ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల విషయం ఒక కొలిక్కి వచ్చింది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేస్తున్న పోరాటం చివరికి విజయవంతం అయింది. సుప్రీంకోర్టు ఈరోజు ఏపీ ప్రభుత్వం పిటిషన్ ను కొట్టివేసింది. ఎట్టి పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని…. ప్రభుత్వం ఎన్నికల కమిషన్ తో సహకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఎస్ఈసీ కి లేఖ…!
అయితే ఈ అంశంపై సుప్రీం తీర్పు వెలువడటానికి ముందు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చాలా ఘాటుగా స్పందించారు. ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరును తప్పుబడుతూ ఆయన రాసిన ఒక సంచలన లేఖ హాట్ టాపిక్ అయింది. ఎన్నికల కమిషన్ కు హితవు పలుకుతూ ఆయన ఒక ఉత్తరం రాశారు. ఒకవైపు రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంటే…. మరొకపక్క జోరుగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతున్న సమయంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏమిటి అని నిమ్మగడ్డ వైఖరిపై వైసీపీ నేత తీవ్ర విమర్శలు చేశారు.
పంతాలకి పోరాదు….
ఇక నిమ్మగడ్డ ని ఉద్దేశిస్తూ ప్రభుత్వ ఉద్యోగం లో ఉండి ఇలా రాజకీయాలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. ఇక ఇలాంటి ఒక పరిస్థితి కేవలం భారతదేశంలో చూస్తున్నామని విమర్శించిన ముద్రగడ మీకు వీలైతే ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేయండి…. ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వండి కానీ ఇలా పంతానికి పోయి పోరాటలు నడుపవద్దు అని అన్నారు. అంతేకాకుండా ముద్రగడ మరింత తీవ్రమైన వ్యాఖ్యలను ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఆ అదృశ్యశక్తి వల్లే ఇదంతా..!
నిమ్మగడ్డ చేస్తున్న పనులు… ఆయన తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తుంటే అతని వెనుక ఒక అదృశ్యశక్తి నడిపిస్తోందని అనుమానం కలుగుతోందని ముద్రగడ సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ ప్రభుత్వం పై నిమ్మగడ్డ చేస్తున్న దాడి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది అని…. రాజకీయ నాయకుల లాగా పంతాలకి పోయి పంచాయతీ ఎన్నికలను నిర్వహించి తీరుతామని ఒక ప్రభుత్వ ఉద్యోగి అనరాదని ఆయన హితవు పలికారు. ఇప్పటికైనా ఎన్నికల ఆలోచన చేయడం మానేసి ప్రభుత్వానికి సహకరిస్తూ కొనసాగాలని ఆయన విజ్ఞప్తి చేశారు