“న్యూస్ ఆర్బిట్” ప్రత్యేక క్రైమ్ ప్రతినిధి
ఓ వ్యక్తి మృతిపై అనుమానాలు ఉంటే.., మొదట పోలీసులు దాన్ని ఐపీసీ సెక్షన్ 174 ప్రకారం నమోదు చేయాల్సి ఉంటుంది. అక్కడితో అయిపోదు… ఆ వ్యక్తి మృతికి అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉంటుంది.. ఒకవేళ ఆ కేసులో లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత ఎలాంటి అనుమానాలు లేకుంటే దాన్ని పక్కాగా ఇన్వెస్టిగేషన్ అధికారి నివేదిక రూపంలో డీఎస్పీ స్థాయి అధికారికి పంపాల్సి ఉంటుంది. మరి సదరు మృతి మీద దర్యాప్తులో ఇన్వెస్టిగేషన్ టీమ్ కు ఖచ్చితమైన ఆధారాలు లభించినప్పుడు మాత్రమే సదరు కేసును ఇతర సెక్షన్లకు బదిలీ చేయాలి…! తాజాగా వైయస్ వివేకానందరెడ్డి అనుమానాస్పద మృతి కేసులో సిబిఐ అధికారులు సెక్షన్ 302 హత్య కేసు కింద మార్పు చేశారు. దీంతో పాటు ఇప్పటి వరకు ప్రాథమిక విచారణ నిర్వహించిన బృందాన్ని పక్కనపెట్టి సిబిఐ నేర పరిశోధన విభాగానికి కేసును బదిలీ చేశారు. డిఎస్పీ స్థాయి అధికారిని కేసు ఇన్వెస్టిగేషన్ అధికారిగా నియమించారు..!!
హత్య ఆయుధం లభించిందా ??
సాధారణంగా హత్యకేసులో హత్యకు ఉపయోగించిన ఆయుధమే ప్రధాన ఆధారంగా పరిగణిస్తారు. అలాగే హతుడికి సంబందించిన ఆనవాళ్లు కేసులో ప్రధానమైనవి. ఈ రెంటిలో ఏవి లేకున్నా దాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోదు. వైయస్ వివేక హత్య కేసులో మృతుడి ఆనవాళ్లు స్పష్టం గా ఉండడంతో ఇప్పుడు అతని హత్యకు ఉపయోగించిన ఆయుధమే ప్రధానమైనది.
ప్రాథమిక దర్యాప్తులో సుమారు 85 మందిని విచారించిన సిబిఐ అధికారులు.., దీనిలో కీలకమైన ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. గత వారం రోజులుగా కేసును అమితమైన వేగంతో దర్యాప్తు చేస్తున్న బృందానికి హత్యకు ఉపయోగించిన కొన్ని రకాల ఆయుధాలు లభించినట్లు సమాచారం. దీంతో సీబీఐ అధికారులు ఉన్నతాధికారులకు నివేదించి కేసును హత్య కేసుగా మార్పు చేసి, దర్యాప్తును వేగవంతం చేసి వెంటనే చార్జిషీట్ దాఖలు చేసేందుకు సమాయత్తమవుతున్నారు.!
కారణాలు వ్యక్తిగత వైరాలేనా ..?
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కు పూర్తిగా వ్యక్తిగత వ్యవహారాలు కారణమని తెలుస్తోంది. దీనిలో ఆర్థిక సంబంధాలు ముడిపడి ఉన్నట్లు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. వివేక ఫోన్ నెంబర్ లో హత్య జరిగిన రోజు దగ్గరనుంచి గత మూడు నెలలుగా ఆయన కాల్ లిస్ట్ సేకరించిన సిబిఐ.. దానిలో కీలకమైన వ్యక్తుల అందరినీ విచారించింది. దీనిలో కొన్ని సెటిల్మెంట్ వ్యవహారాలు, కొన్ని కుటుంబ పరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక హత్య జరిగిన రోజు సంఘటనా స్థలంలో ని సమీప సెల్ టవర్ల నుంచి వెళ్ళిన కాల్స్ ను సిబిఐ వడబోసింది.
దీంతోపాటు రాజకీయ పరమైన విభేదాలతోనే హత్య జరిగి ఉంటుందా..? అనే కోణంలోనూ సిబిఐ వివరాలు సేకరించింది. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఓ చెప్పుల దుకాణం యజమాని అకౌంట్ నుంచి భారీగా నగదు బదిలీలు జరిగినట్లు గుర్తించిన సిబిఐ అధికారులు అతనిని, అతడికి సంబంధించిన వ్యక్తులను విచారించగా కీలకమైన ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. వారి వద్ద నుంచే మారణాయుధాలు లభించి కేసును వెంటనే హత్య కేసు గా మార్చినట్లు, చార్జిషీటు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే సిబిఐ ఈ కేసు పూర్తి నివేదికను చార్జిషీట్లను నేరుగా న్యాయస్థానానికే పంపనుంది. దీంతో అసలు ఈ కేసులో నిందితులు ఎవరు..? ఏ కారణాల చేత ఈ వ్యవహారం జరిగిందనేది కొద్దిరోజుల్లోనే తెలిసే అవకాశం ఉంది.