YS Jagan: కేంద్రంలో బీజేపీ ఓటమి లక్ష్యంగా కాంగ్రెస్ తో కలిసి పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ పావులు కదుపుతున్నారు.. మరోవైపు బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలవడానికి ప్రాంతీయ పార్టీల కూటమి సిద్ధమవుతోంది.. దీనికి ప్రస్తుతానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జి నేతృత్వం వహిస్తున్నారు… ఏం చేసైనా.., ఎలా చేసైనా.. కేంద్రంలో బీజేపీని దించడానికి కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు కొన్ని.., పీకేతో చేతులు కలిపి రాజకీయం చేయాలనే ప్రయత్నంలో ఉన్నాయి..! ఇక్కడి వరకు ఒకే.., కాకపోతే ఏపీలో బలీయమైన శక్తిగా ఉన్న జగన్ దారెటు..!? బీజేపీతో చీకటి పొత్తుని కొనసాగిస్తారా..!? బీజేపీకి వ్యతిరేక కూటమితో చేతులు కలుపుతారా..!? అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం..!
YS Jagan: వైసీపీ – బీజేపీ చీకటి బంధం..!?
ఏపిలో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కేంద్రంలోని బీజేపీతో సన్నిహిత సంబంధాలు నెరుపుతూ వస్తున్నారు. సీఎం జగన్ కు ఉన్న వ్యక్తిగత కారణాల వల్లనో లేక వైసీపీ పాలనను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకో కేంద్రంలోని బీజేపీతో సయోధ్యగా ఉంటుంది. ఎన్డీఏలో భాగస్వామ్య పక్షంగా లేకపోయినా అంతకు వారికి మించి బీజేపీకి జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ సహకరిస్తూ వస్తుంది. రాజ్యసభలో వైసీపీ ఎంపీలు కీలక బిల్లుల ఆమోదంలో సహకరిస్తూ వస్తున్నారు. అదే విధంగా గుజరాత్ కు చెందిన ఆదానీకి రాష్ట్రంలోని పోర్టులను దారాదత్తం చేయడంతో పాటు అదే గుజరాత్ కు చెందిన అమూల్ కు ఏపి పాడి పరిశ్రమను చేతిలో పెడుతోంది. వీటికి ప్రతిగా కేంద్రంలోని బీజేపీ కొన్ని విషయాల్లో జగన్మోహనరెడ్డికి సహకరిస్తోంది. ఇచ్చుకుంటు వాయనం, పుచ్చుకుంటూ వాయనం అన్నట్లు పరస్పరం సహకరించుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాయి.
YS Jagan: పీకే వ్యూహం బహిరంగమే..!?
కేంద్రంలోని బీజేపీతో వైసీపీ బహిరంగంగా స్నేహం చేయడం లేదు, పూర్తిగా విరోధంగా ఉండటం లేదు అన్నది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే..జగన్ వ్యవహార శైలి ఇలా ఉండగా జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయనున్న తృతీయ కూటమిలోకి గానీ, కాంగ్రెస్ అనుకూల కూటమిలోకి గానీ జగన్ తీసుకువెళ్లాలని మమతా బెనర్జీ ప్రయత్నాలు చేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోడీని గద్దె దించాలన్న లక్ష్యంగా ఉన్న మమతా బెనర్జీ ఇటీవల సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్, లాలూ ప్రసాద్ తదితర నేతలను కలిశారు. ఈ సందర్భంలోనే దేశంలోని ప్రాంతీయ పార్టీల బలాబలాలు, వారి వైఖరి తదితర విషయాలపై చర్చించుకున్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి లు అధికారంలో ఉన్నారు. బలంగా ఉన్నారు, వీరు ప్రస్తుతం ఏ కూటమిలో లేరు కాబట్టి వీళ్లను కూడా తృతీయ కూటమిలో చేర్చుకుని కాంగ్రెస్ గొడుగు కిందకు చేర్చి కేంద్రంలో అధికారంలోకి తీసుకురావాలన్నది ప్రశాంత్ కిషోర్ (పీకే) వ్యూహంగా ప్రచారం జరుగుతోంది.
జగన్ ఎటు ఉన్నారో..!?
ఈ తరుణంలోనే జగన్మోహనరెడ్డి ఎటు అనే విషయంపై ఢిల్లీ స్థాయిలో చర్చ జరిగిన సందర్భంలో మమతా బెనర్జీ ఆ విషయాన్ని కుండ బద్దలు కొట్టారు. నవీన్ పట్నాయక్, జగన్ ఇద్దరూ తృతీయ కూటమిలో ఉంటారని మీడియాకు మమత చెప్పేశారు. ఓ పక్క కేంద్రంలోని బీజేపీతో రహస్య స్నేహం నిర్వహిస్తున్న జగన్మోహనరెడ్డి తృతీయ ఫ్రంట్ లో ఉంటారని మమత ఎలా చెప్పారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ మారింది. తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. మమత బెనర్జీ అంత కాన్ఫిడెంట్ గా జగన్ తృతీయ ఫ్రంట్ లో ఉంటారని చెప్పారంటే జగన్ తో ఏమైనా హామీ తీసుకున్నారా ? 2024 ఎన్నికల నాటికి కాంగ్రెస్ కూటమిలో కలుస్తామని జగన్ ఏమైనా ఆమెకు చెప్పారా? అన్నది మిలియన్ డాలర్ ల ప్రశ్న. ఒక వేళ జగన్ అలా చెప్పినట్లైయితే బీజేపీ చూస్తూ ఊరుకుంటుందా?. ఒ పక్క మమత బెనర్జీని నరదా చిట్స్, రోజ్ వాలీ టెండర్లు తదితర కేసుల్లో కేంద్రంలోని బీజేపీ చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. ఒక వేళ జగన్ మోర ఎగరేస్తే మమతకు లాగానే కేంద్రంలోని బీజెపీ చుక్కలు చూపించే అవకాశం ఉంటుంది. జగన్ ను ఇబ్బంది పెట్టడానికి బీజేపీ కొత్తగా దారులు ఏమీ వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు అన్నది అందరికీ తెలిసిందే. ఆల్ రెడీ జగన్మోహనరెడ్డి సీబీఐ కేసులో బెయిల్ పై ఉన్నందున రాజకీయంగా బీజేపీ హాండ్స్ లో ఉంచుకోవడం వారికి తేలికైన పని. ప్రస్తుత పరిస్థితిలో జగన్ కేంద్రంలోని బీజేపీతో వైరం పెట్టుకుంటే కొరివితో గొక్కున్నట్లే అవుతుంది. ఈ సంగతి తెలిసి జగన్మోహనరెడ్డి తృతీయ కూటమిలో కలుస్తానని బహిరంగా చెప్పే ధైర్యం చేయరు.
బీజేపీ చూస్తూ ఊరుకోదుగా..!?
అయితే మమతా బెనర్జీ కాన్ఫిడెంట్ గా చెప్పారు అంటే వారి మధ్య అంతర్గత చర్చ జరిగి ఉండవచ్చని అంటున్నారు. అయితే జగన్మోహనరెడ్డిని పూర్తిగా బీజేపీ నమ్మదు. బీజేపికి జగన్ పూర్తిగా మద్దతు ఇవ్వరు. ఎందుకంటే బీజేపీతో బహిరంగ పొత్తు పెట్టుకుంటే వైసీపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న క్రిస్టియన్, ముస్లిం మైనార్టీ ఓట్లు దూరమయ్యే ప్రమాదం ఉంది. అందుకే జగన్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహారం నడుపుతున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే మమతా బెనర్జీ, సోనియా గాంధీ లు జగన్ తృతీయ ఫ్రంట్ లో ఉంటారని బహిరంగంగా చెప్పడమే కొత్త ట్విస్ట్. ఈ తరుణంలో జగన్మోహనరెడ్డి ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలను కలిసి మమత వ్యాఖ్యలను ఖండించి తాను ఆ కూటమిలోకి వెళ్లడం లేదని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. లేకుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదు. ఇప్పుడు జగన్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకుంటారా లేక మమత బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ కూటమిలో చేరతారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. దేశంలో బలమైన ప్రాంతీయ పార్టీల్లో మొదట తృణమూల్ కాంగ్రెస్, రెండవ స్థానంలో ఎఐడీఎంకే, మూడవ స్థానంలో వైసీపీ ఉంది అన్నది అందరికీ తెలిసిందే. అందుక జాతీయ స్థాయిలో వైసీపీకి కీలకమైన ప్రాధాన్యత ఉంది. ఈ పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల నాటికి వైసీపీ స్టాండ్ ఏమిటి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.