YS Jagan: ప్రతిపక్ష మీడియాలు గొంతెత్తి అరుస్తున్నయ్ .. విపక్ష సోషల్ మీడియాలు తిడుతున్నయ్.. ప్రతిపక్ష నాయకుల గొంతులు గగ్గోలు పెడుతున్నయ్.. కానీ జగన్ ఒకటే మాట, ఒకటే పని, ఒకటే బాట.. ఎవరెన్ని అన్నా.., ఎవరేం విమర్శించినా.., ఎవరెలా అరిచినా సంక్షేమం ఆగదు. పథకం ఆగదు..! రాష్ట్రం అప్పుల్లో ఉన్నా.., ఖజానాలో డబ్బులు లేకపోయినా.., ఆర్ధిక ఇబ్బందులు వెంబడిస్తున్నా.., కొత్త అప్పులు పుట్టకపోయిన.. తల తీసి తాకట్టు పెట్టయినా సరే అనుకున్న సమయానికి, అనుకున్న పథకం డబ్బులు జనాలకు చేర్చాల్సిందే. అదే ఈ రైతు భరోసా కూడా..!
YS Jagan: ఏకైన ధోరణి.. ఏకైక లక్ష్యం ..!
జగన్ అంటేనే ఒక మొండి. ఏదైనా తాను అనుకున్నదే చేసే వ్యక్తిత్వం. పగ్గాలు చేపట్టి రెండేళ్లు గడిచింది. ఏ నాడూ ఒక్క పథకాన్ని ఆపలేదు. డబ్బులేకపోయినా వాయిదా కూడా వేయలేదు. జీతాలు, పింఛన్లు అప్పుడప్పుడూ వాయిదా పడ్డాయి కానీ.., ఆ హస్తాలు, నేతలు, భరోసాలు, ఒడిలు మాత్రం ఆగలేదు. అదే అతని ప్రత్యేకత. ఇప్పుడు కూడా జగన్ పథకం ఇవ్వకపోయినా ఎవరూ అడగరు. ఏంటి మాకు ఆ పథకం డబ్బు రాలేదు అని ఎవరూ గొగ్గోలు పెట్టరు. కరోనా కారణంగా మే నెలలో ఇవ్వాల్సిన రైతు భరోసాని సెప్టెంబరులో ఇస్తాము.. అని చెప్పేసినా పెద్ద వ్యతిరేకత రాదూ. కానీ జగన్ అలా చేయరు. ఆయనకు వాయిదాలు తెలియదు. అనుకున్న పథకం అనుకున్న సమయానికి ఇవ్వడం మాత్రమే తెలుసు. మొండిగా పథకాలపై ఆధారపడడమే తెలుసు. తన పాలనని పథకాల పాలనగా మార్చేయడమే తెలుసు. ప్రాజెక్టులు లేకపోయినా.. పరిశ్రమలు రాకపోయినా.., పెట్టుబడులు అందకపోయినా.. రాష్ట్రంలో పథకాలు పారుతున్నాయి అవి చాలు. జగన్ అంటే ఏంటో జనాలకు తెలుస్తుంది అనే ధోరణిలో మాత్రమే జగన్ ఉన్నారు..!
మొండి మంచిదా..!? చెడ్డదా..!?
ఉన్నదీ ఉన్నట్టు చెప్పుకోవాలంటే జగన్ చేసిందేమి లేదు. ఈ రెండేళ్లలో చూపించిన ప్రగతి ఏమి లేదు. కానీ జనంలో ఏమి వ్యతిరేకత లేదు. ప్రతిపక్షాలు, విపక్ష మీడియాలు అరవడం తప్ప జగన్ పట్ల రాష్ట్రంలో తటస్థ వర్గాల్లో వ్యతిరేకత రాలేదు. దీనికి ఏకైక కారణం ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలు. కేవలం అవొక్కటే జగన్ పాలనకు శ్రీరామరక్షగా మారాయి. జగన్ తల ఎత్తి గర్వంగా చెప్పుకునే అవి మాత్రమే. మొండిగా తాను అనుకున్న పథకాన్ని ఏ మాత్రం తిప్పకుండా ఇవ్వడం అంటే అంత సులువు కాదు. పథకాల పేరిట పాలన సాగిస్తూ పెద్ద వర్గాల్లో జగన్ పేరుని సుస్థిరం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో మొండిగా వెళ్తున్నారు. ఇది మంచో, చెడో అనేది పక్కన పెడితే సంక్షేమ పాలన ఒక్కటే గట్టెక్కిస్తుంది అనుకోవడం పొరపాటే.
ప్రతిపక్షాల పన్నాగాలు సాగవు..!!
పథకాలు ఎందుకు.. డబ్బు ఎందుకు.. ఆక్సిజన్ ఇవ్వండి, బెడ్లు సమకూర్చండి అంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో జగన్ ని బాగా ట్రోల్ చేస్తున్నారు. ఒకవేళ జగన్ దాన్ని లొంగిపోయి.. ఒకవేళ ఈ రైతుభరోసా పథకాన్నే వాయిదా వేస్తే.. అదే సోషల్ మీడియా వేదికగా.. “రైతు భరోసా పథకం ఆపేసి, రైతులకు అన్యాయం చేసిన జగన్. కరోనా వెలనా రైతుకి అండగా లేని జగన్” అంటూ ట్రోల్ చేసేవి. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి హద్దు అదుపు ఉండదు.. అందుకే జగన్ అవేమి పట్టించుకోరు. సంక్షేమాన్ని ఆపరు. అయితే అదే సమయంలో ఆక్సిజన్ కోసం, బెడ్లు కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడం, ప్రత్యేక కార్యక్రమం కూడా చేపడితే పరిస్థితి మరోలా ఉండేది..!