VijayasaiReddy: ఆయన ఓ వైసీపీ కీలక నేత, పార్టీలో రెండవ స్థానం ఆయనది. జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసుల్లోనూ ఆయన ఏ 2, ఆయన పేరు ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదనుకుంట. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఆయన మెడకు రెండు భిన్నమైన కేసులు చుట్టుకున్నాయి. ఒక కేసు ఊహించిందే అయినప్పటికీ మరొకటికి ఆయనతో సహా ఎవరూ ఊహించనది. అవి ఏమిటంటే…వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సాక్షాలను తారుమారు చేస్తున్నారనీ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనీ ఇటువంటి వారు బయట ఉండకూడదంటూ తన వద్ద ఉన్న అధారాలతో రఘురామ కృష్ణంరాజు పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను రేపో ఎల్లుండో విచారణకు రానున్నది.
VijayasaiReddy: ఆ కేసు మళ్ళీ తెరపైకి..!!
ఇదిలా ఉండగా ఊహించని మరో కేసు వెలుగులోకి వచ్చింది. గతంలో హైకోర్టు న్యాయమూర్తులను కించపరుస్తూ, కోర్టుల ప్రతిష్టకు భంగం కల్గిస్తూ పలువురు వైసీపీ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు సోషల్ మీడియాలో, మీడియా సమావేశంలో చేసిన కామెంట్స్ పై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దాదాపు 98 మందిపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది. ఇటీవల రాష్ట్ర వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జి గుర్రంపాటి దేవేందర్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆయనను విచారించిన క్రమంలో కీలకమైన సమాచారం సీబీఐకి చెపారనీ తెలుస్తోంది. వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జి మొత్తానికి విజయసాయిరెడ్డే బాస్ అని, ఆయన చెప్పినట్లుగానే తాము పోస్టులు పెట్టామని ఆయన చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తరువాత రాష్ట్రంలో వైసీపీ సోషల్ మీడియాను పటిష్టపర్చడంలో విజయసాయి రెడ్డి కీలక పాత్ర పోషించారనేది అందరికీ తెలిసిందే. అదే విధంగా 2019 లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా సోషల్ మీడియా ఇన్ చార్జిలతో పలు మార్లు విజయసాయి రెడ్డి సమావేశాలను సైతం నిర్వహించారు. ‘మీకు నేను ఉన్నాను, పార్టీ వాయస్ గట్టిగా వినిపించండి’ అంటూ విజయసాయి రెడ్డి బహిరంగంగానే వ్యాఖ్యానించారు కూడా. సో..దేవేందర్ రెడ్డి విజయసాయి రెడ్డి పేరు చెప్పినా చెప్పకున్నా వైసీపీ సోషల్ మీడియా విజయసాయి రెడ్డి కనుసన్నల్లో నడుస్తుంది అన్నది బహిరంగ రహస్యమే.
వైసీపీ సోషల్ మీడియాకి కొండంత అండగా విజయసాయి..!!
విజయసాయి రెడ్డి ఇచ్చిన భరోసాతో వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులు ప్రత్యర్థి పార్టీ నేతలపై వ్యతిరేక పోస్టులను పెట్టడంతో పాటు న్యాయమూర్తులు, కోర్టు తీర్పులపైనా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ పోస్టులు పెట్టారు అంటూ టీడీపీ ప్రచారం మొదలు పెట్టింది. ఆయనను టార్గెట్ చేస్తుంది. హైకోర్టు ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించడంతో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. డాక్టర్ సుధాకర్ విషయంలో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన క్రమంలో వైసీపీ సోషల్ మీడియా తీవ్రంగా రెచ్చిపోయి కామెంట్స్ పెట్టిన విషయం రాష్ట్ర ప్రజానీకం అందరికీ తెలిసిందే. సీబీఐ దర్యాప్తులో భాగంగా కొంత మందిని విచారించింది. కొందరికి నోటీసులు ఇచ్చింది సీబీఐ. కొందరు విదేశాలలో ఉన్నారు. విదేశాల్లో ఉన్న పంచ్ ప్రభాకర్, అన్నెపురెడ్డి మణి లాంటి వారు కూడా న్యాయమూర్తులపై కామెంట్స్ చేసిన వారిలో ఉన్నారు. అయితే దేవేందర్ రెడ్డిని సీబీఐ విచారించిన క్రమంలో విజయసాయిరెడ్డి పేరు వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఒకటి సీబీఐ బెయిల్ రద్దు కేసు, మరొకటి సీబీఐ ఆధ్వర్యంలో విచారణ జరుగుతున్న న్యాయమూర్తులను విమర్శించిన కేసు విజయసాయిరెడ్డి మెడకు చుట్టుకుంటున్నాయని అంటున్నారు. ఈ రెండు కేసులను విజయసాయి రెడ్డి ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. పార్టీలో సోషల్ మీడియా విభాగాన్ని బాగా పెంచి, పార్టీకి డిజిటల్ పునాదులు వేయడంలో విజయసాయి పునరుత్తేజాన్ని నింపారు. 2019 ఎన్నికల విజయంలో ఈ విభాగం పాత్ర ఎనలేనిది..!