Venkaiah Naidu: నాలుగు దశాబ్దాలకు పైగా ఒకే పార్టీలో జాతీయ స్థాయిలో వెలుగొందిన నాయకుడెవరు..!?
తెలుగు రాష్ట్రాల నుండి వెళ్లి.. ఒక జాతీయపార్టీకి అధ్యక్షుడిగా.., కేంద్రమంత్రిగా.., ఉప రాష్ట్రపతిగా చేసింది ఎవరు..!?
8 భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ.. ఎం,అంచి వక్త, మంచి రచయితగా పేరొందిన నాయకుడెవరు..!?
బీజేపీ అధికారంలో లేనప్పుడు పార్టీకి వెన్నంటి ఉంటూ ఢిల్లీస్థాయిలో కీలక బాధ్యతలు నిర్వర్తించినదెవరు..!?
నాణేనికి మరోవైపు…
ఏపీలో బీజేపీ ఎదగకుండా చేసింది ఎవరు..!?
సొంత రాష్ట్రంలో.., సొంత సామాజికవర్గం కోసం పార్టీని పైకి లేవకుండా చేసిందెవరు..!?
సామాజికవర్గం కోసం రాష్ట్రంలో చీకటి రాజకీయాలను నడిపిస్తున్నదెవరు..!?
ఇవన్నీ మన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు గురించే.. బొమ్మ, బొరుసు… తెలుపునలుపు.., పగలూరాత్రీ ఉన్నట్టే.., వెంకయ్య జీవితంలో కూడా నాణేనికి రెండువైపులా రెండు భిన్న పార్శ్వాలున్నాయి.. 1999లో కానీ.., 2014లో కానీ ఏపీలో బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుంది అంటే.. దానిలో కీలక పాత్ర వెంకయ్యదే.. ఆ చీకటి రాజకీయాలు పక్కన పెట్టేస్తే ఆయనకు ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది. ఇది వరకు తెలుగు వ్యక్తికీ రాని అరుదైన అవకాశం వచ్చింది.. సో… “వెంకయ్య నాయుడుకి రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉందా..? బీజేపీకి ఆ అవసరం ఉందా..!? పెద్దల ఆలోచనలు ఎలా ఉన్నాయి..!? అనే అంశాలను పరిశీలిద్దాం..!
భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గురించి పెద్దగా రాష్ట్ర ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు రాజకీయాలకు, తెలుగు ప్రజలకు చనువు, చొరవ ఉన్న నేత. రాజకీయ విలువలు కల్గి ఉన్న కొద్ది మంది నేతల్లో ఆయన ఒకరు. 1978 లో జనతా పార్టీ తరుపున ఉదయగిరి శాసనసభ స్థానం నుండి వెంకయ్య నాయుడు ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. పదవుల కోసం పార్టీలు మారుతున్న నేటి సమాజంలో రాజకీయ విలువలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే వెెంకయ్య నాయుడు బీజేపీ అధికారంలో ఉన్నా లేకున్నా తనకు పదవులు ఇచ్చినా ఇవ్వకున్నా అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. వెంకయ్య ఉప రాష్ట్రపతి నుండి రాష్ట్రపతిగా ప్రమోట్ చేయనున్నారనీ, ఆయన స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ పార్లమెంటేరియన్ గులామ్ నబీ అజాద్ ను నియమించనున్నారని వార్తలు వస్తున్నాయి.
Venkaiah Naidu: గులాం నబీ ఎందుకు..!?
గులామ్ నబీ ఆజాద్ ను ఉప రాష్టపతిగా ఎందుకు అవకాశం ఇవ్వాలి అనుకుంటున్నారనే అంశం ఆసక్తికరం.. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే ఉభయ సభల్లో మూడవ వంతు మెజార్టీ కావాలి… అది కావాలంటే బీజేపీ అభ్యర్ధిని నిలబెడితే సాధ్యం కాకపోవచ్చు… రాష్ట్రాల్లో శాసనసభ్యుల మద్దతు కాావాలి, ప్రాంతీయ పార్టీల మద్దతు కావాలి. సో.. అందుకే కాంగ్రెస్ పార్టీకి చెందిన వివాదరహితుడైన సీనియర్ నాయకుడు గులాం నబీ అజాద్ ను ప్రతిపాదిస్తే అన్ని రాజకీయ పార్టీల మద్దతు లభిస్తుంది, కాంగ్రెస్ కూడా కాదనదు కాబట్టి ఆజాద్ కు ఉప రాష్ట్పపతిగా చాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక రాష్ట్రపతి విషయానికి వస్తే రామ్ నాధ్ కోవింద్ తరువాత బీజేపీ నుండి ప్రతిపాదించే నేతల్లో సీనియర్ నేత ఎల్ కే అద్వానీ.., ఆ తరువాత స్థాయిలో వెంకయ్య నాయుడులు మాత్రమే కనబడుతున్నారు. నూటికి నూరు శాతం ఎల్ కే అద్వానీకి ఆ అర్హత ఉంది. ఎందుకంటే 1980లో కేవలం రెండు ఎంపి స్థానాలతో ఉన్న బీజేపీని 1994,1999 వచ్చేసరికి ఎన్ డీ ఏ కూటమిని కేంద్రంలోే అధికారంలోకి వచ్చే స్థాయికి తీసుకువచ్చారు. ఇదంతా ఎల్ కే అద్వానీ ద్వారానే సాధ్యమైంది. ఆయన చేపట్టిన రథయాత్ర, ఆయన లేవదీసిన బాబ్రీ మసీదు, రామాలయం సెంటిమెంట్ ద్వారా కుదిరింది. బీజేపీ పునాదులు ఆయన భుజస్కందాలపైనే ఉన్నాయి అనేది నిర్వివాదాంశం. బీజేపీ అగ్రనేతల్లో ప్రధాన మంత్రిగా చేసిన వాజ్ పేయి పరమపదించారు. ఇక అద్వానీతో సమకాలీకులు మురళీ మనోహర్ జోషి ఆ తరువాత వెంకయ్య నాయుడు ఉన్నారు. మురళీ మనోహర్ జోషి వయసు 90కి పైబడి ఉంటాయి. అద్వానీకి రాష్ట్రపతి పదవి ఇవ్వాలంటే బీజేపీలో అభ్యంతరం చెప్పే వారు ఎవరూ ఉండకపోవచ్చు కానీ వయసు సహకరించని కారణంగా ఆయనే తిరస్కరించే అవకాశం ఉంది. ప్రస్తుతం కేంద్రాన్ని నడిపిస్తున్న మోడీ, షా ద్వయానికి అద్వానీకి రాష్ట్రపతి పదవి ఇవ్వడం ఇష్టం ఉండకపోవచ్చు కూడా..!
వెంకయ్య ఎందుకు..? ఎలా..!?
ఈ తరుణంలో ప్రత్యామ్నాయంగా బీజేపీలో సీనియర్ గా కనబడుతున్నది, అన్ని అర్హతలు ఉన్నది వెంకయ్య నాయుడు మాత్రమే. రెండు సార్లు ఎమ్మెల్యేగా, పార్లమెంట్ సభ్యుడుగా, రాజ్యసభ సభ్యుడుగా, కేంద్ర మంత్రిగా పని చేయడంతో పాటు బీజేపీ లో ఎన్నికల కమిటీలోనూ, మేనిఫెస్టో కమిటీలోనూ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా కూడా రెండు సార్లు పని చేశారు. ప్రస్తుతం రాజ్యసభ చైర్మన్ గా, ఉప రాష్ట్రపతిగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్టీ పరంగానే కాక రాజ్యాంగ పరంగానూ ఉన్నతమైన పదవులు అలంకరించారు వెంకయ్య నాయుడు. దాదాపు ఎనిమిది భాషల్లో అనర్గళంగా మాట్లాడే వాగ్దాటి ఉన్న నేత ఆయన. ఒక్క రాష్ట్రపతి తప్ప అనేక ఉన్నతమైన పదవులను అదిష్టించారు. మంచి వక్తే కాక రచయిత, వివాద రహితుడుగా కూడా. రాష్ట్రపతి పదవి నిర్వహించేందుకు ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి. అయితే రాష్ట్రపతి పదవి ఇవ్వడానికి ఇవన్నీ కాదు రాజకీయ అవసరం ఉందా లేదా అనేది కేంద్రంలోని బీజేపీ ఆలోచన చేయవచ్చు. వెంకయ్య నాయుడుకి రాష్ట్రపతి పదవి ఇస్తే దక్షిణాది ప్రాంతానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుంది. ఏపి, కర్నాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో ఆయనకు రాజకీయంగా మంచి పరిచయాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఆయన కర్నాటక నుండే రాజ్యసభ సభ్యుడుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏపిలో పుట్టి పెరిగిన వెంకయ్య నాయుడు చెన్నైలో చదువుకున్నారు. దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ప్రభావం చూపించగలిగిన నాయకుల్లో ఆయన ఒకరు. ప్రస్తుతం బీజేపీకి ఉత్తరాది రాష్ట్రాల్లోనే బలమైన పునాదులు ఉన్నాయి. దక్షిణాదిలో కర్నాటక మినహా ఏ రాష్ట్రంలో బీజేపీకీ సీట్లు, ఓట్లు లేవు, ఈ తరుణంలో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపి బలపడాలని చూస్తుంది కాబట్టి ఈ ప్రాంతానికి చెందిన నేతకు అత్యున్నత పదవి ఇస్తే ఈ రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల నాటికి కొన్ని సీట్లు అయినా వస్తాయన్నది ఒక ఆశ. దీనికి తోడు వచ్చే ఏడాది అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ రాష్ట్రాల్లో బీజేపీ అనున్నట్లుగా ఫలితాలు రాకపోతే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. అందుకే వివాద రహితులుగా ఉన్న నేతలైన వెంకయ్య నాయుడు, గులాం నబీ అజాద్ లకు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవులకు ఎంపిక చేసే ఆలోచన కేంద్రంలోని బీజేపీ చేస్తున్నదని వార్తలు వస్తున్నాయి. త్వరలో దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.