YS Sharmila ; దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అంటే చెరగని, చెదరని అభిమానం ఉన్న వాళ్ళకి కొదవ లేదు. తెలుగు గడ్డపై ఆయన ఒక బ్రాండ్. ఒక లెజెండ్. ఒక నవ్వుతున్న నమ్మకం..! అందుకే ఆయన పేరుతో జగన్ పెట్టిన పార్టీ ప్రభంజనం సృష్టించి సంక్షేమ ప్రభుత్వంగా రూపుదిద్దుకుంది. జగన్ పార్టీ పెట్టి తొమ్మిదేళ్లు దాటింది. అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తుంది. ఇప్పుడిప్పుడే వైఎస్ కి తగ్గ వారసుడిగా సంక్షేమ బాట వేసుకుంటున్నారు. అయితే వైఎస్ కుటుంబం నుండి మరో పార్టీ వస్తే..? వైఎస్ వారసత్వమే మరో పార్టీ పెడితే..? అది తెలుగునాట కొత్త సంచలనమే.. షర్మిల దానికి దారి తీయబోతుంది. కొత్త పార్టీ ప్రకటనకు సిద్ధమవుతుంది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకుంటుంది. రేపు కీలక సమావేశం కూడా నిర్వహించబోతుంది..!!
YS Sharmila ; జగన్ – షర్మిల కి మధ్య గ్యాప్ ఎంత ఉంది..!?
వైఎస్ జగన్, షర్మిల ఇద్దరికీ చెడిందా..? వారిద్దరి మధ్య ఎంత గ్యాప్ ఉంది..? అసలు ఈ గ్యాప్ రావడానికి కారణాలు ఏంటి..? అనే అంశాలు కీలకం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం షర్మిల చాల చేశారు. జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల వేలాది కిలోమీటర్లు నడిచారు. 2014 ఎన్నికల నాటికి జగన్ తర్వాత స్థానంలో పార్టీలో షర్మిల పేరు మాత్రమే వినిపించేది. అలా అలా 2014 తర్వాత షర్మిల సైలెంట్ అయ్యారు. 2019 లో జగన్ అధికారంలోకి వచ్చాక షర్మిలకి కీలక బాధ్యతలు అప్పగిస్తారని చాల మంది భావించారు. పార్టీలోనూ.., ప్రభుత్వంలోనూ షర్మిల చక్రం తిప్పే స్థాయికి వెళ్తారని అనుకున్నారు. కానీ ఇదేం జరగలేదు. వైఎస్ అభిమానులు అనుకున్నట్టు షర్మిలకి ప్రాధాన్యత దక్కలేదు.. పైగా ఆమెని జగన్ పట్టించుకోనంత వరకు గ్యాప్ ఏర్పడింది. అలా అని.. ఇద్దరి మధ్య పెద్ద గొడవలు, విబేధాలు ఏమి లేవు. కేవలం… ప్రాధాన్యత విషయంలో మాత్రం వచ్చిన గ్యాప్ ఇప్పుడు పెద్దదిగా మారింది..!
వైఎస్ షర్మిల ; రేపు సమావేశ అజెండా ఏమిటి..!?
వైఎస్ అభిమానులకు షర్మిల నుండి వస్తున్న సందేశం ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో సంచలనంగా మారింది. వైఎస్ షర్మిల రేపు లోటస్ పాండ్ లో ఒక సమావేశం నిర్వహించబోతున్నారని.. దానికి అభిమానులు అందరూ హాజరు కావాలని ఆమె కాల్ చేసి ఆహ్వానిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. దీన్ని వైఎస్ అభిమానులు కొందరు ఖరారు చేస్తున్నారు. కొందరు కొట్టిపడేస్తున్నారు. కాకపోతే సమావేశం ఎందుకు..? ఆ సమావేశం అజెండా ఏమిటి..? అనేది మాత్రం ఊహించడం కష్టంగానే మారింది. పార్టీ జెండా, అజెండా చర్చించడానికే సమావేశం నిర్వహిస్తున్నారనేది ఒక ప్రచారం కాగా.. ఆమెకు పార్టీ పెట్టె ఉద్దేశం లేదని.., ఒక జాతీయ పార్టీలో చేరడానికి క్యాడర్ ఉద్దేశాలను తెలుసుకుంటున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. రేపు ఒకవేళ సమావేశం జరిగితే మాత్రం అది ఆమె రాజకీయ అజెండా అని మాత్రమే అనేది మాత్రం ఖాయంగా చెప్పుకోవచ్చు.
Must Read ; షర్మిల పార్టీ ఇద్దరు సీఎంల కొత్త ఆలోచనా..!?
పార్టీకి అవకాశం.. అంత సీన్ ఉందా..!?
తెలుగునాట రాజకీయ చైతన్యానికి కొదవ లేదు. అదే సందర్భంలో కుల చైతన్యానికి కూడా కొదవ లేదు. ఏపీలో జగన్, చంద్రబాబు.. జనసేన వంటి పార్టీలు ఉన్నాయి. జనసేనని పక్కన పెట్టేస్తే.., ఏపీలో కమ్మ ప్రతినిధ్యంగా టీడీపీ.., రెడ్డి ప్రతినిధ్యంగా వైసీపీ రాజకీయాన్ని నడిపిస్తున్నాయి. కానీ తెలంగాణాలో మాత్రం భిన్న పరిస్థితులు ఉన్నాయి. అక్కడ రెడ్డి సామాజికవర్గానికి సరైన దారి లేదు. కేసీఆర్ వరుసగా రెండుసార్లు గెలిచారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక వరుసగా రెండు సార్లు వెలమ దొరల పెత్తనమే వచ్చింది. తెలంగాణ సాధనలో కీలకంగా పని చేసిన కాంగ్రెస్ చావుబతుకుల మధ్య ఉండగా.., బీజేపీ బలవంతపు బలంతో రాజకీయం చేస్తుంది. రెడ్డి సామాజికవర్గానికి సరైన తోడు, నీడ లేకుండా పోయింది. అందుకే ఏపీలో జగన్ ఛరిష్మా ఉన్నట్టే తెలంగాణాలో కూడా రెడ్డిలకు, వైఎస్ అభిమానులకు షర్మిల అనే ఒక చరిష్మా పని చేస్తుందేమో అని ఒక కొత్త ఆలోచన వచ్చింది. కేసీఆర్ కి ప్రత్యామ్నాయం బీజేపీ అనుకుంటే.. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం షర్మిల కాబోతున్నారు అని తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్న ఒక మాట..!! అందుకే షర్మిల మనసులో ఏముంది..? రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయి..? అనే అంశాలపై స్పష్టత వచ్చే వీలుంది..!!