YS Jagan; వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతుంది.. ఎమ్మెల్యేలు కానీ.., ఎంపీలు కానీ.. ఇటు సీఎం స్థాయిలో కానీ ఈ ప్రభుత్వానికి ఉన్న లోపాల్లో ఒకే ఒక్కటి క్షేత్రపర్యటనలు లేకపోవడమే.. గత ప్రభుత్వాలు ఏడాదికి రెండు, మూడు సార్లు రకరకాల కార్యక్రమాలు పేరుతో జనంలో తిరిగేవి. వైఎస్ అధికారంలో ఉన్నపుడు ఏడాదిలో రెండు సార్లు రచ్చబండ అనీ.., కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యాక ప్రజాపథం అనీ.., చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జన్మభూమి మీ ఊరు అని కార్యక్రమాలు నిర్వహిస్తూ… పాలకులు, అధికారులు యంత్రాంగం మొత్తం గ్రామాల్లో తిరిగేది. కానీ గడిచిన రెండేళ్లుగా ఈ క్షేత్ర కార్యక్రమాలు నిర్వహించడం లేదు. కరోనా కానీ..,
ఆసక్తి లేకపోవడం కానీ.., అనుభవ లేమి కానీ కారణాలు ఏమైనా ఉన్నప్పటికీ జగన్ పాలనలో ఇదో లోపంగా చెప్పుకునే స్థాయికి చేరింది. ప్రతిపక్షాలు కూడా సీఎం కాంప్ ఆఫీస్ కె పరిమితమయ్యారు అంటూ పదే పదే విమర్శలు గుప్పిస్తున్నాయి. లోపాలు అధిగమించి, విమర్శలకు సమాధానం చెప్పాల్సిన తరుణం జగన్ కి ఆసన్నమైనది. సో… “వారానికి రెండు సచివాలయాల సందర్శన” అన్నారు. ఇప్పటికే రెండేళ్లు ముగిసిన నేపథ్యంలో ఇక జనంలోకి వెళ్లాలనేది జగన్ ఆలోచన..
YS Jagan; కానీ కొన్ని ఇబ్బందులున్నాయి..!!
జగన్ జనంలోకి వెళ్లడం ఇప్పుడు సులువేం కాదు. కరోనా కారణంగా కొంత కాలం ఆగాల్సి ఉంటుంది. మూడో దశ రాకపోకలు చూసుకుని, షెడ్యూల్ రూపకల్పన చేసుకోవాలి. పైగా ఒకే వారంలో రెండు సచివాలయాలు అంటే రెండు భిన్నమైన జిల్లాల్లో ప్లాన్ చేసుకుంటే ఈ జిల్లాల్లో యంత్రంగం మొత్తం సీఎం దగ్గరే ఉండాలి. ఆ రోజు ఇతర పనులన్నీ నిలిచిపోవాల్సిందే. పైగా ఆర్ధిక భారం కూడా ఎక్కువ ఉంటుంది. నిరుద్యోగుల డిమాండ్లు.., ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించలేకపోవడం.., గ్రామాల్లో చురుకుగా పనులు జరగకపోవడం కొన్ని సమస్యలు. గతంలో టీడీపీ జన్మభూమి కార్యక్రమలు చేపట్టడానికి ముందే ఆ గ్రామంలో గడిచిన ఏడాదిలో జరిగిన అభివృద్ధి పనులు అంటూ కొన్ని అభివృద్ధి, సంక్షేమ పట్టికలు వేసేవారు. దీనిలో మొత్తం వాస్తవం కాకపోయినా ఎంతో కొంత జనాలకు చేరువయ్యేది. ప్రస్తుతం జగన్ ప్రభుత్వానికి అలా చెప్పుకోడానికి ఏమి లేదు. కేవలం సంక్షేమ పథకాల లెక్కలు తప్పితే పనుల లెక్కలు మాత్రం చెప్పలేరు. ఇలా ఇన్ని సవాళ్ల మధ్య సీఎం క్షేత్రానికి వెళ్లాలంటే కొన్ని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది.
ఎమ్మెల్యేలపై అక్కడక్కడా వ్యతిరేకత..!!
ఇటీవల వైసిపి ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగడం ప్రారంభించారు. కొన్ని చోట్ల అనుకోని ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి. రాజధాని అమరావతి ప్రాంతాల్లో నిరసనలతో పాటూ శ్రీకాకుళం జిల్లా, నెల్లూరు జిల్లాల్లోని ఎమ్మెల్యేలకు కూడా నిరసనలు ఎదురయ్యాయి. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యేలకు ఎదురవుతున్న ప్రశ్నలు, ఇబ్బందులు సీఎం స్థాయిలో ఎదురైతే ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుంది. సీఎం జగన్ ఇటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేసే ముందే…. రాజధాని విషయంలో మూడు రాజధానుల విషయంలో ముందడుగు పడాలి. ఆయన అనుకుంటున్నట్టు విశాఖ నుండి పాలన మొదలవ్వాలి. లేకపోతే ఏపీలో ఎవ్వర్నీ మీ రాజధాని ఏది అంటే చెప్పలేని పరిస్థితి ఉంది. పోలవరం ప్రాజెక్టు 2021 జూన్ నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చినా నెరవేరలేదు. రాష్ట్రానికి అత్యవసరమైన రాజధాని, పోలవరం విషయంలో ప్రభుత్వం సత్ఫాలితాలు సాధించిన తర్వాత జనంలోకి వెళ్తే సానుకూలత కనిపించవచ్చు. ఇవేమి లేకుండా కేవలం సంక్షేమ రథం ఊరేగుతూ గ్రామాల్లో పర్యటనలు చేస్తే ఆశించిన అనుకూలత కనిపించకపోవచ్చు అనేది విశ్లేషకుల అభిప్రాయం.
* అన్నిటికీ మించి సీఎం కి చిక్కులున్నాయి. మానసిక అశాంతత నెలకొంది. బాబాయి వివేకా హత్య కేసులో ఒత్తిళ్లు.., కోర్టు కేసులు.., వ్యవస్థలతో వివాదాలు.., రఘురామా వివాదం.. ఈ అన్నిటితో జగన్ సతమతమవుతున్నారు. గతంలో ఏ సీఎం చేయని విధంగా జగన్ వ్యవస్థలతో పేచీ పెట్టుకున్నారు. అందుకే ఇన్ని తలభారాలు పెట్టుకుని జనంలోకి వెళ్లి మాట్లాడాలంటే తడబాటు తప్పకపోవచ్చు..