(న్యూస్ ఆర్బిట్ వీక్ స్పెషల్ బిగ్ స్టోరీ)
వైసీపీ అంటే జగన్. జగన్ అంటే వైసీపీ. నిజమే…! కానీ జగన్ తర్వాత ఎవరు? ఆ పార్టీలో జగన్ తర్వాత ప్రాధాన్యత ఎవరిది…? ఇది సమాధానం లేని ప్రశ్న. ఇప్పుడు సమాధానం వెతకాల్సిన ప్రశ్న కూడా ఇదే…! పార్టీ అధిక్కారంలో లేకుండా పార్టీగానే ఉంటె ఇబ్బంది ఉండదు, నంబర్ టూ అవసరమే ఉండదు. కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్షుడు ముఖ్య మంత్రి కుర్చీ ఎక్కిన తర్వాత పార్టీ వ్యవహారాలు చేసుకోవాల్సింది నంబర్ టూ నే. అందుకే ఇప్పుడు ఈ ప్రశ్న తలెత్తుతుంది. . ఇప్పుడే ఎందుకంటే …?? పార్టీకి – ప్రభుత్వానికి కచ్చితంగా సయోధ్య ఉండాలి. నామినేటెడ్ పదవులు ఇవ్వాలి, పార్టీ కీలక నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పటికే అధికారం వచ్చి ఏడాది గడిచి, నేతల కొంత సొంత ఆకలి తీర్చాలి. ఇంతకూ ఆ పార్టీలో నంబర్ టూ ఎవరు…? విజయసాయిరెడ్డి నా…? సజ్జల రామకృష్ణారెడ్డి నా…? వైవీ సుబ్బారెడ్డి నా…?? షర్మిలా నా…? ఎవరిది ఆ స్థాయి, ఎవరికీ ఆ అవకాశం అనేది చూద్దాం.
జగన్ నీడ విజయసాయిరెడ్డి…!
ముందుగా గుర్తొచ్చే పేరు విజయసాయిరెడ్డి. జగన్ కంపెనీలు పెట్టినప్పటి నుండి ఆయనతో చనువు ఏర్పడింది. పార్టీ పెట్టడం, కలిసి జైలుకి వెళ్లడం, జైలులోనే పార్టీ బలోపేతానికి వ్యూహాలు వేయడం, పలువురు నేతలతో మాట్లాడడం… ఇలా మొదటి నుండి జగన్ కి నీడగా ఉన్నదీ విజయసాయిరెడ్డి. 2014 లో పార్టీ ఓటమి తర్వాత మరింత కీలకంగా మారారు. 2019 లో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతూ వచ్చారు. తెరవెనుకా, ముందు… సోషల్ మీడియా ద్వారా, నేరుగా పార్టీలో చురుకైన పాత్ర పోషించారు. మొత్తానికి పార్టీ ఏర్పాటు నుండి ఆయన జగన్ వెన్నంటే ఉన్నారు. రాజకీయంగా జగన్ ప్రతి అడుగులోనూ తోడున్నారు. కార్యకర్తలకు, పార్టీ నాయకులకు ఆయన అంటే ప్రత్యేక అభిమానమే.
* అయితే నాణేనికి రెండో వైపు కూడా చెప్పుకోవాలి. జగన్ అవినీతి కేసులకు ఈయనే మూల కారకుడు అనే మచ్చ ఉంది. విశాఖలో అవినీతి చేస్తున్నారు, అనే అపవాదు, ప్రచారం ఉంది. బీజేపీతో సయోధ్యగా ఉంటూ జగన్ కి దూరమవుతున్నారని ఈ మధ్య అపవాదు మూటగట్టుకున్నారు.
సజ్జల సంక్లిష్ట వ్యక్తిత్వం…!
ఇక నంబర్ టూ అనగానే గుర్తొచ్చే మరో వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. మొదటి నుండి పార్టీలో ఉన్నారు. పార్టీ, సాక్షి పత్రిక వ్యవహారాల్లో తెర వెనుక కీలకంగా పని చేసారు. మంచి నేర్పరి అనే పేరుంది. జగన్ కి అత్యంత నమ్మకస్తులు. జగన్ జైలులో ఉన్నప్పుడు పార్టీకి వెన్నుదన్నుగా వ్యూహకర్తగా ఉంటూ, పత్రికని నడిపించారు. పత్రిక పార్టీని అనుసంధానం చేస్తూ జగన్ కి మేలు చేసే ప్రయత్నం చేసారు. అవినీతి మరకలు ఏమి లేవు. వివాద రహితుడు. పార్టీలో అన్ని వర్గాలకు చేరువగా ఉంటారన్న పేరుంది. అందుకే ఈయనను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా జగన్ ప్రకటిస్తారని ఈ మధ్య చర్చ జరిగింది.
* ఇక నాణేనికి రెండో వైపున చూస్తే ఈయన వ్యాఖ్యలు కార్యకర్తలకు నచ్చవు. సొంత పార్టీ లోనే ఈయన వ్యవహారశైలి నచ్చక బహిరంగంగానే విమర్శలు ఎదురవుతుంటాయి. సోషల్ మీడియాలో కార్యకర్తల చర్యలను బహిరంగంగానే విమర్శించి, కొంత క్యాడర్ కి దూరమయ్యారు. రాజకీయంగా నిర్ణయాలు తీసుకోవడంలో అంత చురుకు లేదు అనే టాక్ ఉంది.
వైవీ సుబ్బారెడ్డి… నిలకడ లేదు…!
ఇక పార్టీలో రెండు స్థానానికి మనం చెప్పుకోవాల్సిన మూడో వ్యక్తి వైవీ సుబ్బారెడ్డి…! జగన్ కు స్వయానా బాబాయి, వైఎస్ కి స్వయానా తోడల్లుడు. వివిధ రహితుడు, మంచి రాజకీయ అనుభవం ఉంది. వైఎస్ ఉన్నప్పటి నుండి కుటుంబానికి, పార్టీకి దగ్గరగా ఉండేవారు. జగన్ జైలులో ఉన్నప్పుడు పార్టీ నిర్ణయాలను సమర్ధంగా అమలు చేయడంలో వైవి పాత్ర కీలకం. కొన్ని కీలక విషయాలను చాకచక్యంగా డీల్ చేశారు. అన్నిటికీ మించి వివాదాలకు దూరంగా ఉంటారు అనే పేరు మొన్నటి వరకు ఉండేది.
* ఇక నాణేనికి రెండో వైపు చెప్పుకోడానికి వైవి విషయంలో చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది నిలకడ లేమి. పార్టీకి తోడుగా , జగన్ కి తోడుగా ఉంటా అంటూనే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా అంటారు. 2014 లో ఒంగోలు ఎంపీగా చేసారు, గెలిచారు. 2019 లో పోటీ చేయను, తెర వెనుక పని చేస్తాను అని మూడేళ్ళ కిందటే జగన్ కి మాటిచ్చారు. కానీ ఎన్నికల సమయానికి పోటీ చేస్తాను అంటూ కొన్నాళ్ళు మొండి చేసారు, అలిగారు. ఇక టిటిడి చైర్మన్ గా కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ పార్టీలోనూ, బయట మచ్చలు తెచ్చుకుంటున్నారు. మొన్నటి వరకు వివాద రహితుడు అని ఉన్న పేరు ఇప్పుడు చెరిగే ప్రమాదం వచ్చి పడింది.
ముగ్గురి మధ్య దాగుడు మూతలాట…!
పార్టీలో మొగ్గురు కీలకమే. కానీ ముగ్గురికి మధ్య తెలియని గ్యాప్ ఉంది. బయటకు కనిపించని పిల్లి పోరు ఉంది. ఒకరంటే ఒకరికి అహం అడ్డొచ్చె పరిస్థితి ఉంది. దానికి కారణం రెండో స్థానం కోసం పోటీ పడుతుండడమే. 2012 లో పార్టీ ఏర్పాటు తర్వాత హైదరాబాద్ లో పార్టీ కార్యాలయం ఏర్పాటయింది. అక్కడ సజ్జల, విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. వారు, వారి వర్గీయులు తరచూ ప్రెస్ మీట్లు నిర్వహించేవారు. ఇక తాను వెనుకబడుతున్నాను అని గ్రహించిన వైవి సుబ్బారెడ్డి 2015 లో తాడేపల్లిలో పార్టీ కార్యాలయం ఏర్పాటుకి సొంత డబ్బు పెట్టారు. హైదరాబాద్ నుండి మీరు నడిపించండి, ఇక్కడి నుండి నేను, నా వర్గం నడిపిస్తాము అనేలా కొంత కుంపటి రాజేశారు. అలా ముగ్గురి మధ్య తెలియని స్వల్ప వివాదాలు ఉన్నాయి. కానీ విజయసాయిరెడ్డి కి జగన్ తో ఉన్న ప్రత్యేక అనుబంధం కారణంగా సజ్జల, వైవి కాస్త వెనుకబడ్డారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు విజయసాయిరెడ్డికి కొన్ని శల్య పరీక్షలు ఎదురవుతుండడంతో ఈ ఇద్దరూ తెరపైకి వచ్చేసారు. ఇక మరో నాయకురాలు షర్మిలా కి రెండో స్థానం అప్పగించే యోచనకు జగన్ దూరంగానే ఉన్నారని సమాచారం. సొంత కుటుంబానికి కాకుండా బయటి వారికే ఇవ్వాలనేది ఆయన అభిమతంగా తెలుస్తుంది. ఏదైనా, ఎవరైనా ఇప్పుడు పార్టీలో రెండో స్థానం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వాన్ని జగన్ చూసుకుంటే…, పార్టీకి – ప్రభుత్వానికి మధ్య సయోధ్యకు ఈ రెండో స్థానం వ్యక్తి చూసుకోవాల్సి ఉంది.