YS Jagan: ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుల్లో పిటిషన్లు కుప్పలై పడుతున్నయి.. వైసీపీకి వ్యతిరేకంగా రకరకాల సర్వేలు కోడై కూస్తున్నాయి.. జగన్ కి వ్యతిరేకంగా పాత, కొత్త కేసులు వెంటాడుతున్నాయి.. బెయిల్ రద్దు అంటూ శత్రు నేతల సైన్యం బాకాలు ఊగుతున్నాయి.. ఎమ్మెల్యేల్లో అసమ్మతి, అసంతృప్తి అంటూ అంతర్గత వర్గాలు చర్చించుకుంటున్నాయి.. ఇన్ని తలనొప్పులు వెంటాడుతున్నప్పుడు ఆ పార్టీ, ఆ ప్రభుత్వాధినేతకి ఒత్తిడి ఉంటుంది.. ఆ ఒత్తిడిని తట్టుకుని, అన్నిటినీ ఒక్కోటీ పరిష్కరించుకుంటేనే భవిత.. వైఎస్ జగన్ ఇప్పుడు అదే దశలో ఉన్నారు. పైన చెప్పుకున్న సమస్యలతో పాటూ బయటకు తెలియని అనేక సమస్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జగన్ ఇప్పుడు పార్టీపైనా.., ఎమ్మెల్యేల పనితీరుపైనా.., పార్టీ ప్రక్షాళనపైనా.., ప్రభుత్వ ప్రక్షాళనలపైనా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. రానున్న రెండు నెలల్లో జగన్ మొత్తం ఇదే పనిలో ఉందనున్నట్టు వైసీపీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి.
YS Jagan: మూడు సర్వేల ఆధారంగా…!
పార్టీ ప్రక్షాళనలో భాగంగా జిల్లాల వారీగా.., నియోజకవర్గాల వారీగా పార్టీ విబేధాలు, వివాదాలపై దృష్టి పెట్టనున్నారు. ఇప్పటికే మూడు రకాల సర్వే నివేదికలను జగన్ తన డాగర పెట్టుకున్నారట. ప్రభుత్వ నిఘా విభాగం ద్వారా ఒకటి.., సాక్షి మీడియా ద్వారా ఒకటి.., పీకే టీమ్ ద్వారా మరోటి.. ఇలా మూడు రకాల నివేదికలను తన దగ్గర పెట్టుకున్న సీఎం జగన్ వీటిలో ఎమ్మెల్యేలపై ఆరోపణలు, జిల్లాల్లో పార్టీ పరిస్థితి, పార్టీ విబేధాలు, వివాదాలు అన్నిటినీ అధ్యయనం చేశారు. ఒకదానికొకటి సంబంధం లేకుండా మూడు రకాల సర్వేల నివేదికలను క్రాస్ చెక్ చేసుకుని.., మూడిట్లో కలిపి బాగా వ్యతిరేకత, వివాదాస్పదంగా ఉన్న ఎమ్మెల్యేల జాబితా సిద్ధం చేశారట. దాదాపు 50 మంది ఎమ్మెల్యేలను పిలిపించి, నేరుగా సీఎం జగన్ మాట్లాడనున్నారని తెలుస్తుంది. కొన్ని జాగ్రత్తలు, కొన్ని హెచ్చరికలు, కొన్ని సూచనలు తప్పకపోవచ్చు.
మొదటిదశలో ఎమ్మెల్యేల తీరుపై..!!
ఇలా మొదటి దశలో ఈ 50 మంది ఎమ్మెల్యేలతో పాటూ.., కొందరు వివాదాస్పద, ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేలను కూడా పిలిపించనున్నట్టు సమాచారం. ఒక్కో ఎమ్మెల్యేతో 20 నిమిషాల పాటూ ముఖాముఖి మాట్లాడి, సమస్యలు తెలుసుకోవడం, తాను చెప్పాలనుకున్నది చెప్పడం.. ఈ రెండేళ్ల పనితీరు.., రానున్న మూడేళ్ళలో మార్చుకోవాల్సిన విషయాలపై సూటిగా చెప్పనున్నారు. ఇలా ఎమ్మెల్యేల వ్యవహారంపై పూర్తయిన తర్వాత జిల్లాల్లోని పార్టీల ఇంచార్జిలు, మంత్రులతో భేటీ వేయనున్నారు.
ప్రభుత్వ ప్రక్షాళనకు ముహూర్తం.!?
ఎమ్మెల్యేల తీరుపై అన్నీ అయిన వెంటనే ప్రభుత్వ ప్రక్షాళనకు కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. రెండున్నరేళ్ల తర్వాత మంత్రి వర్గంలో మార్పులు తప్పవని సీఎం జగన్ ప్రమాణ స్వీకారానికి ముందే చెప్పారు. దీనిలో భాగంగా ఇప్పటికే 27 నెలలు పూర్తయ్యాయి. మరో మూడు నెలల్లో ప్రభుత్వానికి సగం సమయం పూర్తవుతుంది. మంత్రులకు జగన్ ఇచ్చిన డెడ్ లైన్ కూడా పూర్తవుతుంది. ఆ మేరకు ఇప్పుడున్న మంత్రుల్లో దాదాపు 90 శాతం మందిని మార్చాలనుకుంటున్నట్టు సమాచారం. అయితే సామజిక సమీకరణాలు, సున్నితమైన రాజకీయ అంశాలు ఉంటాయి. మొత్తం 23 మందిలో ముగ్గురిని ఉంచి, 20 మందిని పీకేస్తే.. చాలా మందిలో అసహనం, అసంతృప్తి నెలకొంటాయి. అందుకే మొత్తం అందర్నీ మార్చేస్తే ఎటువంటి వివాదాలు ఉండబోవని జగన్ భావిస్తున్నారట. ముందే చెప్పినట్టు 90 శాతం మందిని మార్చాలా..!? లేదా మొత్తం అందర్నీ తీసేసి కొత్త వారిని తీసుకోవాలా..!? అనే ఆలోచనలో సీఎం జగన్ ఉన్నట్టు సమాచారం. అంటే రానున్న రెండు నెలల్లో జగన్ బాగా బిజీగా గడపనున్నారు. మొదటి దశలో ఎమ్మెల్యేలతో భేటీ అయిన వెంటనే వారిచ్చిన సమాచారం, సమాధానం మేరకు కొందరిని మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదు. సో.. పార్టీ, ప్రభుత్వ ప్రక్షాళన మాత్రం మొదలైనట్టే చెప్పుకోవచ్చు.!