రెండు తెలుగు రాష్ట్రాల్లో రామోజీరావు అనే పేరు ఒక బ్రాండ్. ‘మీడియా మొఘల్’ గా కీర్తించబడే ఆయన తెలుగు మీడియా రంగం లోనే కాకుండా ఇతర భాషల్లోనూ మీడియా పరంగా తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. రామోజీ ఫిలిం సిటీ, మార్గదర్శి చిట్ ఫండ్, ప్రియా పచ్చళ్ళు…. అంటూ ఇలా చెప్పుకుంటూ పోతే అతను వ్యాపార సామ్రాజ్యాలు చాలానే ఉన్నాయి. ఒక రామోజీ ఫిలిం సిటీ నుండే అతనికి నెలకు కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది అన్నది అందరికీ బహిరంగంగా తెలిసిన సత్యం. అయితే కరోనా దెబ్బకు రామోజీ సామ్రాజ్యం విపరీతంగా విలవిలలాడిపోయిందట. దాని ఎఫెక్ట్ మనం రోజూ వస్తున్న ఈనాడు డైలీ లో తగ్గించబడిన పేపర్లను చూస్తేనే అర్థమవుతుంది.
అయితే కరోనా దెబ్బకు ఒక్కసారిగా తన వ్యాపార సామ్రాజ్య కూసాలు కదిలిపోయాయి అంటే అతనిని నమ్ముకొని…. అతని వద్ద నమ్మకంగా పనిచేస్తున్న ఉద్యోగుల సంగతి ఏమిటి? నాలుగు నెలల క్రితమే వారి తొలగింపు ప్రక్రియ మొదలైపోయింది అన్న విషయం తెలిసిందే కానీ ఈ మేరకు ‘సెటిల్మెంట్లు’ ఇంకా జరగాల్సి ఉండగా కొందరికి సరైన ‘సెటిల్మెంట్లు’ లేకుండానే ఉద్వాసన పలికినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే స్వయంగా బాధిత ఉద్యోగులే ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రామోజీరావుపై ఒక లేకాస్త్రం సంధించారు. ఇక ఆ ఉత్తరం చదివిన తర్వాత అందరికీ కొత్త అనుమానాలు రావడం మొదలయ్యాయి.
వివరాల్లోకి వెళితే రామోజీ రావు గారికి ‘పాదాభివందనం’ చేస్తూనే వారు ఈనాడు పత్రిక ను నమ్ముకుని ఏ విధంగా నష్టపోయారో వారి సమస్యలను ఏకరువు పెట్టిన తీరు నిజంగా శోచనీయం. “కరోనా నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలకు దాదాపు 30 కోట్ల రూపాయల విరాళాలు ఇచ్చిన ఆయన ఇప్పుడు మాత్రం సంస్థ ఇంత ఉన్నత స్థాయిలో ఉండేందుకు దశాబ్దాలుగా కృషి చేసిన ఉద్యోగులను ఇలా ఉన్నఫలంగా తొలగించడం న్యాయమేనా?” అన్నట్లు ప్రశ్నించారు వారు. ఇంత ఘాటుగా వారి లేఖలో మాటలు లేకపోయినా ద్వంద్వార్థం లోకి అన్వయించుకుంటే వారి వాదన అదే అన్నది ప్రజల మాట. హుద్ హుద్ తుఫాను సమయంలో విరాళాలు ఇచ్చిన ఈ పెద్ద మనసున్న మారాజు ఈ కష్టకాలంలో మమ్మల్ని ఆదుకోలేరా అన్నట్లు ప్రశ్నించారు.
తమ కుటుంబ అభివృద్ధి కన్నా ముందు సంస్థ అభివృద్ధికే పెద్దపీట వేశామని చెప్పుకుంటున్న ఉద్యోగుల విషయంలో రామోజీరావు కటువుగా వ్యవహరించారన్న అనుమానాలు మొదలయ్యాయి. నిజానికి ఎవరి వ్యాపారం వారి ఇష్టం. అవతలివారు వచ్చి తలదూర్చడానికి లేదు కాని రామోజీరావుకి ఉన్న సామ్రాజ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే నాలుగు నెలలు సంక్షోభం అసలు పెద్ద విషయమే కాదన్నది చాలామంది అభిప్రాయం. అయితే ఆయన రాబోయే ఉపద్రవం పై ముందుచూపుతో వ్యవహరించారు అని చెబుతున్నా… ‘అర్థాంతరం’ అన్న మాటకు మాత్రం అతని సంస్థలోని ఉద్వాసనలు అద్దం పడుతున్నాయి. మరి వారికి ఏదో ఒక రీతిలో న్యాయం చేయాలి కదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అంతెందుకు పొద్దున్నే లేస్తే నీతులు చెప్పే ఉన్నత విలువలున్న మీడియా సంస్థకు రామోజీరావు అధిపతిగా ఉన్నారు. ఇక కరోనా మొదలైన కొద్ది రోజుల్లోనే ఈ తొలగింపు కలకలం చెలరేగింది. ఎంతో మంది దీనిని ఖండించారు. అయితే ఈ నెలన్నర సంక్షోభాన్ని తట్టుకోలేనంత బలహీనంగా రామోజీరావు సామ్రాజ్యం అయితే లేదు అని కొందరు మాట. “అతని వ్యాపారం గురించి లాభనష్టాల గురించి కష్టాల గురించి మీకు ఏం తెలుసు? అతనికి తనకు నచ్చినట్లు తన వ్యవహారాలు చేసుకునే స్వేచ్ఛ ఆయనకు ఉంది,” అన్నది మరికొందరి వాదన. అయితే రామోజీ రావు గారు మాత్రం ఉత్తరంలో సదరు ఉద్యోగులు అడిగినట్లు ప్యాకీజీ ఇచ్చేందుకు మొగ్గుచూపుతున్నారని సంస్థ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా అధికారికంగా బయటకు ఏ విషయం రలేదు కానీ ఇంత జరిగాక రావు గారు మాత్రం ఉదాసీనంగా వ్యవహరించరు అన్నది వారి నమ్మకం.
కాబట్టి రామోజీ రావు గారు న్యాయం చేశారా…. అన్యాయం చేశారా అన్న విషయాన్ని పక్కనపెడితే న్యాయబద్ధంగా తన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు తగిన గుర్తింపు, భరోసా లభిస్తుందా లేదా అన్నదే ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఇక దానికి సమాధానం రామోజీరావు అతని మాటల్లో చూపిస్తాడా లేదా చేతల్లో చూపిస్తాడా అన్నది మాత్రం ఆయన ఇష్టం.