Visakha Ukku – ఉవ్వెత్తున లేస్తుందనుకున్న విశాఖ ఉక్కు ఉద్యమానికి కొద్ది రోజులు విరామం పడనుంది. సీఎం జగన్ తీసుకున్న సాహసోపేత నిర్ణయంతో.. ఒక్క హామీతో ఉద్యమకారులు చల్లబడినట్టే కనిపించారు. రేపు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ దినోత్సవంగా పరిగణించి చిన్నపాటి ర్యాలీలు చేస్తారు. ఆపై ఎల్లుండి నుండి ఇక ఉద్యమానికి తాత్కాలికంగా ఆపేయనున్నారు.
ఈ ఉద్యమకారులతో సీఎం జగన్ భేటీ సందర్భంగా జగన్ ఇచ్చిన హామీ సంతృప్తికరంగా ఉండడంతో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొన్నాళ్ళు ఉద్యమం తగ్గించి.. వేచి చూడనున్నారు. అసెంబ్లీలో తీర్మానం ఆపై జరిగే పరిణామాల ఆధారంగా తదుపరి కార్యాచరణ ఉండనుంది.
Visakha Ukku – సీఎం జగన్ ఏం చేయనున్నారు..!?
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతికరేకంగా శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలి అనేది ఉద్యమకారుల ప్రధాన డిమాండ్. సుమారు 25 నిమిషాల భేటీలో ఇదే కీలక పాయింటు గా చర్చ జరిగింది. సీఎం జగన్ అందుకు అంగీకరించారు. “విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు” కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఏపీ శాసనసభలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించనున్నారు. ఇది తాత్కాలికంగా విశాఖ కార్మికులను చల్లార్చింది.
కానీ కేంద్రం ఎంత మేరకు పట్టించుకుంటుంది..? ఈ తీర్మానం ఎంత మేరకు పని చేస్తుంది అనేది అత్యంత కీలకమైన అంశం. వచ్చే అసెంబ్లీ సమావేశాల లోనే లేదా.. ప్రత్యేక సమావేశాలు అయినా నిర్వహించి ఈ మేరకు తీర్మానం మాత్రం చేయడం ఖాయమే. ఇప్పటికే టీడీపీ విశాఖ ఉక్కు ఉద్యమంపై కొన్ని ఆశలు పెట్టుకుంది. రాజకీయంగా వాడుకునే పనిలో ఉంది. రేపు నిరసనలకు పిలుపునిచ్చింది. ఈరోజు సీఎం నిర్ణయంతో టీడీపీకి కూడా షాక్ తగిలినట్టే..!
కేంద్రం అంగీకరిస్తుందా..!? అప్పుడు ఏం జరుగుతుంది..!?
కేంద్రం అంటే బీజేపీ పెద్దలు ఏదైనా నిర్ణయం తీసుకుంటే మళ్ళీ పునరాలోచన చేయడం లేదు. మళ్ళీ వెనకడుగు వేయడం లేదు. ఇప్పటికే గడిచిన నాలుగేళ్లలో చాల కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం అయిపోయాయి. కార్పొరేట్ శక్తులకు రెడ్ కార్పెట్ వేయడంలో బీజేపీ పెద్దలు ఆరితేరారు. ఎ మాత్రం నష్టాలు వచ్చినా భరించడానికి సిద్ధంగా లేరు. సింపుల్ గా దాన్ని ప్రైవేట్ కి ఇచ్చేసి, బాధ్యతలు వదిలించుకోవడమే ప్రస్తుతం బీజేపీకి ఏకైక మార్గంగా కనిపిస్తుంది. అందుకే.. విశాఖ ఉక్కు విషయంలో ఏ మాత్రం స్థానిక సెంటిమెంట్, నాటి పోరాటం గురించి ఆలోచించకుండా ఏడాది నుండి తెరవెనుక తతంగాన్ని నడిపిస్తూ వచ్చారు.
* బీజేపీ తీసుకున్న నిర్ణయానికి సీఎం జగన్ అసెంబ్లీలో తీర్మానం చేయడం వరకు పెద్ద కష్టమేమి కాదు.
కానీ ఆ తర్వాత జరిగే పరిణామాలే కీలకం కానున్నాయి. ఇటువంటి ఎన్నో రాష్ట్రాల శాసనసభల తీర్మానాలను పక్కన పెట్టి, తాము తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడంలో మోడీ సిద్ధ హస్తులు. సో.. ఇప్పుడు నిబంధనలు, తీర్మానాలు పక్కన పెట్టి రాజకీయ నిర్ణయాలే కీలకం కాబోతున్నాయి. అంటే రాజకీయంగా బీజేపీతో ఢీ కొట్టే సాహసం ఏపీలో ఎవరికి లేదు. సీఎం జగన్ ఉన్న పరిస్థితుల్లో అది అంత ఈజీ కూడా కాదు. అందుకే కొన్ని సంప్రదింపులు, చర్చలు, స్థానిక సెంటిమెంట్ అంశాలు, రిక్వెస్ట్ ల ద్వారానే ఏమైనా సాధ్యమయితే అవుతుంది. ఏది ఏమైనా.. ఈరోజు సీఎం ఇచ్చిన హామీ మాత్రం సాహసోపేతమే..! ఒకరకంగా రిస్క్ తీసుకున్న నిర్ణయమే..!