ప్రస్తుత సీఎంకి చిన్నాయినా.., మాజీ సీఎంకి అత్యంత ఇష్టమైన తమ్ముడు…, మాజీ సీఎం భార్యకి వివేకం అన్న…! రాష్ట్రంలోని అత్యంత రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబంలో సంచలనాత్మకంగా హత్యకు గురైన వివేకానందరెడ్డి ఉదంతం ఇప్పట్లో ఎవ్వరూ మరిచేది కాదు. ఈ హత్యపై ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు జరుగుతుంది.
వైఎస్సాఆర్ కి అత్యంత ఇష్టమైన తమ్ముడు వివేకా… అందుకే వైఎస్ ఈయనను బుద్ధుడు అని పిలిచేవారు. విజయమ్మ కూడా “వివేకం అన్న” అంటూ పిలిచేవారు. జగన్ ఆప్యాయంగా చిన్నాయినా అంటూ పలకరించేవారు. బయటకు తెలియకుండా పులివెందుల రాజకీయాన్ని మూడు దశాబ్దాలుగా ఆయన నడిపించేవాడు అని విజయమ్మ పుస్తకంలోనే రాశారు. ఎవరు అవునన్నా, కాదన్నా వైఎస్ మరణం తర్వాత జగన్ కి అండగా నిలబడింది వివేకనే..! ఇటువంటి వ్యక్తి హత్య ఉదంతంపై ఏడాది దాటినా ఏమి తేలడం లేదు. మరి ఈ తరుణంలో వైఎస్ ఆత్మ – జగన్ అంతరాత్మ సంభాషిస్తే ఎలా ఉంటుంది..? అనేది “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేక కథనం.
వైఎస్ ఆత్మ : ఏరా నానా జగనూ…! చిన్నాన్న హత్య కేసు ఎటూ తేల్చలేదు. 18 నెలలు గడుస్తుంది. ఇప్పటి వరకు హత్య ఎవరు చేసారు? అనే స్పష్టత రాలేదు. బాధ్యులను గుర్తించి, కఠిన చర్యలు తీసుకునేలా చేస్తావు అనుకుంటే… నీలోనూ వేగం లేకపోతే ఎలారా..? ఏమైంది నానా…??
జగన్ అంతరాత్మ :
లేదు నాన్న.., చిన్నాయినా హత్య విషయంలో ఎక్కువగా మానసికంగా కుంగిపోయింది నేను. మీరు దూరమై, ఆయన దూరమయ్యాక అత్యంత ఒంటరిగా మిగిలింది నేను నాన్న. కానీ నా పరిస్థితులు వేరేలా ఉన్నాయి. “తుపాను వేళన సముద్రం నడిమధ్యలో నావలో ఒంటరిగా ఉన్నట్టు… బాబాయి హత్య జరిగిన నాటికి నేను అదే పరిస్థితిలో ఉన్నాను.” ఎన్నికల ప్రచారం.., మన ప్రత్యర్థి చంద్రబాబుని ఓడించే నా “రాజకీయ చావు- బతుకుల పోరాటంలో ఉన్నాను” ఆ సమయంలో బాబాయి హత్యకు గురి కావడం ఒకేసారి కోపం, నిస్సహాయత, అసహనం.., పుట్టుకొచ్చాయి. కానీ ఎన్నికల హడావిడి కారణంగా దృష్టి పెట్టలేకపోయాను”
సీబీఐ వచ్చింది…! నిజాలు తేలుస్తుంది…!
“కానీ నాన్న… నేను సీఎం అయిన తర్వాత ఈ హత్య విషయంలో సీరియస్ గా దర్యాప్తు చేయించాను. మీ దగ్గర డీజీపీగా చేసిన మహంతి కుమారుడు, కడప ఎస్పీ అభిశేక్ మహంతి చేత దర్యాప్తు చేయించాను. దీనిలో నాకు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు.., అంతుచిక్కని వ్యవహారాలు… బయటకు వస్తున్న తరుణంలో… ఇటు మన ప్రత్యర్థి చంద్రబాబు రాజకీయ విమర్శలు, అటు చెల్లమ్మ సునీత రెడ్డి అనుమానాలు రేకెత్తించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సీరియస్ గానే విచారణ చేయించాను. ఓ దశలో దీనిలో మన కుటుంబం, బంధువర్గంలో ఏమైనా పాత్రలున్నాయా..? ఉన్నా ఉపేక్షించకూడదు.., అనే కోణంలో కూడా దర్యాప్తు సాగింది. ఈ సమయంలో చెల్లమ్మ పిటిషన్, ఇతర వ్యవహారాలు కారణంగా మరింత వాస్తవాలు కోసం కోర్టు ద్వారా సిబిఐ రంగంలోకి దిగింది.
నేను హామీ ఇస్తున్నా నాన్న…!!
“సీబీఐ దర్యాప్తు కీలక దశలో ఉంది. నిజాలు త్వరలోనే బయటకు వస్తాయి. ఈ హత్య కేసులో ఎవరున్నా… మన బంధువులే అవ్వనీ, మన ప్రత్యర్థులే అవ్వనీ, ఎంతటి వారైనా ఉపేక్షించను. దర్యాప్తులో వెల్లడైన వాస్తవాల్లో మన దగ్గరి వాళ్ళ పాత్ర, ప్రమేయం ఉండకూడదు అని కోరుకుంటున్నాను. ఒకవేళ ఆ విధంగా ఉన్నా … ఎంతటి వారైనా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించనని మీకు హామీ ఇస్తున్నాను నాన్న…!”