Visakha Politics ; విశాఖ మహా నగర పాలక సంస్థ ఎన్నికలు ముగిసాయి. ఫలితాలు వచ్చాయి. మేయర్ కూడా పీఠం ఎక్కేసారు. పరిపాలన మొదలయింది. కానీ రాజకీయ స్క్రూట్ని (పోస్ట్ మార్టం, ఫలితాల అనంతర విశ్లేషణ) మిగిలే ఉంది. ఎన్నికల్లో ఫలితాల తీరు.. స్థానిక ఎమ్మెల్యేల ప్రభావం.. పార్టీల్లా కోసం వారి పనితీరు.. అన్నిటినీ ఓ సారి చూసుకుంటే మంత్రి అవంతి శ్రీనివాస్ తో పాటూ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు కూడా రాజకీయ ముప్పు తప్పేలా లేదు..! ఎందుకనేది కొంచెం లోతుగా చూద్దాం..!!
Visakha Politics ; నియోజకవర్గాలు – డివిజన్లు- గెలుపు లెక్కలు ఇలా..!!
విశాఖ మహా నగర పాలక సంస్థ మొత్తం ఎనిమిది నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. విశాఖ తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణం, గాజువాక నియోజకవర్గాల్లో పూర్తిగా ఉండగా.. అనకాపల్లి, భీమిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో కొన్ని ప్రాంతాలు జీవీఎంసీ పరిధిలోకి వస్తాయి.
* విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ(టీడీపీ).. మొత్తం 15 డివిజన్లు ఉండగా.., టీడీపీ 3 , వైసీపీ 9 , జనసేన ఒకటి, స్వతంత్రులు రెండు గెలిచారు. ఇక్కడ టీడీపీకి మరో మూడు వరకు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ… అధికార పార్టీ వ్యూహాలు, ఎమ్మెల్యేని కట్టడి చేయడం.., స్థానిక టీడీపీ నేతలను సైలెంట్ చేయడంతో రాలేదు. సో.., ఎమ్మెల్యే చేసేదేమి లేదు.
* విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గణబాబు (టీడీపీ) ఉన్నారు. ఇక్కడ మొత్తం 14 డివిజన్లు ఉండగా…, టీడీపీకి 5 , వైసిపికి 9 వచ్చాయి. టీడీపీకి మరో రెండు రావాల్సి ఉంది. కానీ అధికార పార్టీ వ్యూహాలు బాగా వర్కవుట్ అయ్యాయి. ఇక్కడా ఎమ్మెల్యే వైఫల్యం ఏమి లేనట్టే.
Must Read ; మున్సిపల్ ఎన్నికల పోస్ట్ మార్టం ; ఉద్యమాల ప్రభావం ఎంత మేరకు..!?
* విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ టీడీపీ నుండి గెలిచి, వైసిపిలోకి వచ్చారు. ఈ నియోజకవర్గ పరిధిలో మొత్తం 13 డివిజన్లకు గానూ.. టీడీపీ 4 , వైసీపీ 5 .. ఇతరులు 4 గెలిచారు. ఇక్కడ వాసుపల్లి అధికార పార్టీ ప్రభావం పెద్దగా పనిచేయనట్టే. టీడీపీకి మంచి ఫలితాలే వచ్చినట్టు. ఇక్కడ గీతం యూనివర్సిటీ శ్రీభరత్ టీడీపీ బాధ్యతలు చూసుకున్నారు.
* విశాఖ ఉత్తర ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు ఉన్నారు. మొత్తం 17 డివిజన్లు ఉండగా… వైసీపీ 15 గెలిచింది. టీడీపీ ఒకటి, బీజేపీ ఒకటి మాత్రమే గెలిచాయి. ఇక్కడ గంటా వైఫల్యం స్పష్టం. ఆయన సైలెంట్ గా ఉండడం, ఆయన వర్గం అంతర్లీనంగా వైసిపికి చేయడమే దీనికి కారణం అని పార్టీ భావిస్తుంది.
* ఇక మంత్రి అవంతి ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలో మొత్తం 9 డివిజన్లు ఉండగా.. టీడీపీ కి 5 , వైసిపికి 4 డివిజన్లు వచ్చాయి. సో.., ఇక్కడా మంత్రి వైఫల్యం స్పష్టమే. అధికారంలో ఉంటూ.. మంత్రిగా ఉంటూ కనీసం 6 డివిజన్లు కూడా గెలిపించుకోలేకపోయారు. టీడీపీదే పైచేయిగా ఉంది.
ఈ ఇద్దరిపై ఆ పార్టీ పెద్దల కన్ను..!?
మంత్రి అవంతి, ఎమ్మెల్యే గంటా ఇద్దరూ మంచి స్నేహితులే. గంటా 1999 లో… ఆయన శిష్యుడిగా అవంతి 2009 లోనూ రాజకీయాల్లోకి వచ్చారు. 2019 ఎన్నికలకు ముందు వరకు ఒకే పార్టీల్లో ఉన్నారు. ఇద్దరికీ మధ్య మంచి రాజకీయ బంధం ఉంది. ఈ ఇద్దరు తమ వైఫల్యాలకు బాధ్యులే. టీడీపీకి సంస్థాగత బలం బాగా ఉన్న ఉత్తర నియోజకవర్గంలో కనీసం మూడో వంతు ( ఆరు డివిజన్లు) అయినా టీడీపీ గెలిచే వీలుంది. కానీ గంటా కనీసం పని చేయకపోవడం.., ఒక్క రోజు ప్రచారంతో సరిపెట్టడం.., చివర్లో ఆర్ధిక వనరుల సర్దుబాటులో పట్టించుకోకపోవడంతో టీడీపీ కి కేవలం ఒక్క డివిజన్ మాత్రమే వచ్చింది. దీనిపై చంద్రబాబు సీరియస్ గా ఉన్నారని సమాచారం. గంటాపై అనేక పిర్యాదులు వెళ్తున్నాయి. మరోవైపు మంత్రి అవంతి శ్రీనివాస్ పై కూడా వైసీపీ పెద్దలకు అనేక పిర్యాదులు వెళ్తున్నాయి. రాష్ట్రం మొత్తం వైసీపీ గాలి వీచినా సొంత నియోజకవర్గంలో అధిక స్థానాలు గెలిపించుకోలేక.. మంత్రి అవంతి రాజకీయంగా ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. సీఎం జగన్ ఏ రోజు అయినా కొన్ని సీరియస్ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అంటూ పార్టీలో చర్చ జరుగుతుంది..!!