YS Sharmila: రాజకీయ పార్టీ ఎవరి కోసం పెట్టారు..!? ఎవరికి వ్యతిరేకంగా పెట్టారు..!? ఎవరు పెట్టిస్తే పెట్టారు..!? ఆమె ఎవరి బాణం..? ఎవరి పైకి బాణం..!? ఈ ప్రశ్నలన్నీ కొన్ని రోజులుగా తెలుగు రాజకీయ అభిమానుల్లో/ వైఎస్ కుటుంబ అభిమానుల్లో కూడా మిగిలిపోతున్నాయి. సమాధానం స్పష్టంగా దొరకడం లేదు. అయితే ఈ ప్రశ్నలను ఛేదించడానికి ఎక్కువ సమయం అవసరం లేదు. ఒక్కో అనుమానాన్ని షర్మిలానే తీర్చేస్తున్నారు. ఒక్కో ప్రశ్నకు ఆమెనే సమాధానం ఇచ్చేస్తున్నారు. తన అన్న .. ఏపీ సీఎం జగన్ పై ఒకో వేదికపై ఒక్కోలా స్పందిస్తూ తన అంతర్గత వ్యతిరేకత / తమ విబేధాలను మాత్రం బయటపడేలా చేస్తున్నారు..!
YS Sharmila: సాక్షి పేరెత్తి.. జగన్ టార్గెట్ గా..!!
షర్మిల ఏమి తెలియక మాట్లాడరు. మాట్లాడడంలో జగన్ కంటే ఒక అడుగు ముందే ఉంటారు. సూటిగా, స్పష్టంగా చెప్పేస్తారు. కొంచెం తెలివిగా.. ఆచితూచి మాట్లాడతారు. అటువంటి షర్మిల ఈరోజు తన ఎదురుగా సాక్షి విలేఖరి వీడియో తీస్తుండగా… “మీ కవరేజీ చాల్లెమ్మా.. ఎలాగూ సాక్షి మా కవరేజి ఇవ్వదుగా..” అంటూ ఈరోజు చేసిన వ్యాఖ్య అలజడి రేపింది. జగన్, షర్మిల.. వైఎస్ కుటుంబ అభిమానులకు గుచ్చుకుంది. ఇన్నాళ్లు ఇద్దరూ ఒకటే.. ఒకరు తెలంగాణాలో, ఒకరు ఏపీలో రాజకీయం అనుకున్న వైఎస్ అభిమానులకు షర్మిలకు/ జగన్ కు మధ్య విబేధాలు ఒక్కోటీ బయటపడుతున్నాయి. గత నెలలలో జరిగిన ఏ మీడియా మీట్ లో “నాకు ఎందుకు పదవి ఇవ్వలేదో జగన్ ని అడగండి” అంటూ నేరుగా వ్యాఖ్యలు చేసారు. సో.. ఆమె వ్యాఖ్యలు జగన్ కి వ్యతిరేకం. ఆ ఇద్దరి మధ్య విబేధాలు అనేవి ఫిక్స్..!!
జూలై లో స్పష్టత..! ఆవిర్భావ సభ ద్వారా అజెండా..!?
షర్మిల రాజకీయ పార్టీ పూర్తిస్థాయిలో ఇంకా రాలేదు. ప్రస్తుతానికి ఆమె ఒక పార్టీ పేరు, వేదిక లేకుండా ప్రాక్టీస్ మ్యాచ్ మాత్రమే ఆడుతున్నారు. జూలై నెలలో పార్టీ ఆవిర్భావ సభ ఉంది. వైఎస్ జయంతిని పురాక్సారించుకుని అప్పుడు పెట్టారు. ఆ సభకి వైఎస్ కి అత్యంత ఆత్మీయులను ఆహ్వానిస్తున్నట్టు సమాచారం. సూరీడు, కేవీపీ రామచంద్రరావు సహా వైఎస్ తో కలిసి పని చేసిన కొందరు కీలక కాంగ్రెస్ పార్టీ నేతలను ఆహ్వానిస్తున్నట్టుగా సమాచారం. వైఎస్ అసలైన అభిమానులు నాతోనే ఉన్నరని.. వైఎస్ కి అసలైన వారసురాలిని తానేనని షర్మిలా చాటి చెప్పాలి అనుకుంటున్నారు. తద్వారా ఏపీలోని వైఎస్ అభిమానులకు కూడా చేరువై.. వచ్చే రెండేళ్లలో ఇక్కడ కూడా రాజకీయ పునాదులు నిర్మించాలనేది షర్మిల వ్యూహంగా తెలుస్తుంది. ఓ జాతీయా పార్టీ వ్యూహంలో భాగంగా ఆమె ఇవన్నీ చేస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే దీనిపై అప్పుడే ఏదీ ఫిక్సవ్వలేం..!!