Vizag Steel: విశాఖ ఉక్కు Vizag steel ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ నినాదం మళ్లీ ఊపందుకుంది. డిమాండ్లు, పోరాటాలు, ప్రాణత్యాగాల అనంతరం ఏర్పడిన విశాఖ ఉక్కుపై కేంద్రం ప్రైవేటీకరణ అస్త్రం ప్రయోగించడం ఆ ప్రాంత వాసులనే కాదు.. ఏపీ ప్రజలను కలవరపెడుతోంది. అధికార వైసీపీతోపాటు, కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీనే అయినా.. ఏపీ బీజేపీ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రస్తుతం విశాఖ కేంద్రంగా ప్రజా, రాజకీయ ఉద్యమాలు జరుగుతున్నాయి. అయితే.. ఇవేమీ కేంద్రాన్ని ఒప్పించే పరిస్థితి లేదు. సాక్షాత్తూ ప్రధాని మోదీనే ఓ క్లారిటీ ఇచ్చేశాక ప్రైవేటీకరణకు అడుగులు పడుతున్నాయి. అయితే.. ఇటివల అసోం ప్రభుత్వం తమ రాష్ట్రంలోని ఓ ప్రభుత్వరంగ సంస్థపై తీసుకున్న ఓ నిర్ణయం ఏపీ కూడా తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.
అసోంలోని ‘నుమాలిఘర్ రిఫైనరీ’లోని తన వాటా శాతం 61.65 విక్రయించేందుకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మొత్తం 9,876కోట్లని తెలుస్తోంది. ఈమేరకు రిఫైనరీలోని ఈక్విటీ షేర్లను అసోం ప్రభుత్వం లేదా ప్రభుత్వం సూచించే సంస్థ పేరుతో బదలాయించడానికి బీపీసీఎల్ బోర్డు కూడా అంగీకరించిందని తెలుస్తోంది.
దీంతో చిన్న రాష్ట్రమైన అసోంలో ఉన్న భారీ ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటుపరం కాకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. త్వరలో ఎన్నికలు కూడా జరుగుతూండటంతో ఈ నిర్ణయం రాజకీయంగా ప్రస్తుతం పాలనలో ఉన్న బీజేపీకి లాభించే అవకాశం లేకపోలేదు. అసోం ప్రభుత్వ ఆలోచనే ఏపీ చేయాలనేది నిపుణులు చెప్తున్న మాట.
విశాఖను ఏపీకి రాజధాని చేయాలని భావిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి అసోం దారి చూపించింది. రాష్ట్రీల ఇస్పాత్ నిగం లిమిటెడ్ (విశాఖ ఉక్కు) నుంచి కేంద్రం ఉపసంహరించుకుంటున్న పెట్టుబడులను ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసుకుంటే జగన్ ప్రభుత్వానికి లాభించే అంశం.
ప్రతిపక్షాలు కూడా మరేమీ మాట్లాడే అవకాశం ఉండదు. వేలకోట్లే అయినా ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేస్తే లక్షల కోట్ల విలువైన భూమి ఏపీకి దక్కుతుంది. నేరుగా 20వేలు, పరోక్షంగా 40 వేల వరకూ కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఇదే విషయమై పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు కూడా గతంలో చేశారు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం ఇందుకు సాహసిస్తుందా.. అనేదే ప్రశ్న..?
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?