3 రాజధానులపై ఫుల్ క్లారిటీ
మూడు రాజధానుల విషయంలో ఆటంకాలెన్నొస్తూ… సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఫుల్ క్లారిటీతో ఉన్నారు. విభజన గాయాలతో ఆంధ్ర ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని… అలాంటి పరిస్థితి భవిష్యత్ లో ఎప్పుడూ రాకూడదన్న ఉద్దేశంతోనే పరిపాలన వికేంద్రీకరణ చేపట్టామన్నారు సీఎం జగన్. రాజధానుల విషయంలో తలెత్తుతున్న విభేదాలను పక్కకుబెడితే… త్వరలోనే విశాఖ కేంద్రంగా కార్యానిర్వహక రాజధాని పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. రాజధాని తరలింపు విషయంలో హైకోర్టులో ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈనెల 27కు కేసు విచారణ వాయిదా పడింది.
భవిష్యత్లో సమస్యలు తలెత్తరాదనే…
మూడు రాజధానుల విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఫుల్ క్లారిటీతో ఉన్నారు. పరిస్థితులు భిన్నంగా మారుతున్నప్పటికీ… తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పనులు చక్కబెట్టి సీఎం జగన్ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా మరికొంత క్లారిటీ ఇచ్చారు. గతంలో తలెత్తిన పరిస్థితి భవిష్యత్లో మునుపెన్నడూ కూడా ఎదురు కాకూడదని… ఇక మూడు ప్రాంతాలు అభివృద్ధిలో దూసుకుపోవాలన్న ఆకాంక్ష సీఎం జగన్ మోహన్ రెడ్డి వెలుబుచ్చారు. ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణే… రాష్ట్ర ప్రజలకు సరైన మందు అని చెప్పారు. సమన్యాయం జరగాలన్న ఉద్దేశంతో మూడు రాజధానుల బిల్లును చట్టంగా తీసుకొచ్చామన్నారు. త్వరలోనే విశాఖ కేంద్రంగా కార్యనిర్వహక రాజధానిగా… కర్నూలు కేంద్రంగా న్యాయరాజధానికి పునాదులు వేస్తామన్నారు.
కోర్టులో బలంగా వాదనలు
ఇప్పటికే రాజధాని వ్యవహారం రాష్ట్రానికి సంబంధించిందంటూ కేంద్ర హోం శాఖ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం హైకోర్టులో గట్టి వాదన విన్పించింది. విశాఖలో రాజధాని ఏర్పాటు చేయడం వల్ల ఖజానాపై భారం పడదని… అదే అమరావతి నిర్మాణం ఎంతో వ్యయంతో కూడుకున్నదని… అందుకే విశాఖను కార్యానిర్వహక రాజధానిగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని… అదే సమయంలో విభజనతో కలిగిన గాయాలను మాన్పే ఉద్దేశంతో మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకొస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది.
పేదల పథకాలకు రాజ్యాంగమే స్ఫూర్తి
రాజ్యాంగంలో రాసిన జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ పదాలకు నిజమైన అర్థాన్నిస్తూ 14 నెలల పాలన సాగిందన్నారు సీఎం జగన్. ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 4 వేల కోట్ల రూపాయల ప్రభుత్వ సొమ్ము ఆదా చేశామన్నారు. ప్రస్తుతం పేదల కోసం అములు చేస్తున్న పథకాలకు ఫలాలు పది నుంచి ఇరవై ఏళ్ల తర్వాత వస్తాయన్నారు. ఈ పథకాలన్నీ రాష్ట్ర ప్రజల సామాజిక రాజకీయ ఆర్థిక మెరుగైన మార్పుల కోసం బాధ్యతతో, మనసుతో చేస్తున్నవని స్వాతంత్ర్యదినోత్సవ సందేశంలో చెప్పారు.