Vizag Steel Plant : “అది 1960 వ దశకం… విశాఖ ఓ ఉద్యమం ఊపిరి పోసుకుంది. 1966 నుండి 1970 వరకు నాలుగేళ్ల పాటు “ఉక్కు సంకల్పం”తో ఉద్యమం సాగింది. “విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు” (Visakha ukku – Andhrula Hakku) నినాదంతో ధర్నాలు, ఆందోళనలు, రాస్తారోకోలు, నిరసనలు, నిరాహార దీక్షలు, గొడవలు, ఘర్షణలు… ఒకటేమిటి…? నాలుగేళ్ళ పాటు చరిత్రలో నిలిచిపోయే ఉద్యమం జరిగింది. 32 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో ఉద్యమం ఊపిరిలీనింది. ఈ ఫలితంగా 1970 లో ప్రధాని ఇందిరాగాంధీ “విశాఖలో ఉక్కు పరిశ్రమ” నిర్మిస్తాం అంటూ ప్రకటించారు.
* 1970 ఏప్రిల్ 10 విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పనున్నట్లు ప్రధాని ఇందిర పార్లమెంటులో ప్రకటించారు. కర్మాగారం కోసం కురుపాం జమీందారులు 6000 ఎకరాలను దానం చేసారు. 1971 జనవరి 20న ఇందిరా గాంధీ చేతనే కర్మాగారం శంకుస్థాపన జరిగింది. కానీ సాంకేతిక లోపాలు, నిధుల లోటు, ప్రభుత్వాలు మారడం, రాజాకీల ఫలితంగా 1987 వరకు పరిశ్రమ నిర్మాణ పూర్తికాలేదు. చివరికి 1990 లో నిర్మాణం పూర్తి చేసి పూర్తిస్థాయిలో పరిశ్రమ కార్యకలాపాలు మొదలు పెట్టారు. అప్పట్లో ఏడాదికి రూ. 50 కోట్లు నికర లాభం ఆర్జించేది..!
Vizag Steel Plant : విశాఖ ఉక్కు – ప్రత్యేకతలు ..!!
మొత్తం కార్మికులు – 17200 (పెర్మనెంట్) , 16000 కాంట్రాక్టు
మొత్తం విస్తీర్ణం – 36 వేల ఎకరాలు
ఉత్పత్తి సామర్ధ్యం – ఏడాదికి 73 లక్షల టన్నులు ఉక్కు
నికర ఆదాయం – రూ. 96 కోట్లు (2018 – 19) ఆ తర్వాత నష్టం వస్తుంది.
Vizag Steel Plant : నష్టాలు ఎందుకు ..?
ఉక్కు రంగంలో అంతర్జాతీయ సంస్థల పోటీ. విశాఖ ఉక్కు నుండి జర్మనీ, జపాన్, రష్యా దేశాలకు ఎక్కువగా ఎగుమతి జరిగేది. కానీ అంతర్జీతీయ విపణిలో ధరల హెచ్చుతగ్గులు, ఇతర దేశాల పోటీ కారణంగా ఇక్కడ మార్కెట్ తగ్గింది. దీంతో పాటూ ఇనుము ధర పెరుగుదలతో ప్రత్యామ్నాయంగా వేరే మెటీరియల్ వాడకం పెరిగింది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ (RINL) పేరుతో కేంద్ర ప్రభుత్వమే దీన్ని నడిపిస్తుంది. మొదట్లో బాగానే లాభాలు వచ్చేవి. ఇప్పటి వరకు లాభాలు, నష్టాలు అన్నిటినీ లెక్కలు వేసుకుంటే సుమారుగా రూ. 5 వేల కోట్లు లాభాలే ఆర్జించినట్టు..!!
నష్టాలు భర్తీకి ఏం ప్లాన్ వేశారు..!?
కేంద్రం చేతిలో కర్మాగారం ఉంది. నష్టాలు వస్తున్నాయని దీన్ని కేంద్రం ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవల కేంద్ర మంత్రివర్గం సమావేశాల్లో ఈ నోట్ ని ఆమోదించారు. ప్రైవేట్ పరం చేసి.. 2 కోట్ల టన్నుల ఉత్పత్తి సామర్ధ్యానికి పెంచి.., దేశం మొత్తం మీద ట్రైన్ చక్రాలు తయారీ సంస్థగా దీన్ని చేస్తే బాగుంటుంది అనేది కేంద్రం యోచన. ప్రభుత్వ పరంగా ఉంటె మార్పులు కుదరవు, నష్టాలు భర్తీ సాధ్యం కాదు కాబట్టి.., ప్రైవేట్ పరం చేసేయాలని కేంద్రం యోచిస్తుంది. కానీ.. ఇది సెంటిమెంట్ కి ముడిపడి ఉన్న అంశం కావడంతో దాదాపు నాలుగు జిల్లాల్లో “విశాఖ ఉక్కు” సెంటిమెంట్ రగులుతుంది..! అందుకే కొద్దీ రోజులుగా ఉద్యమాలు ఊపందుకున్నాయి. తాజాగా ఈరోజు విశాఖ నగరంలో అఖిలపక్షం బైక్ ర్యాలీ నిర్వహించింది. కొందరు రాజకీయ నేతలు కూడా ఉద్యమంలోకి వస్తున్నారు. మలివిడత ఉద్యమానికి అక్కడి కార్మికులు, వివిధ సంఘాల ప్రతినిధులు ప్లాన్ చేస్తున్నారు..!!
(ఈ ఉద్యమం తీవ్రరూపం దాల్చితే రాజకీయంగా జగన్, మోడీల్లో ఎవరికీ నష్టం వస్తుంది..? దీని వెనుక ప్రణాళిక ఏమిటి..? అనేది తర్వాత కథనంలో చర్చిద్దాం..!)