్యేలు, నేతలు ఎవరూ నోటికి పని చెప్పలేదు. కేవలం మనసులో బాధపడి.., వంశీ అలా అనకుండా ఉండాల్సింది అంటూ వదిలేశారు. సో.., వంశీ కులం కార్డుతో ఇంకా చెలరేగిపోతారేమో..! మొత్తానికి వంశీని పార్టీలోకి తీసుకున్న వారి లక్ష్యం నెరవేరుతున్నట్టే ఉంది.. ఇదే కోవలో వంశీతో పాటూ వైసీపీకి మద్దతిచ్చిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం.. వారి కుమారుడు వెంకటేష్ లు మాత్రం చంద్రబాబుని, లోకేష్ ని, టీడీపీని ఒక్క మాట కూడా అనడం లేదు..!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?