YS Jagan: రాజకీయం చేయడంలో.. పరిపాలనలో.. పథకాల్లో.. వినూత్న ఒరవడికి శ్రీకారం చుడుతున్న సీఎం జగన్ ఇక మీదట ఇంకొన్ని ప్రయోగాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు.. పార్టీని, ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేయాలని భావిస్తున్న జగన్.. ఆ దిశగా కొన్ని సంచలన నిర్ణయాలు అమలుకు సన్నాహాలు చేస్తున్నారు.. వచ్చే జనవరి నుండి ఇటు మంత్రి వర్గం మార్పుల ద్వారా ప్రభుత్వంలో తన తర్వాత స్థానంలో కొత్త ముఖాలు.. అటు పార్టీలో పదవుల మార్పుల ద్వారా పార్టీలో తన తర్వాత స్థానంలో కొత్త ముఖాలు ఉండాలని యోచిస్తున్నారట.. దీనిలో భాగంగా ఎవ్వరూ ఊహించని వారికి కీలక పదవులు ఇస్తూనే.. ఎవ్వరూ ఊహించని వారికి పూర్తిగా దిగువకు పడేయనున్నారు.. అయితే వైసీపీలో అంతర్గతంగా జరుగుతున్న పలు కీలక మార్పులకు సంబంధించి న్యూస్ ఆర్బిట్ కు సమాచారం అందింది. పార్టీలో అంతర్గత మార్పులు చాలా ఆసక్తికరంగా, కొన్ని సంచలనంగా ఉండబోతున్నాయి. కొందరు నాయకులపై ఆగ్రహంతోనూ మార్పులు జరుగుతున్నాయిట.వైసీపీ ప్రక్షాళన మాత్రం ఏవరూ ఊహించని విధంగా జరుగుతాయని పార్టీ అంతర్గత వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. నెలా రెండు నెలల్లో పార్టీలో మార్పులు చేర్పులు ఉంటాయి.
పార్టీ అంతర్గతంగా జరుగుతున్న వ్యవహరాలపై పార్టీలో కొందరు పెద్దలు చర్చించుకుంటున్న అంశాల మేరకు.. “ప్రస్తుతం వైసీపీలో పలువురు కీలక నేతలు రెండు, మూడు జిల్లాలకు ఇన్ చార్జిలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్ర జిల్లాలకు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ఉభయ గోదావరి, చిత్తూరు జిల్లాకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు ఎంపి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, కొన్ని జిల్లాలకు అయోధ్య రామిరెడ్డి.. ఇంకొన్ని జిల్లాలకు సజ్జల రామకృష్ణారెడ్డిలు ఇన్ చార్జిలు ఉన్నారు. ఇలా జిల్లాల వారీగా ఇన్ చార్జిలు ఉన్నారు. పార్టీ అధినేత, సీఎం జగన్ తీసుకుంటున్న మార్పుల్లో మొదటిది ఈ ఇన్ చార్జి ల వ్యవస్థను తీసివేస్తున్నారుట. ఇక రెండవది ఏమిటంటే.. త్వరలో మంత్రివర్గ ప్రక్షాళన జరుగుతోంది కదా, తొలగించిన మంత్రుల్లో కీలక విషయాలను హాండిల్ చేయగల సమర్ధత, సీనియారిటీ, సబ్జెక్టుపై అవగాహన ఉన్న వారిలో పదిమందితో కలిసి ఓ కీలక కమిటీ వేయబోతున్నారట.. జిల్లాల ఇన్ చార్జిలు గా ఉన్న అయిదుగురిలో ఇద్దరు లేదా ముగ్గురికి పార్టీలో తెరవెనుక బాధ్యతలు ఇస్తూ.. మిగిలిన వారికి వేర్వేరు బాధ్యతల్లో ఉంచనున్నారు. మొత్తానికి ఇప్పటి మంత్రుల్లోని పదిమందితో పొలిటికల్ యాక్షన్ కమిటీ ని వేయబోతున్నారానిది మాత్రం కచ్చితమైన సమాచారం..!
YS Jagan: సమీక్షలు.. పార్టీల బాధ్యతలు..!?
ఈ కమిటీకి కొన్ని పనులు, బాధ్యతలు అప్పగించనున్నారు. నియోజకవర్గాల వారిగా, జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించడానికి పార్టీ పరంగా ఈ కమిటీ పూర్తి బాధ్యతలు నిర్వహిస్తుంది. ఈ కమిటీ ప్రతి వారం పది రోజులకు ఒక సారి జిల్లా, నియోజకవర్గ స్థాయిలో పార్టీ పరిస్థితులు అధ్యయనం చేస్తూ తీసుకోవాల్సిన మార్పులపై పార్టీ అధినేతకు నివేదికలు ఇస్తూ ఉంటుంది.ఇప్పటి వరకూ జరిగిన జగన్మోహనరెడ్డి పరిపాలనలో పార్టీ పట్ల అంతగా దృష్టి సారించలేదు. ఎమ్మెల్యేలు కూడా సీఎం జగన్ అపాయింట్మెంట్ దొరకాలంటే చాలా కష్టంగా ఉండేది. ఈ పరిస్థితులు లేకుండా రాబోయే రెండున్నర సంవత్సరాల్లో ఎమ్మెల్యేలు ఎవరైనా జగన్ ను కలుసుకోవాలంటే వెంటనే అపాయింట్మెంట్ లు ఇప్పించడం, ఇతర పార్టీ విషయాలపై సీరియస్ గా యాక్షన్ తీసకోవడం ఈ కమిటీ బాధ్యతగా ఉండబోతున్నది.
* మరో విషయంలో పరిపాలనా విషయాల్లో మార్పులు చేర్పులు ఏమైనా జరగాలా..? ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి..? క్షేత్ర స్థాయిలో పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల వ్యక్తం అవుతున్న అభిప్రాయాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడం, వాటిని సరిచేయడం లాంటివి ఈ కమిటీ చేయనున్నది. ఈ కమిటీలో సాదా సీదా నేతలు కాకుండా మంత్రులుగా బాధ్యతలు నిర్వహించిన సీనియర్ లు, జిల్లాల ఇన్ చార్జిలు ఉంటారు. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలలో ఒకరు ఈ కమిటీకి నాయకత్వం వహించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ కమిటీలో కురసాల కన్నబాబు, పేర్ని నాని, బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి తదితర సీనియర్ మంత్రులు ఉంటారని తెలుస్తోంది. ఇంతకు ముందు టీడీపీలోనూ ఇలాంటి కమిటీ ఒకటి ఉండేది. టీడీ జనార్ధన్, సీఎం రమేష్, సుజన చౌదరి తదితరులు పార్టీ వ్యవహారాలు చూసేందుకు ఉండేవారు. కాకపోతే అది కమిటీ అనే కంటే చంద్రబాబు కోటరిగానే ఎక్కువ ప్రాచుర్యం పొందింది. కానీ వైసీపీలో మాత్రం సమూల మార్పులకు, సమీక్షలకు ఈ కమిటీ ఏర్పాటు జరగనున్నట్టు తెలుస్తుంది..!