Vizag Steel Plant : విశాఖ ఉక్కు పరిశ్రమ Vizag Steel Plant నరేంద్ర మోదీ 2014లో దేశానికి ప్రధాని అయ్యాక చేసిన కొన్ని వ్యాఖ్యల్లో ‘మీకొక శ్రామికుడు దొరికాడు. దేశం కోసం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీరే చూస్తారు’ అనేది ఒకటి. నిజంగానే కొన్ని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ తో ప్రశంసలు దక్కితే.. నోట్ల రద్దుతో విమర్శలు ఎదుర్కొన్నారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని అయోధ్య, కశ్మీర్.. సమస్యలను పరిష్కరించారు. అయితే.. మొదటి నుంచీ మోదీపై ఉన్న పడిన ముద్ర మాత్రం.. ‘మోదీ కార్పొరేట్లకు కొమ్ము కాసే వ్యక్తి’ అనే. దీనికి ఉదాహరణగా నిలిచే అంశాల్లో ఒకటి ‘విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ’.
‘వ్యాపారం చేయడం ప్రభుత్వ విధి కాదు.. నష్టాలొస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడమే మార్గం’ అని మోదీ ఆమధ్య తేల్చేశారు. విశాఖలో భారీ ఎత్తున ఉద్యమం జరుగుతున్నా.. ప్రైవేటీకరణ తప్పదు అని నిర్మలా సీతారామన్ ప్రకటించి ఉద్యమం మరింత తీవ్రమయ్యేలా చేశారు. అయినా.. ఈ అంశంపై ముందుకెళ్తూ కమిటీలు కూడా వేసేసింది కేంద్రం. అయితే.. ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్, అనురాగ్ ఠాకూర్..
వంటి వారికి షాకిచ్చేలా విశాఖ ఉక్కు లాభాల బాటలో ఉందని నిన్న సంస్థ సీఎండీ పీకే రథ్ ప్రకటించడం సంచలనం రేపుతోంది. నష్టాల్లో ఉందని చెప్తున్న కేంద్రానికి వినిపించేలా.. ఏస్థాయిలో లాభాల్లో ఉందో చెప్పారు. ఏకంగా సంస్థ చరిత్రలోనే తొలిసారి మార్చి నెలలో లాభాలు వచ్చాయని లెక్కలతో సహా వివరించడం కేంద్రానికి షాక్ ఇచ్చేదే.
సీఎండీ పీకే రథ్ లెక్కల ప్రకారం.. ‘కర్మాగారం చరిత్రలోనే రెండో అత్యధిక టర్నోవర్ గా రూ.18 వేల కోట్లు సాధించడంతో 13 శాతం వృద్ధి సాధించింది. ఈ 4 నెలల్లోనే 740 కోట్ల నికర లాభం నమోదైంది. మార్చిలో 7,11,000 టన్నుల ఉక్కు రూ.3,300కోట్లకు విక్రయించారు. కర్మాగారం చరిత్రలోనే ఈ మార్చిలో ఇది అత్యధిక ఆదాయం’ అని చెప్పాలి. దీంతో విశాఖ ఉక్కు మార్కెట్ లో పోటీని తట్టుకుని మంచి లాభాల్లో ఉందని చెప్పాలి. కానీ..
కేంద్రం మాత్రం నష్టాల్లో ఉందని చెప్తోంది. దీంతో విశాఖ ఉక్కుపై కొత్త చర్చ వస్తోంది. కేంద్రం కావాలనే సంస్థను ప్రైవేటీకరిస్తోందా..? కార్పొరేట్లకు లాభం చేకూర్చేందుకేనా..? ప్రతిపక్షాలు ఆరోపించినట్టు మోదీ నిజంగానే కార్పొరేట్ల పక్షపాతా..?.. ఇవన్నీ సగటు వ్యక్తికి ముఖ్యంగా ఆంధ్రులకు వచ్చే సందేహాలే..! మరి.. కేంద్రం ఆలోచనేంటో..?