YS jagan : * కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీలో మొత్తం 33 వార్డులు ఉంటె.., 33 వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. అంటే అక్కడ టీడీపీ లేనట్టా..!? ఉన్నా పోటీ చేయనట్టా..!? శతశాతం ఓటర్ల మద్దతు వైసీపీకి ఉన్నట్టా..!? పోనీ ఇది సీఎం జగన్ సొంత నియోజకవర్గం. శతశాతం బలం ఉంది అనే అనుకుందాం..!
* చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపాలిటీలో 33 వార్డులకు గానూ.. 33 కూడా ఏకగ్రీవం అయ్యాయి. ఇక్కడా వైసిపి వారికే అన్ని దక్కాయి. అంటే ఇక్కడ కూడా టీడీపీ లేనట్టా..?! ఉన్నా పోటీ చేయనట్టా..!? శతశాతం ఓటర్ల మద్దతు వైసీపీకి ఉన్నట్టేనా..!? ఇది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం.
* గుంటూరు జిల్లా మాచర్లలో మొత్తం 31 కి 31 వార్డులు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. ఇక్కడ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంటే ఇక్కడ కూడా టీడీపీ లేనట్టా..!? శతశాతం వైసిపి బలంగా ఉన్నట్టేనా…!?
YS Jagan : ఏకగ్రీవాలతో ఏం చెప్పదలచుకున్నారు..!?
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఏకగ్రీవాలు చేసుకోవాలని వైసిపి ప్రయత్నాలు చేస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో చాల వరకు ప్రయత్నం చేసింది. కొంత మేరకు ఫలితం రాబట్టింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాలపై అధికార పార్టీ కన్ను పడింది. అందుకే ఏదో ఎమ్మెల్యేల మధ్య పోటీ పెడుతున్నట్టు… ఎక్కువ ఏకగ్రీవాలు ఎవరికీ అయితే వారికి సీఎం ఎదో బహుమతి ఇవ్వనున్నట్టు… ఏకగ్రీవాలపై దృష్టి పెట్టారు. చాల జిల్లాల్లో 20 శాతం మందికి కాస్త దారికి తెచ్చుకోగలిగారు. కొన్ని మున్సిపాలిటీల్లో 50 శాతం .. కొన్ని మున్సిపాలిటీల్లో పూర్తిగాను ఏకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవం అంటే ఎన్నిక ఉండదు. ఒక్కరే నిలబడినట్టు. సో.., ఆయనే ఎన్నికనట్టు..! అంటే ఓటర్ల ఆమోదం లేకుండానే కుర్చీ ఎక్కేసినట్టు. అంటే ఒకరకంగా ఇది కృత్రిమంగా పోగేసుకుంటున్న బలం మాత్రమే..!!
YSRCP – ఈ బలం శాశ్వతమా..!?
ప్రస్తుతం రాష్ట్రం మొత్తం మీద అధికార పార్టీ బలం గట్టిగానే ఉంది. ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా అధికార పార్టీకే మొగ్గు ఉంటుంది. కాకపోతే టీడీపీకి ఉన్న బలాన్ని వారికి వదిలేసినా.., వైసిపికి 60 నుండి 65 శాతం బలం మిగిలినట్టే. అంటే ఈజీగా ఈ ఎన్నికల్లో వైసిపి 65 శాతం వరకు గెలుస్తుంది. కానీ..
* అధికారం చేతిలో ఉండడంతో… కృత్రిమంగా.., బలవంతంగా, అయిష్టంగానే అధికార పార్టీ ఏకగ్రీవాలు చేసుకుంటుంది. ఒప్పుకుంటే ఒకే, లేకపోతే ఏదో ఒక మార్గం ఎంచుకుని ప్రతిపక్షాన్ని లొంగదీసుకుంటుంది. అన్ని చోట్లా కాదు కానీ.., సగానికి పైగా ఏకగ్రీవాల వెనుక ప్రలోభాలు, బెదిరింపులు, పవర్ పాలిటిక్స్ జరిగాయి అని మాత్రం చెప్పవచ్చు.
* సహజంగా.. ఎన్నికలు జరిగితే వైసిపికి 60 నుండి 65 శాతం వరకు సానుకూల ఫలితాలు వచ్చే వీలుంది. కానీ.., ఇప్పుడు పవర్ పాలిటిక్స్ ద్వారా ఆ పార్టీ 80 శాతం వరకు గెలుచుకుంటుంది. అంటే 20 శాతం అదనపు బలం పోగుచేసుకుంటుంది. అది కృత్రిమ బలమే. అది బలవంతపు బలమే. సో.. ఇది శాశ్వతం కాదు. ఎప్పటికైనా తిరగబెడుతుంది.
* అంటే… ఇప్పుడు బెదిరింపులు, ప్రలోభాలు, భయంతో వైసిపికి లొంగిన వారు భవిష్యత్తులో మరింత దూకుడుగా వైసిపికి వ్యతిరేకంగా పని చేయక మానరు. అదే జరిగితే ఆ పార్టీకి శత్రువులు ఎక్కువవుతారు. ఇది పార్టీ భవితకు మంచిది కాదు. పేకమేడలా… కృత్రిమ బలంతో గెలిస్తే పార్టీ ఏం సందేశం ఇవ్వాలనుకుంటుంది..!? తమకు ఓటర్లు సంతోషంతో కట్టబెట్టే 60 శాతం కాదనుకుని… ప్రత్యర్ధులు ఏడుపులతో కట్టబెట్టే 80 శాతం ఫలితాలతో వైసిపి ఏం సాధిద్దాం అనుకుంటుంది..!?
(ఈ ఎన్నికల్లో టీడీపీ నేతలు లొంగిపోవడానికి… టీడీపీ ఇంతగా చతికిలబడడానికి.. వైసీపీ ఇంతగా దూకుడుగా వెళ్ళడానికి కారణాలు వచ్చే కథనంలో చెప్పుకుందాం)