YS Jagan Bail Case: ఏపి రాజకీయాల్లోనూ.. ఒకరకంగా దేశీయంగా కూడా ఇప్పుడు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి బెయిల్ రద్దు వ్యవహారం హాట్ టాపిక్ గా ఉంది.. వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ వేసింది మొదలు “అదుగో పులి అంటే ఇదిగో తోక” అన్నట్లు టీడీపీ అనుకూల మీడియా… ఓ వైపు పిటిషనర్ కూడా ఇక జగన్ బెయిల్ రద్దు అయిపోతుంది… ఇదిగో, అదిగో అంటూ ఆయన వెంటనే జైలుకు వెళ్లడం ఖాయం, నెక్ట్స్ జగన్ వారసులుగా తల్లి విజయమ్మ అవుతారా లేక భారతి రెడ్డి అవుతారా అంటూ డిబేట్ లు కూడా నిర్వహించేస్తున్నాయి… కేసు వాయిదా పడిన ప్రతి సారి ఆ రోజు జగన్ బెయిల్ రద్దు అవ్వడం ఖాయమంటూ రఘురామ కృష్ణం రాజు కూడా అతిగా చెబుతూ వస్తున్నారు. వైసీపీ అనుకూల మీడియా మాత్రం జగన్ బెయిల్ రద్దు కాదని, రఘురామ పిటిషన్ నే కొట్టేస్తారంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. ఇక్కడ అసలు కోర్టులో ఏమి జరుగుతుంది. కేసు వాయిదాల మీద వాయిదా ఎందుకు పడుతోంది అన్నది పరిశీలిస్తే రఘురామ వేసిన పిటిషన్ విషయంలో సీబీఐ పెద్ద డ్రామా ఆడుతున్నట్లు ఇక్కడ స్పష్టం అవుతోంది.
YS Jagan Bail Case: సీబీఐ గేమ్ ఎవరికీ అర్ధం కాలేదేమో..!?
మొదట జూలై 1న ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు సీబీఐ ఏమి చెప్పింది అంటే మాకు సంబంధం లేదు. కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు, మేము వాదనలు వినిపించము, లిఖిత పూర్వ అఫిడవిట్ దాఖలు చేయము అని చెప్పింది. జూలై 8వ తేదీ వాయిదాకు జగన్ తరపు న్యాయవాదులు, రఘురామ తరపున న్యాయవాదులు కౌంటర్ లు దాఖలు చేశారు. తరువాత జూలై 14న తేదీ వాదనల సమయంలో కోర్టు సీబీఐ తరపు న్యాయవాదులను కౌంటర్ దాఖలు చేస్తారా లేదా, ఈ రెండు వాదనలు విని తీర్ప చెప్పమంటారా అని కోర్టు ప్రశ్నించింది. ఈ సమయంలో తాము కౌంటర్ వేస్తామని తమకు కొంత సమయం కావాలని కోరారు. దీంతో సీబీఐ కౌంటర్ దాఖలునకు కోర్టు జూలై 26వ తేదీ వరకూ సమయం ఇచ్చింది. అయితే 26వ తేదీన సీబీఐ న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయలేదు, సీబీఐ అధికారులకు జ్వరం వచ్చిందని, అందుకు కౌంటర్ దాఖలు చేయలేకపోయామని మరి కొంత సమయం కావాలని కోరారు. కోర్టు దానికి సమ్మతించి జూలై 30వ తేదీకి వాయిదా వేసింది. చివరకు 30వ తేదీ వచ్చే సరికి సీబీఐ తరపు న్యాయవాదులు తాము కౌంటర్ దాఖలు చేయము, బెయిల్ రద్దు విషయంలో కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని కోర్టుకు మళ్లీ చెప్పేశారు. జూలై 1వ తేదీన ఏమి చెప్పారో జూలై 30 న అవే మాటలు చెప్పారు. ఈ మధ్య కాలంలో కౌంటర్ వేస్తాము, జ్వరం వచ్చింది, సమయం కావాలి అంటూ డ్రామాలు అడి నెల రోజులు కాలయాపన చేసి చివరకు తాము లిఖిత పూర్వక వాదనలు ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది సీబీఐ.
ఆగష్టు 25తో ఏమి తేలదు..!!
దీంతో సీబీఐ కోర్టు వాదనలు ముగిసినట్లు ప్రకటించి తుది తీర్పును ఆగస్టు 25న వెల్లడిస్తామని చెప్పింది. ఆగస్టు 25తేదీన తీర్పు రావడం ఖాయం. దీంతో రఘురామ కృష్ణం రాజు, ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా ఆగస్టు 25న జగన్ బెయిల్ రద్దు అయిపోతుందంటూ ప్రచారం చేసేస్తున్నారు. ఒక వేళ సిబీఐ కోర్టు బెయిల్ రద్దు విషయంలో ప్రతికూలంగా తీర్పు వస్తే జగన్ తరపున న్యాయవాదులు వెంటనే హైకోర్టును ఆశ్రయిస్తారు. హైకోర్టులో సింగిల్ జడ్జి బెంచ్, ఆ తరువాత డివిజన్ బెంచ్ ఉంది. చివరకు సుప్రీం కోర్టుకు వెళ్లవచ్చు. ఇది అంత ఈజీగా తేలే వ్యవహారం కాదు అన్నది అందరికీ తెలిసిందే.
రఘురామ కృష్ణం రాజు సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్యే రెండు నెలలు పట్టింది. ఇక హైకోర్టు, సుప్రీం కోర్టులో కేసు తేలాలంటే ఎన్ని నెలలు పడుతుందో ఊహించుకోవచ్చు. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటంటే ఈ కేసు ఇప్పట్లో అంత ఈజీగా తేలేది కాదు అనేది సుస్పష్టం. ఒక వేళ సీబీఐ కోర్టులో బెయిల్ రద్దు అయితే జగన్మోహనరెడ్డి హైకోర్టుకు వెళతారు. బెయిల్ రద్దు కాకపోతే రఘురామ కృష్ణంరాజు హైకోర్టులో గానీ సుప్రీం కోర్టులో గానీ రివ్యూ పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నాయి. జగన్ బెయిల్ రద్దు పిటిషన్, వాదన, విచారణలు మీడియా సంస్థకు వార్తలుగానే ఉంటాయి తప్ప రిజల్ట్ మాత్రం ఉండదు. ప్రస్తుత పరిస్థితులు, కోర్టులో వాదనల తీరు పరిశీలించినట్లయితే జగన్మోహనరెడ్డి బెయిల్ రద్దు అయ్యే అవకాశాలు 60 నుండి 70శాతం ఉండకపోవచ్చు. ఎందుకంటే అసలు కేసు నమోదు చేసిన సీబీఐ అభ్యంతరాలు తెలియజేయలేదు. బెయిల్ షరతులు ఉల్లంఘించారు అని సీబీఐ కోర్టుకు చెప్పలేదు. విచారణకు సహకరించడం లేదనీ గానీ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని గానీ సీబీఐ తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించలేదు. ఇదే జగన్ కు ప్లస్ అవ్వబోతున్నది. ఒక వేళ సీబీఐ గనుక బెయిల్ రద్దు చేయాల్సిందే అని చెప్పి దానికి తగ్గట్లు కొన్ని ఆధారాలు చూపినట్లయితే రఘురామ పిటిషన్ కు బలం చేకూరేది, బయిల్ రద్దుకు అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు సీబీఐ తమ అభ్యంతరాలు చెప్పలేదు. ఏది ఏమైనా ఈ కేసు మాత్రం సాగుతూనే ఉంటుంది.