టార్గెట్ జగన్..బీజేపీ హైకమాండ్ కొత్త స్కెచ్…!
కాపు ఉద్యమానికి ఊపిరి..ఓట్లుగా మలచుకొనే ప్లాన్
ఏపీ బీజేపి కొత్త చీఫ్ ను నియమించిన కమలం పార్టీ హైకమాండ్..ఆయన అమలు చేయాల్సిన వ్యూహాన్ని చెప్పి పంపింది. అందులో భాగంగా..ఆయన సొంత పార్టీ నేతలతో సమావేశాల కంటే కొందరు ముఖ్యుల ను కలవటం ఆ వ్యూహంలో భాగమే. ఏపీలో జనసే ..బీజేపీ మధ్య పొత్తు అధికారికంగా ఖరారు అయిన తరువాత బీజేపీ కీలక నేతలను మాత్రం పవన్ ఢిల్లీ వెళ్లి ప్రయత్నించినా కలవలేకపోయారు. రాజ్యసభ లో వైసీపీ సహకారం అవసరం అయిన బీజేపీ..ఏపీలో జనసేనతో మైత్రి కుదిరినా…వైసీపీతో మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
ఇప్పుడు కన్నా స్థానంలో బీజేపీ ఏపీ చీఫ్ గా నియమితులైన సోము వీర్రాజు తొలుత చిరంజీవిని కలవటం ద్వారా భవిష్యత్ సమీకరణాలకు తెర లేపారు. ఆ తరువాత మిత్రపక్షంగా ఉన్న జనసేనానిని కలిసారు. ఆ తరువాతనే పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఇక, కాపు ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం ను కలవబోతున్నారు. ఆయనను ఇప్పటికే ఢిల్లీలో ఏపీ వ్యవహారాల్లో కీలక భూమిక పోషించిన ఒక ముఖ్యనేత పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లుగా విశ్వసనీయ సమాచారం. అయితే, ఆయన సమయం కోరినట్లుగా చెబుతున్నారు.
ఇప్పుడు సోము వీర్రాజు తనకు ఉన్న సంబంధాలతో ముద్రగడను పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నారు. ఇక..కాపు ముఖ్య నేతలను కమలం గూటిలోకి తీసుకు రావటం ద్వారా..ఏపీలో చంద్రబాబు..జగన్ లను సామాజిక కోణంలో ఎదుర్కొనవచ్చనేది బీజేపీ వ్యూహం. నేతలను తీసుకున్నా..ఏపీలో కాపులు బీజేపీకి మద్దతుగా నిలుస్తారా..జగన్ ను ఎలా ఎదుర్కొంటారు…
బీజేపీలోకి కాపు ఉద్యమ నేత..కాపు రిజర్వేషన్ల పైనా..
కాపు రిజర్వేషన్ల కోసం సుదీర్ఘ కాలంగా నాయకత్వం వహిస్తున్న ముద్రగడ పద్మనాభం తాను ఉద్యమం నుండి తప్పుకుంటున్నట్లుగా కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. అయితే, ముద్రగడే కాపు ఉద్యమ సారధిగా కొనసాగుతారని కొంత మంది చెబుతున్నప్పటికీ..ఆయన నుండి ఎటువంటి స్పందన రావటం లేదు. 2014లో చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీని సాధన కోసం ముద్రగడ తునిలో సభ ఏర్పాటు చేసారు. ఆ సమయంలో రత్నాచల్ రైలు దహనం జరిగింది.
ఆ తరువాత కాపుల్లో రిజర్వేషన్ల ఆకాంక్ష..అలాగే ఉండి పోయింది. చంద్రబాబు తొలుత మంజునాధ కమిటీ మెజార్టీ సభ్యుల రిపోర్టు ఆధారంగా కాపులకు రిజర్వేషన్ కల్పిస్తున్నట్లుగా సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. ఆ తరువాత కేంద్రం ప్రకటించిన అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లలో కాపుల కు అయిదు శాతం ఇవ్వాలని తీర్మానిస్తూ కేంద్రానికి నివేదించారు. దీంతో ఈ రెండింట్లో ఏది అమలు చేయాలని కోరుకుంటున్నారో స్పష్టత ఇవ్వాలని కేంద్రం ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇంతలో 2019 ఎన్నికలు రావటంతో ప్రభుత్వం మారింది. అయితే, జగన్ తన పాదయాత్రలో తూర్పు గోదావరి జిల్లాలో కాపులకు రిజర్వేషన్ అంశం తన చేతుల్లో లేదని..సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తానని చెప్పటం రాజకీయంగా దుమారానికి కారణమైంది. అయితే, కాపులు మొత్తం తమ వెంటే ఉంటారని భావించిన పవన్ కళ్యాణ్ సైతం కాపుల రిజర్వేషన్ అంశంలో తన వైఖరి స్పష్టం చేయలేకపోయారు. కాపులు ఎక్కువగా ఉండే ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేకకు కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కింది.
టార్గెట్ జగన్..కాపు కార్డుతో చెక్ పెట్టేలా..
జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అగ్ర వర్ణాల పేదలకు ఇచ్చే పది శాతం రిజర్వేషన్లలో అయిదు శాతం కాపులకు ఇస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేసారు. కేంద్రం ఆ నిర్ణయం తీసుకున్నా ఇప్పటికీ ఏ రాష్ట్రంలోనూ అమలు జరగటం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో కాపులు తమను బీసీల్లో చేర్చాలనేది వారి డిమాండ్ అంటూ వైసీపీ నేతలు తమ నిర్ణయాన్ని సమర్ధించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. కాపులకు గత ప్రభుత్వం ఏడాదికి వెయ్యి కోట్ల ఇచ్చామని చెప్పి ఇవ్వలేదని..తమ ప్రభుత్వం రెండు వేల కోట్లు ఇస్తుందని చెబుతూ బడ్జెట్ లో ప్రతిపాదించారు. ఇక, ఇప్పుడు టీడీపీ.. వైసీపీకి రెండు బలమైన సామాజిక వర్గాల మద్దతు ఉండటంతో కాపులను తమ వైపు తిప్పుకొనేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
కాపులకు ప్రాధాన్యత చాటేందుకే…
అందులో భాగంగా చిరంజీవి..ముద్రగడను ట్రాప్ చేస్తోంది. ముద్రగడ బీజేపీలోకి వస్తే ఆయనకు తగిన ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు కమ్మ వర్గానికి చెందిన టీడీపీ నేతలను తమ పార్టీలో చేర్చుకున్న బీజేపీ..ఇప్పుడు కాపు నేతలకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా జగన్ ను సామాజిక కోణంలో ఎదుర్కోవాలనే ఆలోచన చేస్తోంది. అందులో భాగంగా కాపు రిజర్వేషన్ అంశం మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే అంశం పైన కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. అయితే, జగన్ పైన ఇదే అంశం పైన ఒత్తిడి పెంచితే సీఎం ఏ రకంగా ఎదుర్కొంటారనేది ఆసక్తి కర అంశమే. మరి..ఏపీలో ఏ మాత్రం బలం పెంచుకోలేకపోతున్న బీజేపీ ఇప్పుడు మెగా బ్రదర్స్ ..కాపు నేతల ఆధారంగా ఎదగాలని చూస్తోంది. మరి..కాపు నేతలు బీజేపీలోకి వెళ్లినా..కాపుల ఓటింగ్ బీజేపీకి వెళ్తుందా లేదా అనేది ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతోంది.