(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
వైసిపి రెబల్ ఎంపిగా మారిన నర్సాపురం లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణం రాజు ప్రతి రోజు ప్రతి పూట వైఎస్ఆర్ సిపిని, సిఎం జగన్ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఏదో ఒక విషయాన్ని వివాదంగా మార్చి జగన్ను ఇరుకున పెట్టడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దానిలో కులాలను, మతాలను కూడా వాడేస్తున్నారు. తాజాగా తిరుమల బ్రహ్మోత్సవాల అంశాన్ని జగన్ దంపతులకు ముడి పెడుతూ ఓ సవాల్ విసిరారు. అది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆయన సవాల్ను జగన్ స్వీకరిస్తారా? లేదా? అన్న దానిపై అంతర్గత చర్చ కూడా నడుస్తున్నది. ఇంతకూ ఆ సవాల్ ఏమిటి? రఘురామ కృష్ణం రాజును వైసీపీ ఎలా డీల్ చేస్తుంది? ఈ సవాల్ను జగన్ ఎలా స్వీకరిస్తారు? లేదా అనేది చూసుకుంటే…
ఏమని సవాల్ చేశారంటే..
తిరుమలలో జరిగే బ్రహ్మత్సవాలకు ఈ సారి జగనన్న సతీ సమేతంగా పాల్గొనాలని సూచించారు రఘురామకృష్ణం రాజు. స్వతహాగా వైఎస్ఆర్ కుటుంబం రాజారెడ్డి కాలం నుండి క్రైస్తవంలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. స్వతహాగా క్రైస్తవుడైన వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలోనూ, ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా హిందూ దేవాలయాలు సందర్శించినప్పటికీ సతీ సమేతంగా వెళ్లిన దాఖలాలు లేవు. గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు తిరుమల బ్రహ్మోత్సవాలకు సతీ సమేతంగా వెళ్లి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ వచ్చారు. ధర్మశాస్త్రం ప్రకారం కూడా హైందవ ఆలయాల ఉత్సవాల సందర్భంలో స్వామి వార్లకు పట్టువస్త్రాలను దంపత సమేతంగానే సమర్పిస్తూ వస్తుంటారు. ఇప్పుడు రఘురామ కృష్ణం రాజు కొత్త అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిని ధర్మసంకటంలోకి నెట్టేశారు. రఘురామ కృష్ణం రాజు సూచనపై జగన్ ఏ విధంగా స్పందిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రానున్న బ్రహ్మోత్సవాలకు సతీమణి భారతితో సహా జగన్ హజరు అవుతారా? లేదా? చూడాలి మరి.
పార్టీకి, జగన్కు విధేయుడినంటూనే…
వైఎస్ఆర్ సీపీ (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ)కి, సిఎం వైఎస్ జగన్ విధేయుడిని అంటూనే రఘురామ కృష్ణం రాజు ఆ పార్టీ విధానాలను, అధినేత నిర్ణయాలను తప్పుబడుతూ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని, పార్టీని ఇరుకున పెట్టేలా మాట్లాడుతున్నారు. ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ వైసీపీ పార్లమెంటరీ నేతల బృందం లోక్ సభ స్పీకర్కు ఫిర్యాదు చేసిన తరువాత నుండి రఘురామ కృష్ణం రాజు దూకుడు మరింత పెంచారు. ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలోనూ, రాజధాని అమరావతి విషయంలోనూ, మద్యం అమ్మకాల విషయంలోనూ ఇలా ప్రతి అంశంలోనూ వైసిపి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్నారు రఘురామ కృష్ణం రాజు. రెండు రోజుల క్రితం అమరావతి రెఫరెండంగా తాను నర్సాపురం ఎంపి స్థానానికి రాజీనామా చేసి లక్ష ఓట్లతో గెలుస్తాననీ, తాను నెగ్గితే రాజధాని అమరావతిలోనే కొనసాగిస్తామని సీఎం జగన్ వ్రాతపూర్వకంగా హామీ ఇస్తారా అని సవాల్ విసిరారు. నేడు కొత్త బాణి అందుకున్నారు రఘురామ కృష్ణంరాజు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదనీ స్పష్టం చేస్తూ ఒక వేళ రాజీనామా చేయాల్సి వస్తే అమరావతి రాజధాని విషయంలో మాట తప్పినందున వాళ్లే (సిఎం జగన్తో సహా మంత్రులు) రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలనీ, అప్పుడు మెజార్టీ సీట్లు వస్తే రాజధాని ఎక్కడైనా పెట్టుకోవాలి అంటున్నారు రఘురామ కృష్ణం రాజు. ప్రతి అంశాన్ని వివాదంగా చేసి పార్టీకి తలనొప్పి కల్గిస్తున్న రఘురామ కృష్ణం రాజు వ్యవహారాన్ని సిఎం జగన్మోహనరెడ్డి ఏ విధంగా డీల్ చేస్తారో చూడాలి మరి !.