అటు దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ…. ఇటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుని చతికలపడిపోయిన కాంగ్రెస్ పార్టీలోని అధ్యక్ష పదవి కోసం ఎంతో మంది నేతలు ఆశగా ఉన్నారు. అయితే చివరికి కేవలం ఇద్దరిని హైకమాండ్ షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో ఎవరి అవకాశాలు ఎంత అన్నది ఒక సారి పరిశీలిస్తే…
ఎంపీలు ఇద్దరికీ ఛాన్స్…
ఎల్లుండి కొత్త పీసీసీ చీఫ్ ను ప్రకటించే దిశగా ప్రక్రియ జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇక దీని కోసం తెలంగాణ కాంగ్రెస్ లోని కీలక నేతలు ఢిల్లీ పయనం అయ్యారు. అభిప్రాయ సేకరణ ప్రక్రియ కూడా పూర్తి అయింది. చివరికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రేసులో ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి మిగిలినట్లు తెలుస్తోంది. ఈ నెల 23న లేదా 26వ తేదీన పిసిసి కొత్త అధ్యక్షుడు పై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. సొంత పార్టీలోని వర్గాలను ఇటు రాష్ట్రంలోని ప్రజలను కలుపుకొని వెళ్లే సరైన వ్యక్తి కోసం కాంగ్రెస్ ఎదురుచూస్తోంది.
వారే రేవంత్ కి అడ్డు…?
రేస్ లో నిలిచిన ఇద్దరి నేతల్లో రేవంత్ రెడ్డి విషయానికి వస్తే అతను తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్. కేసీఆర్ కుటుంబం అంటేనే ఒంటికాలిపై లేస్తాడు. అంతే కాకుండా అతను కంటూ సపరేట్ మాస్ ఫాలోయింగ్ ఉంది. అయితే అతనికి అధ్యక్షపదవిని కట్టబెడితే పార్టీ రెండుగా చీలి పోతుంది అన్న భావన కూడా సొంత పార్టీ నేతల్లోనే ఉంది. ఇక ఇతనికి అధ్యక్ష పదవి ఇస్తే సొంత పార్టీ నేతలే కొంతమంది సీనియర్లు అలక పూనుతారు. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంటుంది.
కోమటి కన్ఫర్మ్ అయినట్లేనా?
మరొక పక్క చూస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి హస్తిన బాట పట్టారు. పిసిసి ఫైనల్ అయిందని వార్తలు వస్తుండడంతో ఈ లోపలే ఆయన ఢిల్లీ వెళ్లడం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉత్తంకుమార్ రెడ్డి సపోర్ట్ కోమటి రెడ్డి వెంకటరెడ్డి కే ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో తనవంతుగా కోమటిరెడ్డి ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. మాజీ అధ్యక్షుడి సపోర్టు… అలాగే చాలామంది పార్టీలోని కీలక నేతలు కోమటి వైపు మొగ్గు చూపడం అతనికి సానుకూల అంశాలుగా చెప్పవచ్చు.
మరి హై కమాండ్ నిర్ణయం?
మొత్తానికి కి పార్టీని బలోపేతం చేసేందుకు ఢిల్లీ లెవెల్లో తీవ్ర కసరత్తులు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి అయితే అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అని పూర్తి స్థాయి అంచనా లేదు. అయితే కోమటిరెడ్డి ఢిల్లీ ప్రయాణాలు మాత్రం ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. చాలామంది కోమటిరెడ్డి ఫైనల్ అవుతాడు అని అంటుంటే అభిప్రాయ సేకరణలో మాత్రం 162 మందిలో ఎక్కువశాతం రేవంత్ రెడ్డి కావాలని కోరినట్లు సమాచారం. ఇక ఈ సస్పెన్స్ వీడాలంటే .. అతి కొద్ది రోజులు ఆగితే సరిపోతుంది.