లక్ష్యం ఒకటి … చట్టం తీరు మరొకటి
ఔచిత్యం లోపించిన మోటారు వాహనాల కొత్త చట్టం
కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న మోటారు వాహనాల చట్టం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాపీడనం అనాలి. ఇంతటి కఠినమైన చట్టం తీసుకువచ్చేందుకు పాలకులు చెప్పిన లక్ష్యం – ఏటా రోడ్డు ప్రమాదాల కారణంగా చాలామంది మరణిస్తున్న నేపథ్యంలో సురక్షితమైన రోడ్డు సదుపాయం పౌరులకు అందించాలనేది. బాగుంది. రోడ్డుపై ప్రమాదాలు లెక్కకు మించి జరుగుతున్నాయి. అమాయకులు వేలాది మంది చనిపోతున్నారు. అందువల్లనే రోడ్లను ప్రమాదరహితంగా చేయాలనే విషయంలో యావత్ ప్రజానీకం సానుకూలమైన ఏకాభిప్రాయంతో అండగా నిలుస్తుంది. అందులో సందేహం లేదు. కానీ ఈ చట్టం పేరుతో నిబంధనల ఉల్లంఘన అంటూ సాధారణ ప్రజల నుంచి వేలాది రూపాయలను బలవంతంగా లాక్కోవడాన్ని ఏ విధంగానూ అటు సామాన్యులు కానీ, నిపుణులు కానీ సమర్థించలేరు. కొత్త చట్టం అమలు అయిన తరువాత వాహనదారులపై అధికారులు విధించిన దారుణమైన జరిమానాల భారం ఒక్కసారి చూద్దాం.
హర్యానాలోని గుర్గావ్ ప్రాంతంలో ఒక మోటారు సైక్లిస్టుపై ఏకంగా రూ. 23,000, ఒదిషాలోని భువనేశ్వర్ లో ఆటో డ్రైవర్కు రూ. 47,000, ఢిల్లీలో ట్రక్కు డ్రైవర్పై రూ. 2,00,500 ఆయా రాష్ట్రాల్లోని అధికారులు జరిమానాగా విధించారు. వీటిలో అన్నిటికన్నా దారుణమైనది ఆటో డ్రైవర్ ఉదంతం. సాధారణ నేరం కింద రూ. 500, చెలామణీలో లేని డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నందుకు రూ. 5000, పర్మిట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ. 10,000, డ్రంక్ అండ్ డ్రైవ్ ఆరోపణపై రూ. 10,000, వాయు, శబ్ద కాలుష్యం ఆరోపణలపై రూ. 10,000, అనధికార వ్యక్తులకు వాహనం నడిపేందుకు అనుమతించిన కారణంగా 5,000, సరైన రిజిస్ట్రేషన్, ఫిట్ నెస్ పత్రాలు లేని కారణంగా రూ. 5,000, వాహనానికి ఇన్సూరెన్స్ లేనందుకు రూ. 2,000 – మొత్తం రూ. 47,000 ఫైన్ వేశారు. వీటిలో ఏ ఒక్క ఆరోపణకీ, రోడ్డు భద్రతకు ఎలాంటి సంబంధం లేకపోవడం గమనార్హం. డ్రంక్ అండ్ డ్రైవ్ ఆరోపణ మినహా మిగిలినవన్నీ ఏ రకంగానూ రోడ్డు భద్రతకు సహకరించేవి కాకపోవడం గమనించవలసిన అతి ముఖ్యమైన అంశం. ఇంత పెద్ద మొత్తం చెల్లించడం కన్నా ఆటోను వదిలేసుకోవడమే మంచిదని ఆ ఆటో యజమాని భావిస్తున్నారు.
చాలా రాష్ట్రాలు వ్యతిరేకమే !
పెనాల్టీల భారం చూసిన చాలా రాష్ట్రాలు ఈ చట్టాన్ని యథాతథంగా అమలు చేయడానికి ఉత్సాహం చూపించడం లేదు. బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్ పెనాల్టీల మొత్తాన్ని తగ్గించాలని నిర్ణయించింది. ఇదే విధంగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు కూడా పెనాల్టీల మోత తగ్గించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక జార్ఖండ్, గోవా రాష్ట్రాలు పెనాల్టీలలో కొన్నిటిని అమలు చేయరాదని తీర్మానించాయి. కాంగ్రెస్ పాలనలోని పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ ప్రభుత్వాలు ఈ చట్టాన్ని అసలు అమలుచేయరాదని నిర్ణయించాయి. చట్టంలో కొన్ని మార్పులు అవసరమని భావిస్తున్నాయి. ఇక సరుకుల రవాణ రంగంలోని వాహనాల తరఫున 41 అసోసియేషన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టు అసోసియేషన్స్ (యుఫ్టా) సంస్థ దేశ రాజధాని ప్రాంతంలో పెద్ద ఎత్తున సమ్మెకు పిలుపు ఇచ్చింది.
మరే దేశంలోనూ లేని స్థాయిలో ఫైన్ల జోరు
మన దేశంలో సామాన్యుల ఆదాయంతో పోలిస్తే అధికారులు విధిస్తున్న జరిమానాల భారం చాలా చాలా ఎక్కువగా ఉంది. బహుశా ప్రపంచంలోని మరే దేశంలోనూ ఇంత భారీ మొత్తాలను నిబంధనల ఉల్లంఘనలకు వసూలుచేయడం లేదు. పౌరుల ఆదాయంతో పోలిస్తే మన దేశంలో ఈ వడ్డింపు మరీ ఎక్కువగా ఉంది. వివిధ దేశాల్లోని ప్రజల ఆదాయం, పెనాల్టీలతో పోలిస్తే మన దేశంలోని పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. వివిధ దేశాల డేటాను డాలర్లలో పరిశీలిద్దాం ఇప్పుడు. మన దేశంలో తలసరి ఆదాయం కేవలం 1670 డాలర్లు. అంటే రోజువారీ ఆదాయం అతితక్కువగా 4.5 డాలర్లు. డాలరుకు 70 రూపాయలనుకుంటే మన ప్రజల సగటు ఆదాయం రోజుకు గట్టిగా 315 ఉంటుంది. ఇంత ఆదాయం వస్తున్న వాళ్లు ఎంతమంది? ఈ మొత్తంలో 5000 రూపాయల పెనాల్టీ అంటే 70 డాలర్లు అంటే దాదాపు 25 రోజుల ఆదాయం. ఇది ఎలా సమంజసం అనుకోవాలి. సింగపూర్ లో తలసరి ఆదాయం ఏడాదికి 93,900 డాలర్లు. అంటే రోజుకు 257 డాలర్లు. కానీ అక్కడ ఓవర్ స్పీడింగ్ కు విధించే పెనాల్టీ 130 డాలర్లు. అర రోజు ఆదాయంతో సమానం. యూఏఈలో తలసరి 67,700 డాలర్లు కాగా రోజుకు 185 డాలర్లు. పెనాల్టీ మొత్తం 408 డాలర్లు. అంటే రెండున్నర రోజుల ఆదాయంతో సమానం. అమెరికాలో కూడా దాదాపుగా ఇదే విధంగా అయిదు రోజుల ఆదాయంతో సమానంగా ఈ జరిమానా ఉంది. ఇక మరో విషయం ఏమిటంటే అనుమతించిన వేగాన్ని మించి ఎంత వేగంగా వెళ్లారన్న దానిని బట్టి జరిమానా పెరుగుతూ పోయే విధానం ఇతర దేశాల్లో ఉంది. కానీ మన దేశంలో అలాంటి విధానం ఏమీ లేదు.
గడ్కరీ సమర్థింపు మరీ దారుణం!
కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విచక్షణ లేని పెనాల్టీలను సమర్థించిన తీరు మరీ దారుణంగా ఉంది. ప్రజలు కానీ, స్థానిక ప్రభుత్వాలు కానీ ఈ భారీ పెనాల్టీ వడ్డింపులను వ్యతిరేకిస్తున్నాయో తనకు అర్థం కావడం లేదన్నారు. అంతవరకు బాగుంది. రోడ్డు ప్రమాదాలను కట్టడి చేయడానికి ఆ రకంగా అమాయక ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించిన చట్టంలో కఠినంగా పెనాల్టీలు విధంచడం అవసరమని ప్రభుత్వం భావిస్తోందని ఆయన చెప్పారు. అక్కడితో ఆగకుండా మరింత హేయమైన నేరాల స్వభావంతో రోడ్డు నిబంధనల ఉల్లంఘనను సమానంగా ఆయన చేసిన పోలికే ఎక్కువ బాధాకరం. గత గురువారం న్యూఢిల్లీలో రోడ్డు భద్రతపై నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల నేరాలతో రోడ్డు నిబంధనల ఉల్లంఘనను పోల్చి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ప్రజల్లో చట్ట నిబంధనల పట్ల గౌరవం లేకుండా పోయింది. దాదాపు 30 సంవత్సరాల పాటు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనకు కేవలం రూ. 100 పెనాల్టీ చెల్లిస్తూ వచ్చాం. అప్పటితే పోలిస్తే ఆ వంద రూపాయల విలువ ఇప్పుడు ఏ స్థాయికి చేరిందీ గమనించాలని సూచించారు. మైనర్లపై లైంగిక దాడి నేరానికి ఇప్పుడు ఏకంగా మరణశిక్ష విధించేందుకు వీలుగా చట్టంలో మార్పు చేశాం. అటువంటి ఘోరాలు జరగరాదన్నదే ప్రభుత్వ ఆశయం. అందుకే అంత కఠినమైన శిక్ష ప్రతిపాదించాల్సి వచ్చింది. ఇక్కడా అంతే. రోడ్డుపై నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇతరుల ప్రాణాలకు ప్రమాదకరంగా తయారైన డ్రైవర్లను కట్టడి చేసేందుకే ఈ విధంగా భారీ మొత్తాలను పెనాల్టీలుగా ప్రకటించాం. తప్పదు కదా ! అంటున్నారు ఆయన. ఇక్కడ ఆయన గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోజుకీ మనదేశంలో వంద రూపాయలు కూడా రోజూ చేతికి ఆదాయం అందని అభాగ్య జీవితాలు అనేకం ఉన్నాయి. ఆయన ఒక పెద్ద పారిశ్రామిక వేత్త. అంతకుమించి పెద్ద భూకామందు. ఆయన లోకం ఎంతైనా వేరే కదా ?
అసలు ప్రశ్న అలాగే ఉంది
అది రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు వాహనాన్ని వేగంగా, దూకుడుగా నడుపుతున్న వారి తీరు. ప్రమాదకరమైన డ్రైవింగ్ అంటే రెడ్ లైట్ పట్టించుకోకపోవడం, ఆగాలన్న సూచన ఖాతరు చేయకపోవడం, ఫోన్లలో మాట్లాడుతూ నడపడం, ఇతర వాహనాలను ప్రమాదకరంగా దాటే ప్రయత్నం చేయడం, అనుమతి లేని మార్గాల్లో నడపడం అని మన చట్టం సూచిస్తోంది. కానీ చాలా దేశాల్లో రెడ్ లైట్ నిర్లక్ష్యం నేరంగా పరిగణించడం లేదని ఇనిస్టిట్యూట్ ఆఫ్ రోడ్డు ట్రాఫిక్ ఎడ్యుకేషన్ గుర్తుచేసింది. వేగనియంత్రణ విషయంలో కానీ, రోడ్ల పరిస్థితి మెరగుపరచడంలో కానీ, ఏ మాత్రం శ్రద్ధ తీసుకోకపోవడం గమనార్హం. అందువల్ల చట్టంలోని నిబంధనల విషయంలో పునరాలోచన అవసరమని ఈ సంస్థ సూచించింది.
గౌరవ్ వివేక్ భట్నాగర్
‘ద వైర్’ వెబ్సైట్లో వచ్చిన వ్యాసానికి ఇది స్వేచ్ఛానువాదం