కేంద్రంతోనూ జగన్ పోరాడక తప్పదా..సిద్దమేనా ? సీఎం జగన్ ముందున్న ప్రత్యామ్నాయాలేంటి…??
ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న నిర్ణయాల అమలుకు ఆటంకాలు ఏర్పడుతూనే ఉన్నాయి. పేదలకు ఇంటి స్థలాల విషయంలో ఇప్పటికే న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు చేయటంతో ఇప్పటికే పలు మార్లు ఆ కార్యక్రమం వాయిదా పడింది. ఇక, మరో ప్రతిష్ఠాత్మక నిర్ణయంగా ముఖ్యమంత్రి ఒకటో తరగతి నుండే ఆంగ్ల మాధ్యమం అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. దీని పైన రాజకీయం గా అనేక విమర్శలు వెల్లువెత్తాయి. చంద్రబాబు..పవన్..కొందరు మీడియా సంస్థల అధినేతల మొదలు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి జగన్ ధీటుగా స్పందించారు. వారి పిల్లలు మాత్రమే ఇంగ్లీషు మీడియాల్లో చదువుకోవాలి..పేదల పిల్లలకు వద్దా అంటూ నిలదీసారు. దీని పైన హైకోర్టుకు కొందరు వెళ్లగా..ప్రభుత్వం ఆంగ్ల విద్య పైన జారీ చేసిన జీవోను కొట్టి వేసింది. దీని పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. అక్కడ వ్యవహారం పెండింగ్ లో ఉంది. ఇటు వైపు ఈ విద్యా సంవత్సరం నుండే దీనిని అమలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. 5వ తరగతి వరకు మాతృభాషలోనే బోధన జరగాలని సిఫార్సును ఆమోదించింది. దీంతో..ఇప్పుడు జగన్ ఏం చేయబోతున్నారు..కేంద్రంతోనూ దీని పైన పోరాటం చేయాల్సిందేనా..లేక తన నిర్ణయాన్ని నిలుపుదల చేసుకోవాలా..
కేంద్ర కేబినెట్ ఆమోదంతో…ప్రాధమిక విద్యాభ్యాసం మాతృభాషలోనే జరగాలన్ని కస్తూరి రంగన్ సిఫార్సులను కేంద్రం ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుండే ఒకటో తరగతి నుండే ఆంగ్ల బోధన ప్రారంభించి..ఏడాదికి ఒక్కో క్లాస్ కు పెంచుకుంటూ పోవాలని నిర్ణయించింది. దీని పైన వ్యతిరేకత వచ్చినా..ముఖ్యమంత్రి ఈ విషయంలో మాత్రం ముందుకే వెళ్తామని తేల్చి చెప్పారు. దీని పైన పేదల్లోనూ సానుకూల స్పందన వస్తుందంటూ వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని కొందరు హైకోర్టులో సవాల్ చేయగా..కోర్టు దీనికి సంబంధించిన జీవోను కొట్టివేసింది. దీని పైన ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా..అక్కడ ఈ వ్యవహా రం పెండింగ్ లో ఉంది. ఇదే సమయంలో కేంద్రం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, దీని అమలు వెంటనే మొదుల పెట్టాలనేది కొందరి డిమాండ్ కాగా..ఆచరణ ఎంత వరకు సాధ్యమనే ప్రశ్న సైతం ఇప్పుడు వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ఈ నిర్ణయాన్ని అమలు చేసే దిశగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తాము తల్లి తండ్రుల అభిప్రాయాన్ని ఈ విషయం పైన సేకరించగా అందు లో 96 శాతం ఆంగ్ల మాధ్యమానికి మొగ్గు చూపినట్లుగా ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొంది.
కేంద్రంతో పోరాటం..ఇటు న్యాయ పరంగానూ..ఇప్పటికే తాను అమలు చేయాలనుకుంటున్న పలు నిర్ణయాలు కోర్టులకు చేరటంతో వాటి పైన ప్రభుత్వం న్యాయ పోరాటం చేస్తోంది. ఇదే సమయంలో కేంద్రం ఇప్పుడు తాజాగా తీసుకున్న అయిదో తరగతి వరకు మాతృభాషలోనే విద్యా బోధన సైతం జగన్ కు సవాల్ గా మారుతోంది. దీని నుండి వెనక్కు వెళ్లేందుకు జగన్ రాజీ పడే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. దీని పైన కేంద్రం తోనూ పోరాటం చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. లేకుంటే కేంద్ర నిర్ణయం పైన కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. జగన్ ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో పీపీఏల పైన తీసుకున్న నిర్ణయం పైన కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ, జగన్ పూర్తిగా ఆ విషయంలో వెనక్కు తగ్గకపోయినా…కేంద్రంతో వివాదాలు మాత్రం వద్దనే చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు ఈ విషయంలో జగన్ ఏం చేస్తారు.. కేంద్రంతో కయ్యానికి దిగుతారా.. లేక మధ్యే మార్గంగా ఉన్న అవకాశాల పైన అధ్యయనం చేసి..కేంద్రాన్ని ఒప్పిస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. త్వరలోనే సీఎం జగన్ దీని పైన విద్యా శాఖ..న్యాయ నిపుణులతో చర్చించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ దీని పైన ప్రధానికి లేఖ ద్వారా ముందుగా తన అభిప్రాయం చెబుతారని పార్టీ నేతలు చెబుతున్నారు.