దక్షిణాదిన ఎప్పటికైనా బిజెపి పాగా వేయగలిగేది తెలంగాణలోనే
దక్షిణ భారతదేశంలో పాగా వెయ్యటంలో బిజెపి విఫలమయ్యింది. ఇప్పటికీ దక్షిణ భారతం బిజెపికి అందని ద్రాక్షే. దక్షిణం మిగతా వారికన్నా భిన్నంగా ఎందుకు ఓటు వేసింది? అలాగే ఇంకెంత కాలం ఇలా విభిన్నంగా ఉండగలుగుతుంది? అనే ప్రశ్నలు మనం వేసుకోవాలి.
స్పష్టమైన రాజకీయ, సైద్ధాంతిక కారణాలతో తమిళనాడు, కేరళ బిజెపికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. తమిళనాడుకి బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమ చరిత్ర ఉంది. ఆ ఉద్యమం ఫలితంగా శూద్రుల ప్రతినిధులు అయిన ద్రవిడవాదపు పార్టీలు వచ్చి బ్రిటిష్ హయాంలో వెనుకబడిన తరగతులకి నిశ్చయార్ధక కార్యాచరణ అమలు చేశాయి. రిజర్వేషన్లు యాభై శాతం దాటకూడదు అన్న సుప్రీం కోర్టు నియమానికి ఒకే ఒక్క మినహాయింపు తమిళనాడు రాష్ట్రం.
పెరియార్ ని హిందూ వ్యతిరేకిగా ముద్ర వేసి నిందలు మోపటానికి బిజెపి చేసిన ప్రయత్నం, ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన ప్రజల్లో ఆగ్రహానికి కారణం అయింది. బిజెపి కి దగ్గరగా ఉండే రజినీకాంత్లాంటి వారు కూడా వ్యతిరేకించారు. బెంగాల్లో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేసినప్పుడు ఆ చర్యకి హిందూ వ్యతిరేకతని ఆపాదించి హిందూ అస్థిత్వాన్ని మరింత సంఘటితం చేశారు. అయితే అదే వ్యూహం తమిళనాడులో విఫలం అయ్యింది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జే.జయలలిత మరణాంతరం తమిళనాడు రాజకీయాలలో ఏర్పడిన శూన్యాన్ని పూరించే ప్రయత్నంలో బిజెపి ఏర్పరుచుకున్న రాజకీయ కూటమి కూడా బిజెపి వైఫల్యానికి కారణం అయ్యింది. అంతేకాక డిఎంకె అధినేత ఎం.కె.స్టాలిన్ బిజెపిని దక్షిణాది వ్యతిరేకిగా, హిందీ అనుకూల పార్టీగా అభివర్ణించి సైద్ధాంతికంగా అడ్డుకున్నారు. రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేసినప్పుడు కేంద్రం ఇవ్వవలసిన నిధులని ఇవ్వకుండా మోదీ తొక్కిపెట్టారని బహిరంగంగా విమర్శించారు. ఒక విధంగా చెప్పుకోవాలంటే దేశంలో మిగతా చోట్ల ప్రతిపక్షానికి ఏ విధంగా అయితే ఒక రాజకీయ కథనం అంటూ లేకుండా పోయిందో తమిళనాడులో బిజెపికి అలాగే ఒక కథనం అంటూ లేకుండా పోయింది.
తమిళనాడులో కాలు పెట్టేందుకు బిజెపి చేసిన ప్రయత్నాలను స్టాలిన్ అడ్డుకోగలిగారు
పినరాయి విజయన్ నేతృత్వంలో కేరళ కూడా గట్టిగా ప్రతిఘటించింది. శబరిమల గుడిలోకి మహిళల ప్రవేశం విషయాన్ని అడ్డుపెట్టుకుని బిజెపి-ఆర్ఎస్ఎస్ అక్కడ ప్రజలని సంఘటితపరిచే ప్రయత్నం చేసింది. దానికి మొదట్లో మద్దతు లభించిన మాట వాస్తవం. దానిని వ్యతిరేకించడం రాజ్యాంగాన్ని అమలు చేసే కార్యక్రమమే అయినా కూడా బిజెపి-ఆర్ఎస్ఎస్ ప్రయత్నాలకి వ్యతిరేకంగా జరిగిన సమీకరణ ఫలితాన్ని ఇచ్చింది.
గతంలో గోల్వాల్కర్ నాయకత్వంలో ఆర్ఎస్ఎస్ కేరళలోకి ప్రవేశించింది. నేడు చాలా ప్రభావవంతంగా చాలా పెద్ద సంఖ్యలో శాఖలని నడుపుతున్నది. కాసరగోడ్, మల్లాపురం ఐఎస్ఐఎస్ కార్యకలాపాలకి కేంద్ర స్థానాలుగా గుర్తించబడ్డాయి. అలాగే అక్కడ నుండి కొంతమంది ఐఎస్ఐఎస్లో చేరటంతో అంతర్జాతీయ ఉగ్రవాద పటంలో ఈ రెండు ప్రదేశాలు నమోదయ్యాయి. దేశమంతా ప్రచారమైన హదియా కేసు ద్వారా ఆర్ఎస్ఎస్ తనకి ఎంతో ఇష్టమైన మతమార్పిడి అంశంపై వివాదం సృష్టించే ప్రయత్నం చేసింది. ఇన్ని ప్రయత్నాల తర్వాత, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అనే ఒక కథనాన్ని వండి వార్చిన తరువాత కూడా బిజేపి అక్కడ పాగా వెయ్యలేకపోయింది.
కమ్యూనిస్ట్ పార్టీ పాత్రతో పాటు, భిన్న మతస్థులు పక్క పక్కనే ఉండే కేరళ సామాజిక వాస్తవికత కూడా బిజెపి పరాజయానికి దోహదం చేసింది. వలస పాలన మొదట్లో నారాయణ గురు చేపట్టిన సామాజిక సంస్కరణ ఉద్యమ ఫలితం ఇది. అక్షరాస్యతలో కేరళ ముందంజలో ఉంది. అలాగే ప్రభావవంతమైన ప్రభుత్వ విద్యా వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ, కుండుంబశ్రీ మహిళల పేదరిక నిర్మూలన పధకం లాంటి పధకాలతో ఒక బలమైన సంక్షేమ వ్యవస్థని ఏర్పాటు చేసింది.
కేరళలో గణనీయమైన సంఖ్యలో క్రైస్తవులు, ముస్లింలతో కూడిన మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలు ఉన్నాయి . అందువలన ప్రజా బాహుళ్యంలో నుండి, వారి జ్ఞాపకాలలోనుండి వీరిని తొలగించి వెలివాడకి పరిమితం చేసే ప్రయత్నాలు సఫలమవ్వటం కష్టం. వీరి గురించిన పుకార్లు, నకిలీ వార్తలు ప్రచారం చెయ్యటం ఇంకా కష్టసాధ్యమైన పని.
లింగాయత్లకి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు మత పరంగా స్పర్ధలు సృష్టించే కార్యక్రమాన్ని అమలు చెయ్యటంతో కర్ణాటకలో బిజెపి పాగా వెయ్యగలిగింది. లింగాయతులని ప్రత్యేక మతంగా గుర్తించడం ద్వారా బిజెపి ప్రయత్నాలని కాంగ్రెస్ ఎదుర్కోగలిగింది. రాజకీయ పరిస్థితుల గురించి సూక్ష్మ స్థాయి అవగాహన కలిగిన, సామ్యవాద భావాలు ఉన్న లోహియవాది, ఓబిసి కులానికి చెందిన సిద్ధరామయ్యని తమ నాయకుడిగా కాంగ్రెస్ ప్రకటించింది. బిజెపిని ఎదుర్కోవాలంటే ఒక స్వతంత్ర, బలమైన స్థానిక నాయకత్వం కాంగ్రెస్కి అత్యవసరం.
అలాగే, ఆంధ్ర ప్రదేశ్ లో బిజెపి ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. ప్రత్యేక హోదా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడుని పక్కకి తొలగించి, ఆ స్థానాన్ని తాము ఆక్రమిద్దామన్న వ్యూహం పనిచెయ్యలేదు. తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయినప్పటికీ అభివృద్ధి, కావాల్సిన వనరులు రాబట్టడం ప్రధాన ఎజెండాగా మారడంతో అతిశయోక్తులతో కూడుకున్న బిజెపి జాతీయవాద ప్రచారానికి ఇక్కడ చోటు లభించలేదు.
ఆంధ్రప్రదేశ్లో బిజెపి వ్యాప్తికి అనుకూలించే సామాజిక పరిస్థితులు లేవు
అంతేకాక ఆంధ్ర ప్రదేశ్లో ముస్లింల జనాభా తొమ్మిది శాతం కన్నా తక్కువే. కేవలం కొన్ని జిల్లాలకే పరిమితం కాకుండా వాళ్ళు అన్ని జిల్లాలలో ఉన్నారు. తెలుగు సమాజంలో బాగా ఇమిడిపోయి అనర్గళమైన తెలుగు మాట్లాడతారు. ముస్లింలని లక్ష్యంగా ఎంచుకుని హిందువులు ప్రమాదంలో ఉన్నారు అనే తరహా దుష్ప్రచారం చెయ్యటానికి బిజెపి వారికింకా సందు దొరకలేదు.
దక్షిణాదిన బిజెపికి మంచి భవిష్యత్తు ఉంది తెలంగాణాలో. మొన్న జరిగిన ఎన్నికల్లో నాలుగు స్థానాలలో బిజెపి విజయం సొంతం చేసుకుంది, అలాగే తమ ఓట్ల శాతాన్ని కూడా బాగా పెంచుకుంది. బిజెపి-ఆర్ఎస్ఎస్ ద్వయం మతవిద్వెషాలని రెచ్చకొట్టడానికి అనువైన సామాజిక పరిస్థితులు తెలంగాణాలో ఉన్నాయి. నిజామాబాద్ లాంటి జిల్లాలలో కేంద్రీకృతమైన ముస్లింలు తెలంగాణా జనాభాలో పదిహేను శాతం ఉన్నారు. నిజామాబాద్ నుండే తెలంగాణా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు కూతురు కె.కవితని బిజెపి అభ్యర్ధి ఓడించారు. ముస్లింల ప్రతినిధిగా అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలో ఒక ముస్లిం పార్టీ ఉంది. అతని తమ్ముడు అక్బరుద్దీన్ ఒవైసీ హిందూ దేవుళ్ళ మీద, దేవతల మీద తీవ్రమైన భాషలో వ్యాఖ్యలు చేశాడు.
సామాజికంగా చూసుకుంటే తెలంగాణాలో ముస్లింలు తెలుగు సమాజంతో ఇమడలేదు. ఈ ముస్లింలలో మధ్యతరగతి వారు చాలా తక్కువ. ఉర్దూ స్థానంలో తెలుగుని అధికార భాషగా ప్రకటించాక ఆ కొద్ది మంది కూడా లేకుండా పోయారు. ముస్లింలు తెలుగులో అందరూ చదివే చదువుని కాదని ఉర్దూలో మదరసా విద్యని ఎంచుకున్నారు.
తెలంగాణా రాష్ట్రానికి మత విద్వేషకాండ చరిత్ర కూడా ఉంది. తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం సమయంలో రెడ్డి భూస్వాముల మద్దతుతో నిజాం ప్రభువుల ప్రైవేటు సైన్యం అయిన రజాకార్లు సాగించిన దమనకాండ ఇప్పటికీ ప్రజాబాహుళ్య జ్ఞాపకాలలో పదిలంగానే ఉంది. రజాకార్లు సాగించిన దమకాండ రెడ్డి భూస్వాముల, నిజాం ప్రభువుల అధికారాలని రక్షించటానికి జరిగినదే. అయితే ప్రజాబాహుళ్య జ్ఞాపకాలలో అది హిందూ మహిళల మీద ముస్లింలు జరిపిన దాడిగానే నమోదు అయ్యింది.
వామపక్ష రాజకీయాలు క్షీణత ఒకవైపు, మైదాన ప్రాంతాల నుండి మావోయిస్టుల ఉపసంహరణ మరొకవైపు, దారితప్పిన దళిత రాజకీయాలు ఇంకొకవైపు. ఇది నేటి తెలంగాణా పరిస్థితి. ఈ పరిస్థితులలో రానున్న రోజులలో తెలంగాణలో అధికారం కైవసం చేసుకుని, తెలంగాణాలో తమ ప్రాబల్యాన్ని విస్తరించడం బిజెపికి అంత కష్టమేమి కాదని నాకనిపిస్తున్నది.
యజ్ఞాలు, యాగాలు జరిపించటం, మత సంబంధిత ప్రదేశాలని, ఆలయాలను బాగుచేయించటం ద్వారా కెసిఆర్ తన హిందూ అస్థిత్వాన్ని ఎలుగెత్తి చాటటంలో సఫలీకృతం అయ్యారు. షాదీ ముబారక్, ముస్లిం విద్యార్ధులకి ప్రత్యేక సంక్షేమ నివాస గృహాలు లాంటి ముస్లిం సంక్షేమ పధకాలకి సంబంధించి అయితే ఇప్పటివరకు పెద్ద వ్యతిరేకత రాలేదు. అయితే ఉద్యోగరహిత వృద్ధి, అశాంతితో ఉన్న యువత, కొనసాగుతున్న వ్యవసాయ సంక్షోభం ఈ పరిస్థితిని మార్చే అవకాశం ఉంది. ఐటి పరిశ్రమ విస్తరణతో పైస్థాయికి ఎగబాకుతున్న అగ్ర కులాలకి హైందవీకరణ తమ వర్గ ప్రయోజనాలని కాపాడుతుంది అని గట్టి నమ్మకం ఏర్పడింది. విఖ్యాత చార్మినార్కి చెందిన ఒక స్థంబాన్ని ఆనుకుని గుడి కట్టడం, అలాగే చాలా కాలం నుండి వెలివాడలకి పరిమితం చేయబడ్డ ముస్లిం జనాభా లాంటి విషయాలు బిజెపి-ఆర్ఎస్ఎస్ రాజకీయాలని వ్యాప్తి చెయ్యడానికి దోహదపడతాయి.
టిడిపికి తెలంగాణలో భవిష్యత్తు కనిపించడం లేదు. ఒకప్పుడు టిడిపికి విశ్వాసపాత్రమైన కార్యకర్తలుగా ఉన్న ఓబిసిలు బిజెపి వైపునకు మళ్ళుతున్నారు. కాషాయ జెండాలు, త్రిశూలాలు పట్టుకుని బహిరంగంగా సంచరించటం నేడు యువతకి సాధారణ విషయం అయిపోయింది. షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమాన్ని హైజాక్ చెయ్యటంలో బిజెపి విజయం సాధించింది. అలాగే జి.కిషన్ రెడ్డిని హోం శాఖ సహాయ మంత్రిగా నియమించి ఉగ్రవాదం అనే బూచిని ఎగదోస్తున్నది.
బిజేపితో సన్నిహితంగా ఉండి, కాంగ్రెస్కి ఎటువంటి స్థానం లేకుండా చేసి కెసిఆర్ ఇప్పటివరకైతే నెట్టుకొచ్చారు. కానీ దక్షిణాదిన తెలంగాణా బిజెపి రెండవ కోట అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
అజయ్ గూడవర్తి
వ్యాసకర్త జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్లో అసిస్టెంట్ ఫ్రొఫెసర్
‘ద వైర్’ వెబ్సైట్ సౌజన్యంతో