జగన్ మోడీ భేటీ..! ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీలు, పోలవరం నిధులు, జీఎస్టీ బకాయిలు..! అన్నీ తీసేయండి. ఇవన్నీ కామెడీ అంశాలు. ఈ భేటీ పరమార్ధం ఒక్కటే. ఎన్డీయేలోకి వైసీపీ చేరిక. మోడీ అడగడం వాస్తవం.., అమిత్ షా మొదటిసారి ఆహ్వానించారు. మోడీ ఇప్పుడు మళ్ళీ ఆహ్వానించారు. ఇక నిర్ణయం జగన్ చేతిలోనే..!!
వెళ్తే ఏం జరుగుతుంది..!!
జగన్ ఎన్డీయేలో చేరితే లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. కానీ వీటిలో ఏవి తాత్కాలికం.., ఏవి ఎక్కువ ప్రభావం చూపుతాయి అనేది చూసుకుని జగన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
* కేంద్రంలో జగన్ చేరితే తనపై కేసుల ఒత్తిడి కొంత మేరకు తగ్గే అవకాశం ఉంటుంది. కేంద్రం తన చేతిలో ఉన్నప్పుడు తను కచ్చితంగా ఈ కేసుల నుండి బయట పడడానికి చూస్తారు అనడంలో సందేహం లేదు.
* ఎన్డీఏలో జగన్ చేరితో ఇక్కడ చంద్రబాబుని, టీడీపీని డమ్మీని చేసేయొచ్చు. జగన్ అనుకుంటున్నట్టు సీబీఐ విచారణ వేయించవచ్చు. అమరావతి కుంభకోణం, ఫైబర్ గ్రిడ్ అంశాలపై సీబీఐ వేసి, బాబుని, చినబాబుని జైలుకి పంపించే అవకాశాలున్నాయి. తద్వారా జగన్ లో కొంత ద్వేషం చల్లారే అవకాశం ఉంటుంది.
* తనకు మొదటి నుండి అడ్డు వస్తున్నా న్యాయ చిక్కులు తగ్గే అవకాశం ఉంది. న్యాయవ్యవస్థని శాసించే శక్తితో జగన్ చేయి కలిపితే తనకు కచ్చితంగా ఎంతో కొంత ఉపసమనం కలుగుతుంది. ఇక ప్రతీ నిర్ణయాలకు జగన్ సుప్రీం కి వెళ్లాల్సిన అవసరం లేదు.
* తను అనుకుంటున్నట్టు మండలిని రద్దు చేసేయొచ్చు. మూడు రాజధానులు పెట్టేయొచ్చు.
* జగన్ మొదట టీడీపీని పూర్తిగా టార్గెట్ చేసి, నాటి అవినీతిని తవ్వి ఆ పార్టీని నైతికంగా బలహీనం చేయడం ద్వారా తను బలపడవచ్చు. వచ్చే ఎన్నికల నాటికి తనే అతీత శక్తిని అనే అనుకోవచ్చు. ఇలా జగన్ కి అనేక రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయి. ఊరిస్తున్నాయి.
రాజకీయంగా నష్టమే సుమీ..!!
ఇక రాజకీయంగా కొన్ని నష్టాలను జగన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏపీలో ఓటు బ్యాంకులో 12 శాతం వరకు ఉన్న క్రిష్టియన్, ముస్లిం ఓట్లు తగ్గే అవకాశం ఉంది. వీరిలో చాల వరకు జగన్ కి దూరమయ్యే అవకాశం ఉంటుంది. కాషాయం పూర్తిగా పులుముకున్న బీజేపీతో జగన్ కలిసిన మరుక్షణం అతనికి పూర్తిగా మద్దతు దారులుగా ఉన్న ముస్లిం, క్రిష్టియన్ పెద్దలు కొందరు పార్టీని వీడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నష్టాన్ని పూడ్చుకోవడం జగన్ కి కష్టమే. చేజేతులా సొంత ఓట్లు వదులుకున్నట్టు ఉంటుంది.
* కేంద్రంలో భాగస్వామిగా ఉంటె అభివ్రిద్ది, నిధుల లభ్యత, హోదా, అంశాలపై ఒత్తిడి ఉంటుంది. “కేంద్రానికి మన అవసరం లేదు. అందుకే హోదా ఇవ్వరు” అని జగన్ నోటితో జగనే చెప్పారు. ఇప్పుడు కేంద్రమే రమ్మంటుంటే జగన్ ప్రత్యేక హోదా బేరం పెట్టకుండా కలిశారు అనే అపవాదు వస్తుంది. ఇది విపక్షాలకు ఆయుధంగా మారుతుంది. ఇప్పటికే బీజేపీపై ఉన్న వ్యతిరేకత జగన్ పైకి కూడా కొంతమేరకు మళ్లుతుంది.
పెద్దలతో సంప్రదింపులు..!!
ఇవన్నీ ఆలోచించుకుంటున్న సీఎం జగన్ ప్రస్తుతం పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నారు. కేంద్రంలో చేరితో రెండు కేంద్ర మంత్రి పదవులు ఇస్తారు. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్సీ ఇద్దరికీ మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే జగన్ ప్రస్తుతం ఫుల్ డైలమాలో ఉన్నారు. కేంద్రంలో నేరుగా చేరడమా.. ఇప్పుడు ఉన్నట్టు బహిరంగ మిత్రుడుగా ఉండడమా అనే సంశయంలో మాత్రం ఉన్నారు. బహుశా ఓ వారంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.