ఈ ప్రపంచంలో తోటి మనిషిని నమ్మడమే పెద్ద నేరం అయిపోయిందని అందరూ ఎప్పుడో ఒక సందర్భంలో బాధపడినవారే. ప్రాణ స్నేహితుల మధ్య సైతం చిన్న గొడవ జరిగితే ఆ స్నేహం ఎన్నేళ్లయినా ఇట్టే మట్టి కొట్టుకుపోతుంది. తర్వాత అది సద్దుమణుగుతుందా లేదా అన్న విషయం పక్కన పెడితే… స్నేహితుల మధ్య ఇటువంటి పరిస్థితులు నెలకొంటే… ఎన్నో ఏళ్ల క్రితం మరియు ఎన్నో ఏళ్లుగా మిత్రపక్షాలుగా నటిస్తూనే వెన్నుపోటు పొడిచే దేశాలతో సత్సంబంధాలు ఉంటాయి అని ఎవరైనా ఎలా అనుకుంటారు?
ఇప్పుడు మాట్లాడుతుంది చైనా గురించే. చైనాను ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ జిత్తులమారి దేశంగా అభివర్ణిస్తున్న సమయంలో భారత్ మాత్రం ఆప్యాయ ఆలింగనాలు చేసుకుంటుంది. నిజంగానే ప్రేమగా ఆదరిస్తుంది లేకపోతే ప్రతిగా నవ్వకపోతే బాగోదు అని ఫార్మలిటీ చూపిస్తుందా అన్న విషయం పక్కన పెడితే… మోడీకి మరియు జిన్ పింగ్ కి అసలు పడట్లేదు అన్నది లోపలి మాట. గతంలో ప్రధాని వాజ్ పయి కూడా పాకిస్తాన్ తో సత్సంబంధాలు కోరుకున్నాడు. లాహోర్ బస్సు యాత్ర కూడా చేశాడు. ముషారఫ్ కూడా మన మధ్య ఇక శత్రుత్వం ఏమి లేదు అన్నట్లు నటించాడు కానీ చివరికి నవ్వుతూనే కార్గిల్ వెన్నుపోటు పొడిచారు.
ఇప్పుడు చైనా వారు సరిహద్దు దగ్గర చేసిన పని కూడా ఇంచుమించు అలాగే ఉంది. దీనికి ముందు డోక్లాం గొడవల తర్వాత కూడా మోడీ…. జిన్ పింగ్ ను మహాబలిపురం పిలిచాడు. అతనికి జీవితాంతం గుర్తుండిపోయే ఆతిథ్యం ఇచ్చారు. అంతే కాదు ప్రపంచమంతా చైనా ను కరోనా విషయంలో నిందిస్తున్నా… ఒక్క మాట కూడా అనలేదు. అయితే మొన్న జరిగిన సైనికులు దాడి లో కూడా మోడీ చైనా ను వెనకేసుకుని రావడం గమనించవచ్చు. చైనా కూడా భారత్ మాకు అత్యంత మిత్ర దేశం మరియు మాకు కావల్సిన దేశం అని ముసలి కన్నీరు కార్చారు. కానీ భారత్ మంచితనాన్ని అలుసుగా తీసుకున్న చైనా ప్రభుత్వం ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర ఉన్నట్టుండి గట్టిగా పట్టుపట్టడంతో ప్రధానికి కోపం నషాలానికి ఎక్కిందట.
ఇప్పటికే 20 మంది భారత జవాన్లు ప్రాణాలను కోల్పోయి దేశంలో విపరీతమైన వ్యతిరేకత ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి దగ్గర ఉన్న ప్రాంతం దగ్గర తాము సైనికులను ఉపసంహరించుకుంటామని… కానీ చివరకు అది తమ భూభాగంలోకే వస్తుందని చైనా వారు చెబుతున్నట్లు కేంద్రంలోని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అందుకే సమాధానంగా మోదీ ఈసారి మాటలతో కాకుండా ఆ ప్రాంతంలో యుద్ధవిమానాలు తిప్పుతూ తన సమాధానం చెప్పాడట. మనం గమనించినట్లైతే గత కొద్ది రోజులుగా భారీ సంఖ్యలో సైన్యం తూర్పు లడఖ్ లో మొహరించినట్లు తెలుస్తోంది. నవ్వుతూ గొంతుకోసే దేశలాను భారత్ ఎన్నో ఏళ్లుగా చూస్తుందని సమాధానంగా మోదీ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
1974 తర్వాత చైనా–భారత సరిహద్దుల్లో ఒక బుల్లెట్ కూడా పేళలేదు. ఒక జవాను మరణించలేదు. అలాంటిది ఒకేసారి ఎంత యుద్ధవాతావరణం… అదికూడా కరోనా సంక్షోభం భారత్ లో అత్యున్నత దశ లో ఉన్న సమయంలో. ఎక్కడో తేడా కొట్టడం లేదు…? మనం ముందుగా చెప్పుకున్నట్లు స్థూలంగా దేశాల విధానాలు…. వ్యూహాలే అల్టిమేట్. ప్రత్యేకించి చైనా వంటి కయ్యాలమారి దేశాలతో అధినేతల వ్యక్తిగత దోస్తీ కుదిరే పని కాదు. కొన్ని రోజులు మాత్రమే మంచి. లేదంటే యుద్ధానికి సన్నద్ధం అవ్వాల్సిందే. ఏ చిన్న తేడా వచ్చినా సమర శంఖం పూరించవలసిందే. ఇంతకీ చైనా వారికి మన దేశ భూభాగంపై ఒక్కసారిగా అంత ఆశ, కోరిక ఎందుకు వచ్చిపడింది ? దీనిని అడ్డు పెట్టుకొని ఇంకేదైనా ప్లాన్ చేస్తోందా? దీనిపై మరో కథనంతో కచ్చితంగా చర్చ జరపాల్సిందే.