YS Viveka Murder: సీఎం జగన్ బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాఫ్తులో కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి.. ఈ కేసులో మొదటి నుండి కీలక అనుమానితుడు/ సాక్షిగా ఉన్న నైట్ వాచ్ మెన్ రంగన్న ఇచ్చిన సమాచారం అంటూ కొన్ని సంచలన అంశాలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.. సరిగ్గా ఏడాది కిందట ఈ కేసు దర్యాప్తుని ఆరంభించిన సీబీఐ కి ఈ రోజు తెలిసిన అంశాలతో దాదాపు 90 శాతం కేసుని ఛేదించినట్టే అని చెప్పుకోవచ్చు. ఇంకా ఎటువంటి ఒత్తిళ్లు..? రాజకీయ లాబీయింగులు లేకపోతే ఈ నెలాఖరులోగా ఈ కేసుకి సంబంధించి కొన్ని అరెస్టులు, ఛార్జీషీట్లు కూడ ఉండవచ్చని సమాచారం..!
YS Viveka Murder: రూ. 8 కోట్లు.. 9 మంది హంతకులు..!!
నైట్ వాచ్ మెన్ రంగన్న, పనిమనిషి లక్ష్మి, వివేకా పీఏ జగదీశ్ రెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ హిదయతుల్లా, డ్రైవర్ దస్తగిరితో పాటూ వివేకా ముఖ్య అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, వైద్యుడు శంకరయ్య, స్థానిక సీఐ… తదితరులు ఈ కేసులో మొదటి నుండి సాక్షులు గానూ.. కీలక అనుమానితులుగానూ ఉన్నారు. వీరికి సమాచారం తెలిసే ఉంటుంది.. లేదా వీరి ప్రమేయం ఉంది ఉంటుంది అని… సిట్ విచారణ సందర్భంగా పోలీసులు అనుమానించారు, సీబీఐ విచారణలో కూడా తేల్చారు. అందుకే గడిచిన 44 రోజుల నుండి సీబీఐ ఈ అందర్నీ వరుసగా పిలిపిస్తూ విచారిస్తూనే ఉంది. తాజాగా నైట్ వాచ్ మెన రంగన్న ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ హత్యని రూ. 8 కోట్ల సుపారీ ఇచ్చి చేయించినట్టు తెలుస్తుంది. 9 మంది బయటి వ్యక్తులు వచ్చి ఈ హత్యా చేశారని.. ఇద్దరు ముఖ్య నాయకులే ఈ సుపారీ ఇచ్చి హత్యకు పురమాయించారని రంగన్న చెప్పినట్టు సమాచారం.. అయితే ఆ ఇద్దరూ ఎవరు..!? రంగన్న చెప్పిన విషయాల్లో వాస్తవాలు ఎంత మేరకు ఉన్నాయి..? అనేది కూడా అనుమానించాల్సిన అంశాలే.
ఆ ఇద్దరూ..!? ఈ ఇద్దరేనా..!?
వివేకా హత్య కేసులో కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు, టీడీపీ వర్గాలు ఇలా భిన్నమైన అనుమానాలున్నాయి. అప్పట్లోనే వివేకా కుమార్తె సునీత రెడ్డి 14 మంది పేర్లుతో తన అనుమానితుల జబితాని పోలీసులకు, కోర్టుకి అందించారు. దీనిలో చూస్తే కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, సీఐ, వైద్యుడు, ఎర్ర గంగిరెడ్డి సహా కొన్ని కీలక పేర్లున్నాయి. కానీ అందరి కళ్ళు ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలపైనే ఉన్నాయి. వీరిలో ఓ ఇద్దరు కలిసి ఈ హత్యకి పన్నాగం పన్ని.. కిరాయి హంతకులను మాట్లాడారని సమాచారం. ఈ కేసు ఛేదనలో సీబీఐ రాబట్టిన సమాచారం అత్యంత గోప్యంగా ఉంటుంది. విచారణ అంశాలు, నివేదికలను ఎప్పటికప్పుడు ఢిల్లీకి, సీబీఐ పెద్దలకు చేరుస్తున్నారు. ఉన్నస్థాయి నుండి వచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ లీకులు ఇస్తున్నారు. అంటే ఒక ప్రణాళిక ప్రకారమే.. ఈ దర్యాప్తు కూడ సాగుతున్నట్టు చెప్పుకోవచ్చు..!
రంగన్నని నమ్మొచ్చా..!?
అయితే రంగన్న చెప్పిన అంశాలను కూడా పూర్తిగా నమ్మగలమా..!? అంటే దీనిలో చాలా అనుమానాలున్నాయి. ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఎవరో ప్రైవేట్ వ్యక్తులతో సుపారీ గురించి మాట్లాడుకుంటే నైట్ వాచ్ మెన్ కి ఎలా తెలుస్తుంది..!? అయిదుగురు కొత్త వ్యక్తులు ముందురోజు వచ్చారు అని చెప్తున్నారు..! ఆ సమయంలో ఎవరు అనుతించారు..!? వివేకా చెప్తేనే వచ్చారా..!? లేదా ఈ వాచ్ మెంట్ పంపించారా..!? సుపారీ ఇంత అని వాళ్ళు, వీళ్ళు అనుకుంటే చెప్పడమే తప్ప తనకు తెలిసి అయితే ఈ వ్యవహారాలన్నీ జరిగి ఉండవుగా..!? పనిమనిషి, వాచ్ మెన్ స్థాయిలో కూడా పేమెంట్ విషయం తెలిసినంత చిన్న మర్డర్ కాదు. సో.. రంగన్న మాటల్లో కూడా కొన్ని అనుమానాలున్నాయి. ఇలా చూసుకుంటే సీబీఐ విప్పాల్సిన చిక్కుముళ్ళు ఇంకా చాలానే ఉన్నాయి. అయితే కూపీ లాగితే ఈ అంశాలు తెలుసుకోవడం సీబీఐకి పెద్ద కష్టమేమి కాదు..!!