ఇది ఎన్టీవీ, టీవీ5 ఇద్దరి మధ్య తగువు కాదు… ఇది వ్యవస్థల బలహీనతల మధ్య సాగిన ఆర్థిక వ్యభిచారం.
ఎవరు ఏమైనా చేయోచ్చంటూ సాగించిన దుర్మార్గపు దందా… మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్ అంటారు. కానీ వీరికి మీడియా అంటే కాసుల పంట. వ్యాపారాల బొంత. కోట్ల రూపాయల కనకవర్షం కురిపించి ఒక యాపారం. అవును ఎన్టీవీ, టీవీ5 చానాళ్లలో రెండు చానళ్ల ఓనర్లకు సంబంధించిన రెండు ప్రొమోలు ఇప్పుడు ఓ హాట్ టాపిక్… రెండు చానళ్లలో ప్రసారమైన ప్రొమోలు సినిమా ప్రమోషన్ కు మించి ఉన్నాయ్. ఒకరిపై ఒకరికి ఇంత గ్రడ్జ్ ఉందా అన్న చందంగా ప్రొమోలు రెండు చానళ్లలో టెలీకాస్ట్ అయ్యాయ్.
ముందుగా టీవీ 5 అగ్గి రాజేస్తే… ఎన్టీవీ ఊరుకుంటుందా… ఇంకొంచెం మసాలా దట్టించి మరీ ప్రొమో టెలీకాస్ట్ చేసింది. రెండు చానళ్లు 2007లో కొద్ది రోజులు అటూ ఇటూగా ప్రారంభించారు. ఆరంభం నుంచి రెండు చానెళ్ల మధ్య పరోక్ష యుద్ధం సాగింది.
తొలి రోజుల్లో టీవీ5 పైచేయిగా నిలిచినా తర్వాత రోజుల్లో మార్కెట్లో ఎన్టీవీ ప్రూవ్ చేసుకొంది. రాజకీయ వార్తలకు ప్రాధాన్యత ఇవ్వడం, చేతిలో భక్తి చానెల్ కూడా ఉండటంతో మార్కెట్లో లీడర్ గా ఎన్టీవీ ఎదిగింది. చరిత్ర పక్కనబెడితే… ఇప్పుడు టీవీ5 కొన్ని ప్రశ్నలు సంధించింది… అవేంటంటే… ఎన్టీవీ ఛైర్మన్ నరేంద్ర చౌదరి అక్రమాల గురించి… అది జూబ్లీహిల్స్ హైసింగ్ సొసైటీ ఛైర్మన్ గా 16 ఏళ్లుగా ఆయన అది చేశాడు.. ఇది చేశాడంటూ ఓ రేంజ్ లో ప్రొమో టెలికాస్ట్ చేసేసింది. అక్రమాలు ఎలా జరుగుతున్నాయో వివరంగా టీవీ 5 చెబితే… జనం సొమ్మును టీవీ 5 ఉత్పత్తులతో ఎలా కొల్లగొట్టిందో ఎన్టీవీ చెప్పింది. ఇద్దరూ తన్నుకుంటున్నారని జనం సంబరపడిపోవాలో… మరి ఇద్దరి మధ్య రేగిన మంటలు వెనుక ఉన్న అంశాల గురించి మాట్లాడుకోవాలో మరి.
ఏపీలో ఇప్పుడు కుల పంచాయితీలు ఓ రేంజ్ లో సాగుతున్నాయ్. కులం చుట్టూ రాజకీయాలు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. గతంలో ఈనాడు, సాక్షి మధ్య డైరెక్ట్ వార్ చూశాం. తాజాగా ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ మధ్య సాగుతున్న యుద్ధాన్ని చూస్తున్నాం. తొలిసారిగా రెండు టీవీ చానళ్ల మధ్య సాగుతున్న మరో వింత రోతను ఇప్పుడు చూస్తున్నాం. వాస్తవానికి ఎన్టీవీ మిగతా మీడియా గ్రూపులపై వార్తలను పెద్దగా ఎప్పుడూ ఇవ్వలేదు. అలాగని టీవీ 5 కూడా గుట్టుగా తన పని తాను చేసుకుపోతుంది. ఎందుకంటే గతంలో చాలానే చమురు వదిలించుకుంది. టీవీ 5 తయారు చేసే ఉత్పత్తుల గురించి ఒక టీవీ చానెల్, పత్రిక భారీగా కథనాలిచ్చి.. అర్ధాంతరంగా ఆపేసింది కూడా. అదే సమయంలో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అక్రమాలంటూ మరికొన్ని మీడియా సంస్థలు వార్తలిచ్చినా అవి మధ్యలోనే ఆగిపోయేవి. అయితే ఇప్పుడు ప్రొమోలతో మొదలైన యుద్ధం కథనాల వరకు వెళ్తుందా… లేక రాజీపడుతుందో చూడాలి… ఇద్దరు లేవనెత్తిన అంశాలేంటి… వాటి కథాకమామీషుపై ప్రభుత్వాలు ఎందుకు స్పందించవ్.. వ్యవస్థలు ఎందుకు ప్రశ్నించడం రేదన్నది తర్వాత కథనంలో చూద్దాం…